Imtiaz Ali: బుర్కా, పర్దాల్లో సౌకర్యంగా ఉన్నామని చెప్పకండి, అది మానసిక బానిసత్వమే: అగ్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ కామెంట్స్
Imtiaz Ali About Burqa And Purdah Wearing: అగ్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ బుర్కా, పర్దా పద్ధతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇవి వెనుకబాటుతనానికి సంకేతాలని, వీటిలో సౌకర్యం వెతుక్కునేవారు మానసికంగా బాధితులేనని ఆయన చాలా గట్టిగా పేర్కొన్నారు. దీంతో ఇంతియాజ్ అలీ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Imtiaz Ali About Burqa And Purdah Wearing: బాలీవుడ్ అగ్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సామాజిక చర్చకు దారితీస్తున్నాయి. మహిళలు బుర్కా ధరించడం, పర్దా పద్ధతిని పాటించడం వెనుకబాటుతనానికి, సమాజ క్షీణతకు నిదర్శనమని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు.

సౌకర్యంగా ఉన్నామనే మహిళల మాటలను
ఈ సాంప్రదాయ పద్ధతుల్లో తాము సౌకర్యంగానే ఉన్నామని కొందరు మహిళలు చెప్పే మాటలను స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ పూర్తిగా తోసిపుచ్చారు. సాధారణంగా ఇంతియాజ్ అలీ సినిమాలు ప్రేమ, మానవ సంబంధాలు, అంతర్మథనం చుట్టూ తిరుగుతుంటాయి. సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన చాలా అరుదుగా స్పందిస్తుంటారు.
అలాంటిది, ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన దేశ విభజన నాటి భావోద్వేగ భరిత చిత్రం 'మై వాపస్ ఆవుంగా' (Main Vaapas Aaunga) విడుదలైన నేపథ్యంలో ఒక ప్రముఖ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఇంతియాజ్ అలీ మాట్లాడారు. ఈ క్రమంలోనే పితృస్వామ్య వ్యవస్థ, మహిళల వస్త్రధారణపై తన మనసులోని అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు.
మానసిక బానిసత్వమే కారణం
శామ్దిష్ భాటియా నిర్వహించిన పాడ్కాస్ట్లో ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ.. దేశ విభజన నాటి విషాద పరిస్థితులు, సమాజంలో పేరుకుపోయిన పితృస్వామ్య ధోరణులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సంభాషణలోనే బుర్కా అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
"నేను నా బుర్కాలో లేదా పర్దాలో చాలా సౌకర్యంగా ఉన్నాను అని ఎవరైనా చెబితే నాకు అస్సలు నచ్చదు. అది సమాజ క్షీణతను చూపిస్తుంది. అలా భావించడం ఏమాత్రం సరైనది కాదు. ఆ దుస్తుల్లో కంఫర్ట్గా (సౌకర్యంగా) ఉన్నామని అంటున్నారంటే.. వారు మానసికంగా ఒక రకమైన బానిసత్వానికి లేదా పితృస్వామ్య వేధింపులకు లోనయ్యారని నా అర్థం" అని ఇంతియాజ్ అలీ అన్నారు.
తీవ్రవాదం పెరిగింది.. చర్చలు కరువయ్యాయి
ఈ వ్యాఖ్యలపై ఇంటర్వ్యూ నిర్వాహకుడు స్పందిస్తూ.. వివిధ వర్గాలకు, మతాలకు వేర్వేరు ఆచారాలు ఉంటాయని, ఎవరి వ్యక్తిగత ఇష్టాన్ని మనం అడ్డుకోలేమని గుర్తుచేశారు. యాంకర్ ప్రశ్నకు ఇంతియాజ్ అలీ వెంటనే బదులిస్తూ.. తాను ఎవరి స్వేచ్ఛనూ హరించాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు.
"నేను ఎవరినీ బలవంతంగా అడ్డుకోవాలని అనడం లేదు. ఎవరి ఇంటికో వెళ్లి వాదించాలనీ నా ఉద్దేశం కాదు. కానీ, సమాజంలో పరస్పర సహనం, సమతుల్యత ఉండాలి. ప్రస్తుతం మధ్యస్థంగా, సంయమనంతో ఆలోచించేవారు ఎక్కడో కలిసిపోయారు. అందరూ తీవ్రమైన (ఎక్స్ట్రీమ్) భావజాలంతోనే బతుకుతున్నారు. ఇరువర్గాల మధ్య సామరస్యపూర్వకమైన చర్చలు జరపడం ఈ రోజుల్లో చాలా కష్టంగా మారింది. నేనేమీ ఎవరికీ శత్రువుని కాదు" అని ఇంతియాజ్ వివరించారు.
బాక్సాఫీస్ వద్ద 'మై వాపస్ ఆవుంగా' నెమ్మదిగా..
ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన తాజా చిత్రం 'మై వాపస్ ఆవుంగా' జూన్ 12న థియేటర్లలో విడుదల అయింది. దిల్జిత్ దోసాంజ్, నసీరుద్దీన్ షా, వేదంగ్ రైనా, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది.
ఎనిమిది దశాబ్దాల క్రితం దేశ విభజన సమయంలో కోల్పోయిన తన పాత ప్రేమ జ్ఞాపకాలతో, మరణశయ్యపై ఉన్న ఒక వృద్ధుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అద్భుత నటనకు, సినిమా సంగీతానికి విమర్శకుల నుంచి భారీగా ప్రశంసలు దక్కాయి.
అయితే, ఈ విమర్శకుల ప్రశంసలు ఆరంభంలో కలెక్షన్ల రూపంలోకి మారలేదు. మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద చాలా నెమ్మదిగా సాగిన ఈ చిత్రం, సోమవారం (జూన్ 15) తర్వాత ప్రేక్షకుల మౌత్ టాక్తో కాస్త పుంజుకుంది.
14 కోట్ల నెట్ కలెక్షన్స్
మొదటి వారం ముగిసేసరికి ఈ సినిమా దేశీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు 14 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది మై వాపస్ ఆవుంగా సినిమా. ఒకవైపు సినిమా టాక్, మరోవైపు ఇంతియాజ్ అలీ సామాజిక వ్యాఖ్యలు బుల్లితెర, వెండితెర వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


