బ్రహ్మముడి మే 25 ఎపిసోడ్: తిరిగొచ్చిన స్వరాజ్.. రేఖకు దిమ్మదిరిగే కౌంటర్.. ఊడిన వెంకీ ఉద్యోగం.. ఆందోళనలో చలపతి, లక్ష్మీ
బ్రహ్మముడి మే 25 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రేఖకు స్వరాజ్ లాగా గట్టి కౌంటర్ ఇవ్వడం చూసి అపర్ణ మురిసిపోతుంది. అలవాట్లే కాదు.. నీలాంటి వాళ్లను ఎదురించడంలోనూ తన కొడుకు బుద్ధులే అతనికి వచ్చాయని రేఖతో అంటుంది అపర్ణ.
బ్రహ్మముడి మే 25 ఎపిసోడ్: రాజు స్వరాజ్ లా మారిపోయాడు. తిరిగొచ్చిన స్వరాజ్ ను చూసి అపర్ణ తెగ మురిసిపోతుంది. అలవాట్లలోనే కాదు గుణంలోనూ తన కొడుకే అతనిలో ఉన్నాడని తెలుసుకొని అపర్ణ మురిసిపోగా.. రేఖకు మాత్రం దిమ్మదిరిగే షాక్ తగులుగుతుంది. మరోవైపు ఏఐ దెబ్బకు వెంకీ ఉద్యోగం ఊడటంతో చలపతి, లక్ష్మీ ఆందోళన చెందుతారు.

రాజు సీఈవో ప్లాన్స్ గురించి రేఖకు చెప్పిన ఇందు
బ్రహ్మముడి సీరియల్ సోమవారం (మే 25) ఎపిసోడ్ రాజు సీఈవో ప్లాన్స్ గురించి రేఖకు ఇందు చెప్పే సీన్ తో మొదలవుతుంది. అతన్ని తక్కువ అంచనా వేయొద్దని అంటుంది. అతని వదిలించుకోవాలని అనుకుంటున్నానని, తన జీవితం, ఈ కంపెనీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని డ్రామాను రక్తి కట్టిస్తుంది ఇందు. తాను చూసుకుంటానని రేఖ ఆమెకు హామీ ఇచ్చి పంపిస్తుంది.
ఏఐ దెబ్బకు ఊడిన వెంకీ ఉద్యోగం
మరోవైపు వెంకీ పని చేసే కంపెనీలో ఏఐ కారణంగా లేఆఫ్స్ జరుగుతుంటాయి. తన ఉద్యోగం ఏమీ కాదులే అని వెంకీ అనుకుంటుండగా.. అతని అకౌంట్లో మూడు నెలల జీతం పడుతుంది. ఇదేంటని మేనేజర్ ను అడిగితే నీ ఉద్యోగం పోయిందని అంటాడు.
ఏఐని వాడటం నీకు తెలియదు.. నీకు పని చేయడం రాదు.. నువ్వు ఔట్డేటెడ్.. బయట ఏఐ వాడి రూ.10, 20 వేలకు పని చేసేవాళ్లు ఉండగా.. నీకు లక్షలు ఎందుకు ఇవ్వాలని మేనేజర్ అనడంతో వెంకీ షాక్ తింటాడు. నీకు బయట కూడా ఎక్కడా ఉద్యోగం రాదు.. ఏదైనా టీ కొట్టో, ఇడ్లీ కొట్టో పెట్టుకో అని వెటకారం చేస్తాడు. దీంతో ఏమీ చేయలేక వెంకీ బాధగా వెళ్లిపోతాడు.
రాజ్లాగే తినడం చూసి ఎమోషనల్ అయిన అపర్ణ
ఇటు ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటారు. ఆ సమయంలో చికెన్ చూసి రాజు ఆవురావురుమంటూ తింటాడు. చికెన్ లోకి పెరుగు వేసుకోవడం చూసి అపర్ణ తన కొడుకు స్వరాజ్ ను గుర్తుకు చేసుకుంటుంది. అతడు కూడా ఇలాగే పెరుగు, చికెన్ కలిపి తినేవాడని అనుకొని ఎమోషనల్ అవుతుంది. నీ రూపమే కాదు.. అలవాట్లు కూడా అచ్చూ నా కొడుకు స్వరాజ్ లాగే ఉన్నాయని అపర్ణ అనడంతో రాజు షాకవుతాడు.
రాజును నిలదీసిన రేఖ.. గట్టి కౌంటర్ ఇచ్చిన రాజు
అప్పుడే రేఖ వస్తుంది. కంపెనీ సీఈవో పదవి కోసం పోటీ చేస్తున్నావట అని అడుగుతుంది. ఆశ పడటంలో తప్పులేదు.. రిక్షా తొక్కేవాడు కూడా కారులో తిరగాలని అనుకుంటాడని అవమానించేలా మాట్లాడుతుంది. మొదట కంగుతున్న రాజు తర్వాత రేఖకు గట్టి కౌంటర్ ఇస్తాడు.
బంగారు స్పూన్ ను నోట్లో పెట్టుకొని పుట్టిన వాడు సీఈవో అయి కోట్లు సంపాదించడంలో కిక్కులేదు.. నాలా మిడిల్ క్లాస్ లో పుట్టి కోట్లు సంపాదించడంతో ఉంటుంది కిక్కు.. అదేంటో చేసి చూపిస్తాను అని రేఖకు ఛాలెంజ్ విసురుతాడు. అది విని అపర్ణ మురిసిపోతుంది. అతనికి తన కొడుకు రూపం, అలవాట్లే కాదు.. నీలాంటి వాళ్లను ఎదిరించే విషయంలో స్వరాజ్ కు ఉండే తెగింపే వచ్చిందని రేఖతో అంటుంది.
ఉద్యోగం పోయిందని తల్లిదండ్రులకు చెప్పిన వెంకీ
ఇటు ఇంటికి ఉసూరుమంటూ వస్తాడు వెంకీ. అప్పటికే రాజు గురించి తలచుకొని చలపతి, లక్ష్మీ బాధపడుతుంటారు. వెంకీ వచ్చి రూ.3 లక్షలు చేతుల్లో పెడతాడు. ప్రమోషన్ వచ్చిందా అని అడిగితే ఉద్యోగం పోయిందని చెప్పడంతో వాళ్లు షాక్ తింటారు. వెంకీ బాధగా ఇంట్లోకి వెళ్లిపోతాడు. తర్వాత చలపతి ఆందోళన పడతాడు. వీడి ఉద్యోగంపైనే ఇల్లు నడుస్తోంది.. ఈఎంఐలు కడుతున్నాం.. ఇప్పుడెలా.. ఆ పెద్దోడు అసలు ఇంటి గురించే పట్టించుకోడు అని అంటాడు. మూడు నెలలో మరో ఉద్యోగం వస్తుందిలెండి అని లక్ష్మీ చెప్పినా చలపతిలో కంగారు తగ్గదు.
మరోవైపు సీఈవో పదవి విషయంలో తనను రేఖ దగ్గర ఇరికించిన ఇందుపై రాజు మండిపడతాడు. దీంతో ఇందు తన అసలు ప్లాన్ చెబుతుంది. ఇందులో తాను ఓడిపోకూడదని, బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయాలని అంటుంది. అటు రేఖ కూడా అదే బ్రహ్మాస్త్రం గురించి మాట్లాడుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


