Dia Mirza PM Modi: 47 రోజుల తర్వాత నోరు విప్పి సాధించిందేంటి?.. ప్రధాని మోదీ సందేశంపై నటి దియా మీర్జా కౌంటర్
Dia Mirza Slams PM Narendra Modi: నీట్ పేపర్ లీకేజీ వివాదంపై పీఎం నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మాటల్లో ఆవేదన అనుభవిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల కనీస సానుభూతి లేదంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.
Dia Mirza Slams PM Narendra Modi: దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు, సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించిన తీరుపై ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని సందేశంలో బాధితుల పట్ల ఎలాంటి మానవీయ స్పందన లేదని ఆక్షేపించారు.
సానుభూతి తెలపడం ఎంత కష్టం?
ప్రధాని మోదీ శుక్రవారం (జూలై 24) విడుదల చేసిన వీడియో సందేశంపై దియా మీర్జా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ సంక్షోభం కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు, శోకసంద్రంలో ఉన్న వారి తల్లిదండ్రులకు ప్రధాని మాటలు ఎలాంటి ఓదార్పు ఇవ్వలేకపోయాయని విమర్శించారు.
"ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు, కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు, వారాల తరబడి నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్చుక్ లాంటి వారి గురించి ప్రధాని నోటి నుంచి ఒక్క సానుభూతి మాట కూడా రాకపోవడం విచారకరం. ప్రధాని గారూ.. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలపడం ఎంత కష్టం?" అని దియా మీర్జా ప్రశ్నించారు.
"47 రోజుల తర్వాత నోరు విప్పి సాధించిందేంటి?"
ఇంతటి పెద్ద సమస్యపై స్పందించడానికి కేంద్ర ప్రభుత్వానికి 47 రోజుల సమయం పట్టిందని దియా మీర్జా మండిపడ్డారు. "చివరకు స్పందించినా.. గుండె పగిలిన కోట్లాది మంది మనసులను ఓదార్చే ఒక్క మాట కూడా చెప్పలేదు" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జంతర్ మంతర్ నిరసనలు.. ప్రధాని మోదీ హామీ
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు గత నెల రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్న ఈ పోరాటానికి ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ కూడా మద్దతు తెలపడమే కాకుండా నిరాహార దీక్ష చేపట్టారు.
నిరసనలు ఉధృతంగా మారడంతో ప్రధాని మోదీ స్పందిస్తూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నీట్ పేపర్ లీకేజీ చిన్న విషయమేమీ కాదని, ఇది లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆవేదన కలిగించిందని ప్రధాని తన ప్రసంగంలో అంగీకరించారు.
విద్యార్థుల ఒక విద్యా సంవత్సరం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే దాదాపు 22 లక్షల మంది విద్యార్థులకు వేగంగా పరీక్షలు పూర్తి చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, నూతన చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించారు.
దీక్ష విరమించిన సోనమ్ వాంగ్చుక్
ప్రధాని ప్రకటన అనంతరం, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో ఆసుపత్రిలో భేటీ అయిన తర్వాత సోనమ్ వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమించారు.
ప్రకటనలకే పరిమితం కాకుండా
అయితే ప్రధాని ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, లీకేజీకి బాధ్యులైన వారిపై వేగంగా కఠిన చర్యలు తీసుకుంటేనే విద్యార్థులకు, తల్లిదండ్రులకు వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


