ధురంధర్ సినిమాపై ధృవ్ రాఠీ ఫైర్.. 'ఇది దేశభక్తి కాదు, తప్పుడు ప్రచారం'
ప్రముఖ యూట్యుబర్ ధృవ్ రాఠీ ధురంధర్ సినిమాపై వీడియో చేశారు. ఈ వీడియోలో సినిమాని, సినిమాలో చూపించిన హింసను, రెహమాన్ డకైత్ పాత్రను చూపించిన విధానాన్ని, దర్శకుడు ఆదిత్య ధార్ పొలిటికల్ వ్యూస్ని తీవ్రస్థాయిలో విమర్శించారు.
బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తున్న ధురంధర్ సినిమాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రముఖ యూట్యూబర్, పొలిటికల్ కామెంటేటర్ ధృవ్ రాఠీ! ఇది ఒక తప్పుడు 'ప్రాపగాండా' అని, వాస్తవాలు- కల్పితాలను మిళితం చేసి, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా సినిమాను తీశారని మండిపడ్డారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్లో తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు.

ధురంధర్, ఆదిత్య ధార్పై ధ్రువ్ రాఠీ ఫైర్..
పాకిస్థాన్లో ఒక భారత స్పై చేసే సాహసాల ఆధారంగా రూపొందిన సినిమా ఈ ధురంధర్. ఇందులో రణ్వీర్ సింగ్ నటించాడు. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై చాలా మంది ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. కానీ సినిమా థీమ్, చెప్పిన విధానాన్ని ఇంకొందరు తప్పుబడుతున్నారు. ఫలితంగా ధురంధర్పై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఇందులోకి ధృవ్ రాఠీ కూడా ఎంట్రీ ఇచ్చారు.
“ఏది వాస్తవం? ఏది కల్పితం? అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇది ప్రేక్షకులకు తెలియదు. వారు చెప్పలేరు. సినిమాలో లీనమైపోయిన వారికి అసలు ఈ ప్రశ్నే రాదు. దానినే గుడ్డిగా నమ్ముతారు. అదే నిజం అని భావిస్తారు. వాస్తవ సంఘటనలకు డ్రామా స్టోరీ టెల్లింగ్ని జోడించి చూపిస్తే, చరిత్రపై ప్రజల్లో ద్వంద్వ అభిప్రాయాలు కనిపిస్తాయి,” అని ధృవ్ రాఠీ అన్నారు.
ధురంధర్ సినిమాలోని హింస, నేర స్వభావం కలిగిన పాత్రలను హైలైట్ చేయడాన్ని కూడా ధృవ్ రాఠీ తప్పుపట్టారు.
“ఈ సినిమా హింస, గ్యాంగ్స్టర్స్ని గ్లోరిఫై చేస్తుంది. డ్రగ్స్, కిడ్నాప్, ఎక్స్టార్షన్, మర్డర్లలో రెహమాన్ డకైత్ ఒక కరుడుగట్టిన నేరస్తుడు. సొంత తల్లినే చంపేశాడు. కానీ సినిమాలో ఆయన్ని ‘కూల్ స్వాగ్’తో, స్టైలిష్ లుక్స్తో, వైరల్ డ్యాన్స్తో చూపించారు. ఇలాంటి ఉగ్రవాదులను ఈ విధంగా చూపించడం సరైన పద్ధతేనా?” అని యూట్యూబర్ ప్రశ్నించారు.
సినిమాలో హింసను నార్మలైజ్ చేయడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమయంలో ధృవ్ రాఠీ ఈ వీడియో విడుదల చేశారు.
ధురంధర్పై ధ్రువ్ రాఠీ వీడియోని ఇక్కడ చూడండి:
“గ్యాంగ్స్ ఆఫ్ వస్సెపూర్ సినిమాని తీసుకెళ్లి పాకిస్థాన్లో పెట్టారు. యానిమల్ రేంజ్లో హింసను జోడించారు. పొలిటికల్ ప్రాపగాండాను రుద్ది ధురంధర్ అనే సినిమాని తీశారు,” అని ధ్రువ్ రాఠీ అభిప్రాయపడ్డారు.
“ఆర్ట్ అనేది ప్రజల హితం కోరుకునే విధంగా ఉండాలి. కానీ ఆదిత్య ధార్ వంటి ఫిల్మ్మేకర్లు దీనికి విరుద్ధం. సొంత దేశాన్ని ఎగతాళి చేస్తారు. మీరు నిజమైన దేశభక్తి సినిమాలు చూడాలని భావిస్తే.. సామ్ బహదూర్, బార్డర్, 1971, సర్ఫరోష్, నీరజా, స్వదేశ్, చక్ దే ఇండియా వంటివి చూడండి,” అని సలహా ఇచ్చారు.
“చివరిగా ఆదిత్య ధార్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తప్పుడు ప్రాంపగాండాలతో సినిమాలు చేయడం ఆపకేపోతే.. మీ లెగేసీ కూడా హిట్లర్ ఫేవరెట్ ఫిల్మ్మేకర్ (లెని రైఫెన్స్టల్)లా అయిపోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. రేపనే రోజున ఎవరైనా మీకు వ్యతిరేకంగా సినిమా తీస్తే మీ ఇమేజ్ ఎమవుతుంది? ఆలోచించండి,” అని యూట్యూబర్ అన్నారు.
సినిమాలోని పొలిటికల్ వ్యూస్తో తాను అంగీకరించకపోయినా, ధురంధర్ స్టోరీటెల్లింగ్ చాలా బాగుందని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఇటీవలే కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని కూడా ధృవ్ రాఠీ ప్రస్థావించారు.
“ప్రాపగాండా ఉన్నా కూడా సినిమా బాగుందని హృతిక్ రోషన్ అంటున్నారు. కానీ సినిమా ఎంత బాగున్నా.. చివరికి అది ప్రాపగాండానే!” అని ధృవ్ రాఠీ అన్నారు.
ధ్రువ్ రాఠీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
ధృవ్ రాఠీ లేటెస్ట్ వీడియోను చాలా మంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
“ధురంధర్ చూడొద్దని ధృవ్ రాఠీ చెబుతున్నాడు. అయితే వెళ్లి చూడాల్సిందే,” అని ఒకరు ఎక్స్లో పోస్ట్ చేశారు. “ఏం మాట్లాడుతున్నారు హిట్లర్పై తీసిన సినిమాలు ఎవరికీ నచ్చలేదు. కానీ మన ధూరంధర్ సినిమాని అంతర్జాతీయంగా, పాకిస్థాన్లో కూడా పొగుడుతున్నారు,” అని మరొకరు అన్నారు.
“హిందుస్థానీకి అతిపెద్ద శత్రువు హిందుస్థానీయే. పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంటుందని అజిత్ దోవల్ అన్నారు,” అని మరొకరు కామెంట్ చేశారు.
“ఈ లాజిక్తో సామ్ బహదూర్, బర్డర్ వంటి సినిమాలు కూడా ప్రాపగాండా కిందకే వస్తాయి కదా,” అని ఇంకొకరు అన్నారు.
ఏదైమానా బాక్సాఫీస్ వద్ద మాత్రం ధురంధర్ సినిమా దూసుకెళుతోంది. విడుదలైన 16వ రోజు రూ. 33కోట్ల కలెక్షన్స్ని రాబట్టింది. రూ. 500 కోట్ల క్లబ్లో చేరింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


