Imtiaz Ali: నెపో కిడ్స్ కంటే నాలాంటి బయటివాళ్లకే ఈజీ, సొంత కుటుంబంతోనే పోటీ పడాలి.. డైరెక్టర్ ఇంతియాజ్ అలీ కామెంట్స్
Imtiaz Ali About Nepo Kids Vs Outsiders: సినిమా ఇండస్ట్రీలో నెపోటిజంపై ఎడతెగని చర్చ సాగుతున్న వేళ ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ సరికొత్త అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న రణ్బీర్ కపూర్, ఆలియా భట్ వంటి తారల కంటే బయటి నుంచి వచ్చిన తనలాంటి వారికే ఈజీ అని ఇంతియాజ్ అలీ చెప్పారు.
Imtiaz Ali Comments On Nepo Kids Vs Outsiders: సినిమా రంగంలో వారసత్వం (నెపోటిజం) అనే పదం వినబడితే చాలు సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తుతాయి. స్టార్ కిడ్స్ కేవలం తమ కుటుంబ నేపథ్యం వల్లే సులభంగా అవకాశాలు దక్కించుకుంటున్నారని, ప్రతిభ గల అవుట్సైడర్ల (బయటి వ్యక్తులు) కెరీర్ను దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి.

భిన్నమైన అభిప్రాయం
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా నిరంతరం సాగే ఈ సుదీర్ఘ వివాదంపై టాలెంటెడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పరిశ్రమలో వారసుల కంటే బయటి నుంచి వచ్చే వారికే తమను తాము నిరూపించుకోవడం కొంత సులువని ఆయన విశ్లేషించారు.
సొంత కుటుంబాలతోనే పోటీ.. వారసులపై అదనపు ఒత్తిడి
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇంతియాజ్ అలీ వారసత్వ సమీకరణాలపై మనసు విప్పి మాట్లాడారు. బాలీవుడ్ టాప్ స్టార్స్ రణ్బీర్ కపూర్, అలియా భట్లను 'నెపో కిడ్స్' అని పిలవడంపై ఇంతియాజ్ అలీ స్పందించారు.
"అలియా, రణ్బీర్ లేదా ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన మరెవరైనా సరే.. వారు కెరీర్లో అదనపు ఒత్తిడిని, కష్టాన్ని ఎదుర్కొంటారు. ఎందుకంటే వారి కళ్ల ముందే విజయవంతమైన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సొంత తండ్రులు, బాబాయ్లు, తల్లులు సాధించిన అపారమైన విజయాలతో వారు నిరంతరం పోటీ పడాల్సి వస్తుంది" అని ఇంతియాజ్ అలీ అన్నారు.
"తమను తాము సక్సెస్ అయ్యామని నిరూపించుకోవడానికి మానసికంగా ఎంతో స్ట్రగుల్ అవుతారు. నా లాగా బయటి నుంచి వచ్చే వారికి ఈ విషయంలో అంత ఒత్తిడి ఉండదు, మాకే కాస్త ఈజీ" అని ఇంతియాజ్ అలీ స్పష్టం చేశారు.
రణ్బీర్, అలియా స్టార్డమ్ వెనుక కఠోర శ్రమ
కేవలం వారసత్వం వల్లే ఎవరూ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడలేరని, స్వయంకృషితో ప్రతిభను నిరూపించుకుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ దర్శకుడు గుర్తు చేశారు. రణ్బీర్ కపూర్ను నెపో చైల్డ్ అని కొందరు పిలిచినా, ఆయన తన అద్భుతమైన నటనతో ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారని కొనియాడారు.
"అలియా భట్ అసాధారణ నటనను చూసిన తర్వాత ఆమెకు ఆ పాత్ర ఎలా వచ్చిందని ఎవరూ ప్రశ్నించరు. పైగా ఆమె మరిన్ని పాత్రలు చేయాలని కోరుకుంటారు. పరిశ్రమలో పుట్టిన వారు తమను తాము నిరూపించుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది" అని ఇంతియాజ్ అలీ పేర్కొన్నారు.
గతంలో ఆలియా భట్ కెరీర్ను మలుపు తిప్పిన 'హైవే' చిత్రానికి ఇంతియాజ్ అలీనే దర్శకత్వం వహించారు. అలాగే రణ్బీర్ కపూర్తో ఆయన తెరకెక్కించిన 'రాక్స్టార్', 'తమాషా' చిత్రాలు విడుదల సమయంలో ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించనప్పటికీ, కాలక్రమేణా కల్ట్ క్లాసిక్ హిట్స్గా నిలిచాయి.
ముగ్గురి చేతిలో క్రేజీ ప్రాజెక్టులు
ప్రస్తుతం ఇంతియాజ్ అలీ, రణ్బీర్, అలియా ముగ్గురూ తమ రాబోయే భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా 'మై వాపస్ ఆవుంగా' జూన్ 12న థియేటర్లలోకి రానుంది. దేశ విభజన నాటి వలసల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో దిల్జిత్ దోసాంజ్, వేదంగ్ రైనా, శార్వరి, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రలు పోషించారు.
మరోవైపు రణ్బీర్ కపూర్ అత్యంత ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణం'లో నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్బీర్ శ్రీరాముడిగా కనిపిస్తుండగా, యశ్ రావణాసురుడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు.
ఆల్ఫాతో అలియా
ఈ భారీ చిత్రం రెండు భాగాలుగా రానుండగా, మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇక ఆలియా భట్ విషయానికి వస్తే, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగమైన 'ఆల్ఫా' చిత్రంతో జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు ఉన్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


