Aerophobia: యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌కు వింత భయం- విమాన ప్రయాణం అంటే వణుకు, ఒత్తిడి- అసలు ఏంటీ ఏరోఫోబియా? ఎందుకు వస్తుంది?

Tiger Shroff Reveals His Aerophobia: తెరపై సాహసోపేతమైన ఫైట్లతో అలరించే బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఒక వింత మానసిక సమస్యతో బాధపడుతున్నారు. విమాన ప్రయాణాలంటేనే భయపడే 'ఏరోఫోబియా' తనను వెంటాడుతోందని, దీని కోసం త్వరలో థెరపీ తీసుకోనున్నట్లు టైగర్ ష్రాఫ్ వెల్లడించారు. ఆ ఏరోఫోబియా గురించి తెలుసుకుందాం.

Published on: Mar 31, 2026, 14:11:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గాలిలో పల్టీలు కొడుతూ, అసాధ్యమైన స్టంట్లు చేసే టైగర్ ష్రాఫ్‌కు అసలు భయం అంటేనే తెలియదని అభిమానులు భావిస్తుంటారు. కానీ, నిజ జీవితంలో టైగర్ ఒక వింత సమస్యతో సతమతమవుతున్నారు. విమాన ప్రయాణం అంటేనే టైగర్ ష్రాఫ్‌కు వణుకు పుడుతోందట. ఈ సమస్యను వైద్య పరిభాషలో 'ఏరోఫోబియా' లేదా 'ఏవియోఫోబియా' అని పిలుస్తారు.

యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌కు వింత భయం- విమాన ప్రయాణం అంటే వణుకు, ఒత్తిడి- అసలు ఏంటీ ఏరోఫోబియా? ఎందుకు వస్తుంది? (Instagram)
యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌కు వింత భయం- విమాన ప్రయాణం అంటే వణుకు, ఒత్తిడి- అసలు ఏంటీ ఏరోఫోబియా? ఎందుకు వస్తుంది? (Instagram)

ఆ చేదు అనుభవమే కారణం..

ప్రముఖ యూట్యూబర్ లిల్లీ సింగ్‌తో జరిగిన సంభాషణలో టైగర్ తన భయానికి గల కారణాన్ని పంచుకున్నారు. "నేను త్వరలో ఒక థెరపిస్ట్‌ను కలవాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏరోఫోబియా ఉంది. కొన్ని ఏళ్ల క్రితం ఒక విమాన ప్రయాణంలో ఎదురైన తీవ్రమైన కుదుపులు (Turbulence) నన్ను బాగా భయపెట్టాయి. ఆ సమయంలో విమానం మన నియంత్రణలో ఉండదు కదా? అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆందోళన మొదలవుతుంది. విమానం ఎక్కడానికి రెండు రోజుల ముందు నుంచే ఒత్తిడికి లోనవుతున్నాను" అని టైగర్ ఆవేదన వ్యక్తం చేశారు.

విమాన ప్రయాణం అత్యంత సురక్షితమైనదని గణాంకాలు చెబుతున్నా, తన మనసు మాత్రం అది వినడం లేదని టైగర్ ష్రాఫ్ అన్నారు. "చాలామంది పైలట్లు నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రోడ్డుపై గుంతలు ఉన్నప్పుడు కారు ఎలా ఎగిరి పడుతుందో, టర్బులెన్స్ కూడా అంతేనని చెబుతుంటారు. కానీ, ఆ సమయంలో నా మెదడు అవేమీ ఆలోచించదు. నా శరీరాన్ని, నా కదలికలను నియంత్రించుకోవడం నాకు ఇష్టం. కానీ విమానంలో అది సాధ్యం కాదు. ఈ భయం వల్ల నా రోజువారీ పనులు, షెడ్యూల్స్ కూడా దెబ్బతింటున్నాయి" అని టైగర్ వివరించారు.

ఏమిటీ ఏరోఫోబియా?

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ డేటా ప్రకారం.. అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 40% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం విమానం పడిపోతుందనే భయం మాత్రమే కాదు, విమానం ఎక్కుతున్నామనే ఆలోచన రాగానే కలిగే విపరీతమైన ఆందోళన (Anxiety). గతంలో జరిగిన చేదు అనుభవాలు లేదా ఒత్తిడితో కూడిన సంఘటనల వల్ల ఇది వస్తుంది.

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నిపుణుల ప్రకారం.. ఈ సమస్య ఉన్నవారికి పానిక్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీనికి 'కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ' (CBT) లేదా 'ఎక్స్‌పోజర్ థెరపీ' ద్వారా చికిత్స అందించవచ్చు. దీనివల్ల రెండు మూడు ఏళ్ల పాటు ఉపశమనం లభిస్తుంది.

కెరీర్ విషయానికొస్తే..

ఇదిలా ఉంటే, టైగర్ ష్రాఫ్ గతేడాది సంజయ్ దత్, హర్నాజ్ సంధు, సోనమ్ బజ్వాలతో కలిసి 'బాఘీ 4'లో నటించారు. ప్రస్తుతం జాన్వీ కపూర్, లక్ష్య లాల్వానీలతో కలిసి 'లగ్ జా గలే' అనే యాక్షన్ రొమాంటింగ్ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా చేస్తున్నట్లుగా సమాచారం.

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా నిపుణులైన వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More