చరిత్రకు అడుగు దూరంలో ఆగిపోయిన తనూజ.. ఈ బిగ్ బాస్ రన్నరప్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ!
105 రోజుల పాటు ఉత్కంఠగా సాగి, ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ముగిసింది. ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ విన్నర్ గా నిలిచాడు. లేడీ సింగం తనూజ ఫస్ట్ రన్నరప్ గా మిగిలిపోయింది. చరిత్రకు అడుగు దూరంలో ఆగిపోయిన తనూజ ఎంత రెమ్యునరేషన్ అందుకుందో ఇక్కడ చూద్దాం.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కు ఎండ్ కార్డు పడింది. ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి గ్రాండ్ ఫినాలే ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ విజేతగా నిలిచాడు. కామనర్ గా హౌస్ లో అడుగుపెట్టిన అతను ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఆమె రెమ్యునరేషన్ ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది.
తనూజ పుట్టస్వామి (instagram-Thanuja Puttaswamy)
తనూజ రెమ్యునరేషన్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో తనూజ ఆటతోనూ, అందంతోనూ ఆకట్టుకుంది. కానీ ఫినాలేలో కల్యాణ్ కంటే ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తనూజ అదరగొట్టింది. తనూజాకు వారానికి రూ.2.50 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అందించారు. మొత్తం 15 వారాలకు కలిపి రూ.37 లక్షల 50 వేలు ఆమె ఖాతాలో వేసుకుంది.
ప్రైజ్ మనీ కంటే ఎక్కువ
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో తనూజ రెమ్యునరేషన్ విన్నర్ పడాల కల్యాణ్ కు దక్కిన ప్రైజ్ మనీ కంటే ఎక్కువ కావడం విశేషం. బిగ్ బాస్ 9 విన్నర్ గా నిలిచిన కల్యాణ్ కు రూ.35 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. నిజానికి ప్రైజ్ మనీ రూ.50 లక్షలు. కానీ డీమాన్ పవన్ రూ.15 లక్షల సూట్ కేస్ ఆఫర్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కల్యాణ్ కు రూ.35 లక్షలే వచ్చాయి.
చరిత్రకు అడుగు దూరంలో
తనూజ పుట్టస్వామి చరిత్రకు అడుగు దూరంలో ఆగిపోయింది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొదటి మహిళా విజేతగా నిలిచి, ఆమె హిస్టరీ క్రియేట్ చేస్తుందేమో అనిపించింది. బిగ్ బాస్ తెలుగు రెగ్యులర్ సీజన్లలో ఇప్పటివరకూ అమ్మాయి విన్నర్ కాలేదు. ఫస్ట్ సీజన్ లో శివ బాలాజీ నుంచి లాస్ట్ సీజన్ లో నిఖిల్ వరకూ అందరూ మేల్ విన్నర్సే. బిగ్ బాస్ ఓటీటీలో మాత్రం బిందు మాధవి ట్రోఫీ సొంతం చేసుకుంది.
విన్నర్ కల్యాణ్
ఉత్కంఠ రేపిన బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ పోరులో చివరకు ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ విన్నర్ గా నిలిచాడు. ఆదివారం ఫినాలే ఎపిసోడ్ లో టాప్-5లో కల్యాణ్, తనూజ, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ ఉన్నారు. ఇందులో సంజన ఫస్ట్, ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యారు. డీమాన్ పవన్ రూ.15 లక్షల ఆఫర్ తీసుకుని వచ్చేశాడు. చివరకు తనూజ, కల్యాణ్ మిగిలారు. కల్యాణ్ కప్ దక్కించుకున్నాడు.