Janhvi Kapoor Buchi Babu: పెద్దిలో జాన్వీ కపూర్ను చూపించిన తీరుపై విమర్శలు- వివరణ ఇచ్చుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సాన
Buchi Babu Sana Reacts To Janhvi Kapoor Role Peddi Controversy: రామ్ చరణ్ పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కానీ, జాన్వీ కపూర్ను వివిధ యాంగిల్స్లో చూపించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ బుచ్చిబాబు సాన స్పందించి వివరణ ఇచ్చుకున్నారు.
Buchi Babu Sana Reacts To Janhvi Kapoor Role Peddi Controversy: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్లో వచ్చిన 'పెద్ది' చిత్రం థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ భారీ విజయంతో పాటే సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద వివాదం కూడా రాజుకుంది.

తీవ్ర అభ్యంతరాలు
పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్ర చిత్రీకరణ, ఆమె చుట్టూ నడిచే లవ్ ట్రాక్పై ప్రేక్షకులు, సినీ విమర్శకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలో, నెటిజన్ల నుంచి వస్తున్న వ్యతిరేకతపై దర్శకుడు బుచ్చిబాబు సాన స్పందించారు. తమ చిత్రంలోని రొమాంటిక్ సీన్లపై ప్రేక్షకులు ఈ స్థాయిలో మండిపడతారని తాను అస్సలు ఊహించలేదని ఆయన ఓపెన్గా అంగీకరించారు.
ఊహించని రీతిలో నెగిటివ్ రెస్పాన్స్
"ప్రేక్షకులు ఈ సీన్లను ఇంత నెగెటివ్గా తీసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు" అని బుచ్చిబాబు సాన 'స్క్రీన్' (SCREEN) మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య నడిచే లవ్ ట్రాక్, అచ్చియమ్మ పాత్రపై వస్తున్న విమర్శలు తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశాయని ఆయన చెప్పారు.
తమ రైటింగ్ టీమ్ అనుకున్న భావన వేరని, కానీ స్క్రీన్ మీదకు వచ్చేసరికి అది వేరేలా అర్థం ఇచ్చేలా మారిందని బుచ్చిబాబు వివరించారు. ప్రేక్షకులకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని, కేవలం హీరో, హీరోయిన్ల మధ్య ఒక సరదా రొమాంటిక్ ట్రాక్ నడపాలని మాత్రమే అనుకున్నట్లు చెప్పారు. అయితే, భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో మరింత సున్నితంగా వ్యవహరిస్తామని, పాత్రల చిత్రీకరణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని బుచ్చిబాబు సాన హామీ ఇచ్చారు.
అసలు వివాదం ఎందుకు మొదలైంది?
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర ఎంట్రీ సీన్ నుంచే ప్రేక్షకులు తప్పుబడుతున్నారు. హీరోయిన్ అందచందాలను (క్లీవేజ్, నావెల్ భాగాలను) కెమెరా చూపించిన విధానం కేవలం గ్లామర్ కోణంలోనే సాగిందని, పాత్రకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఒక వస్తువులా ప్రెజెంట్ చేశారనే కామెంట్స్ వస్తున్నాయి.
దీనికి తోడు, సినిమాలో రామ్ చరణ్ పాత్ర అచ్చియమ్మ అనుమతి లేకుండా ఆమెను తాకాలని తన స్నేహితులతో చెప్పడం, పవర్ కట్ అయిన సమయంలో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ముద్దు పెట్టుకోవడం వంటి సీన్లు వివాదాస్పదంగా మారాయి.
రాజకీయ భవిష్యత్తు కోసం
సదరు సన్నివేశంలో హీరోయిన్ ఏడుస్తున్నప్పటికీ, చుట్టుపక్కల ఉన్న పురుషులు ఆమె తండ్రి రాజకీయ భవిష్యత్తు కోసం ఆ విషయాన్ని మర్చిపోవాలని ఒత్తిడి చేయడం థియేటర్లలో ప్రేక్షకులకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.
బలవంతపు ముద్దును రొమాన్స్ అని ఎలా అంటారంటూ నెటిజన్లు బుచ్చిబాబును నిలదీస్తున్నారు. ప్రస్తుత డిజిటల్ కాలంలో ప్రేక్షకులు పాత్రల పట్ల ఎంతో సున్నితంగా ఉంటున్నారనే విషయాన్ని మేకర్స్ గమనించాలని విశ్లేషకులు చెప్తున్నారు.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా
వివాదాలు పక్కన పెడితే, 'పెద్ది' చిత్రం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో సాగే ఒక పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామా. తన గ్రామానికి గుర్తింపు, గర్వకారణం తీసుకురావడానికి ఒక ప్రతిభావంతుడైన అథ్లెట్ పడే తపన, అతని ఆశయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గ్రామీణ అస్తిత్వం, సమాజంలో గుర్తింపు అనే అంశాలను దర్శకుడు ఇందులో అద్భుతంగా చూపించారు.
ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు.
బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ పవర్
ఐవీ ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ ప్రాజెక్ట్ను సమర్పించాయి. కంటెంట్ పరంగా విమర్శలు వస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ మాస్ పవర్ స్పష్టంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


