...
...
Next Story

ఒక్కో ఎపిసోడ్‌కు 2.8 కోట్లు- ఓటీటీ సిరీస్ రెమ్యూనరేషన్‌పై డ్రాగన్ల తల్లి క్లారిటీ- అప్పు మాత్రం తీర్చానన్న నటి- కానీ!

Emilia Clarke On Game Of Thrones Remuneration: ఓటీటీ వేదికపై ప్రపంచవ్యాప్త అత్యంత పాపులర్ సిరీస్‌గా పేరొందిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటీనటుల పారితోషికంపై వస్తున్న రూమర్లపై నటి ఎమిలియా క్లార్క్ క్లారిటీ ఇచ్చారు. ఎపిసోడ్‌కు కోట్లు తీసుకున్నామనే వార్తల్లో అస్సలు నిజం లేదని చెప్పారు. కానీ, మరో నటుడు మాత్రం!

Published on: May 30, 2026, 11:11:12 IST
Advertisement

Emilia Clarke On OTT Series Game Of Thrones Remuneration: హాలీవుడ్ రికార్డులను తిరగరాస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ఓటీటీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' (Game of Thrones). ఈ ఓటీటీ సిరీస్‌లో నటించిన నటీనటులు, ముఖ్యంగా 'మదర్ ఆఫ్ డ్రాగన్స్' (డ్రాగన్ల తల్లి) పాత్ర పోషించిన ఎమిలియా క్లార్క్ పారితోషికంపై గత కొన్నేళ్లుగా ఇంటర్నెట్‌లో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ఒక్కో ఎపిసోడ్‌కు 2.8 కోట్లు- ఓటీటీ సిరీస్ రెమ్యూనరేషన్‌పై డ్రాగన్ల తల్లి క్లారిటీ- అప్పు మాత్రం తీర్చానన్న నటి- కానీ!
ఒక్కో ఎపిసోడ్‌కు 2.8 కోట్లు- ఓటీటీ సిరీస్ రెమ్యూనరేషన్‌పై డ్రాగన్ల తల్లి క్లారిటీ- అప్పు మాత్రం తీర్చానన్న నటి- కానీ!

ఈ వెబ్ సిరీస్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎమిలియాతో పాటు తోటి నటీనటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా 3 లక్షల డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 2.8 కోట్లు) అందుకున్నారనేది ఆ వార్తల సారాంశం. ఈ సుదీర్ఘ అంచనాలపై 39 ఏళ్ల ఎమిలియా క్లార్క్ తాజాగా స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించారు.

ఆ నంబర్లు చాలా ఎక్కువ!

వెరైటీ (Variety) మ్యాగజైన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఎమిలియా క్లార్క్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఓటీటీ సిరీస్ రెమ్యూనరేషన్ రూమర్లను పూర్తిగా కొట్టిపారేశారు. పదేళ్ల క్రితం ప్రచారంలోకి వచ్చిన ఆ అంకెలు చాలా అతిశయోక్తిగా ఉన్నాయని ఎమిలియా పేర్కొన్నారు.

"మాకు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఏమీ రాలేదు. ఒకవేళ అంత నిజంగానే వచ్చి ఉంటే.. నా గ్యారేజీలో రెండు మూడు పోర్షే (Porsche) కార్లు ఉండేవి" అని ఎమిలియా క్లార్క్ సరదాగా వ్యాఖ్యానించారు.

తల్లిదండ్రుల అప్పులు తీర్చగలిగాను

జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్ రాసిన నవలల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో డెనరిస్ టార్గేరియన్ (Daenerys Targaryen) పాత్రతో ఎమిలియా ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. తమకు అందిన పారితోషికం ఎంతనేది ఆమె కచ్చితంగా వెల్లడించనప్పటికీ, ఆ సంపాదన తనకు ఆర్థిక భరోసాని ఇచ్చిందని చెప్పారు. తన తల్లిదండ్రుల ఇంటిపై ఉన్న హోమ్ లోన్‌ను పూర్తిగా చెల్లించడానికి ఆ డబ్బు సహాయపడిందని ఆమె గుర్తుచేసుకున్నారు.

2011లో ప్రారంభమైన గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఓటీటీ సిరీస్ 2019 నాటికి ఎనిమిది సీజన్లతో ముగిసింది. ఎమిలియాతో పాటు కిట్ హారింగ్టన్, లీనా హెడే, సోఫీ టర్నర్, నికోలాజ్ కోస్టర్-వాల్డో వంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. అయితే హాలీవుడ్‌లో తరచూ వినిపించే లింగ వివక్ష (Gender Pay Gap) తనకు ఎదురుకాలేదని, పురుష నటులతో సమానంగానే తనకు కూడా పారితోషికం లభించిందని ఎమిలియా స్పష్టం చేశారు.

"ఇది నా కెరీర్‌లో మొదటి పెద్ద ప్రాజెక్ట్. కేవలం మహిళనైనందుకు నా పారితోషికంలో ఎలాంటి వివక్ష చూపించలేదు" అని 2018 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఎమిలియా క్లార్క్ ప్రకటించారు. అయితే, ఇదే సిరీస్‌లో నటించిన నికోలాజ్ కోస్టర్-వాల్డో తన పాత మేనేజర్‌తో జరిపిన కోర్టు వివాద పత్రాల ప్రకారం.. చివరి సీజన్‌లోని కనీసం ఆరు ఎపిసోడ్‌లకు గాను ఆయన ఒక్కో ఎపిసోడ్‌కు 1.07 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 10.2 కోట్లు) అందుకున్నట్లు వెల్లడవడం గమనార్హం.

ఎమిలియా క్లార్క్ కెరీర్ ప్రస్థానం

గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ తర్వాత ఎమిలియా క్లార్క్ కేవలం ఫాంటసీ డ్రామాలకే పరిమితం కాకుండా విభిన్న జోనర్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రముఖ యాక్షన్ ఓటీటీ సిరీస్ 'టెర్మినేటర్ జెనిసిస్'లో సారా కానర్ పాత్రలో, అలాగే స్టార్ వార్స్ ప్రపంచంలో 'సోలో: ఎ స్టార్ వార్స్ స్టోరీ' లో కీరా పాత్రలో నటించి మెప్పించారు.

వీటితో పాటు 'లాస్ట్ క్రిస్మస్' వంటి రొమాంటిక్ కామెడీ చిత్రాల్లోనూ, 'అబోవ్ సస్పిషన్', మార్వెల్ ఓటీటీ సిరీస్ 'సీక్రెట్ ఇన్వేషన్', 'క్రిమినల్', 'ది పాడ్ జనరేషన్' వంటి క్రైమ్, సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టులలోనూ ఎమిలియా క్లార్క్ కీలక పాత్రలు పోషించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe