Shah Rukh Khan Wankhede: 2012 వాంఖడేలో షారుఖ్ ఖాన్ గొడవ వెనుక అసలు నిజం ఇదీ.. 14 ఏళ్ల తర్వాత మాజీ ఏసీపీ సంచలన విషయాలు!

Ex ACP Reveals Shah Rukh Khan Wankhede Fight 2012: 2012లో వాంఖడే స్టేడియంలో షారుఖ్ ఖాన్ గొడవ పెద్ద వివాదం అయిన విషయం తెలిసిందే. సెక్యూరిటీ గార్డ్‌పై కోపంతో షారుఖ్ కొట్టేందుకు వెళ్లడంతో ఖాన్‌పై ఐదేళ్లపాటు నిషేధం విధించారు. 14 ఏళ్ల తర్వాత తాజాగా షారుఖ్ ఖాన్ గొడవపై మాజీ ఏసీపీ సంచలన విషయాలు తెలిపారు.

Published on: May 3, 2026, 07:45:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ex ACP Reveals Shah Rukh Khan Wankhede Fight 2012: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వివాదాస్పద సంఘటనల్లో షారుఖ్ ఖాన్ 'వాంఖడే వివాదం' ఒకటి. 2012లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ గొడవపై అప్పట్లో విధులు నిర్వహించిన మాజీ ఏసీపీ ఇక్బాల్ షేక్ 14 ఏళ్ల తర్వాత తాజాగా నోరు విప్పారు.

2012 వాంఖడేలో షారుఖ్ ఖాన్ గొడవ వెనుక అసలు నిజం ఇదీ.. 14 ఏళ్ల తర్వాత మాజీ ఏసీపీ సంచలన విషయాలు!
2012 వాంఖడేలో షారుఖ్ ఖాన్ గొడవ వెనుక అసలు నిజం ఇదీ.. 14 ఏళ్ల తర్వాత మాజీ ఏసీపీ సంచలన విషయాలు!

ఆ రాత్రి వాంఖడేలో ఏం జరిగింది?

ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించిన తర్వాత మైదానంలో చోటుచేసుకున్న హైడ్రామా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో వాంఖడే స్టేడియం పరిధిలోని డివిజనల్ ఏసీపీగా ఉన్న ఇక్బాల్ షేక్ ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అది కేవలం ఒక 'మిస్ కమ్యూనికేషన్' వల్ల జరిగిన గొడవ అని ఆయన స్పష్టం చేశారు.

"నేను మెయిన్ గేట్ దగ్గరకు వెళ్లేసరికి, ఎంసీఏ (MCA) అధికారి ఒకరు వచ్చి షారుఖ్ ఖాన్ 'రాడా' (గొడవ) చేస్తున్నాడని చెప్పారు. అప్పటికే మ్యాచ్ ముగిసింది, లైట్లు కూడా ఆర్పేస్తున్నారు. స్టేడియంలో జనం కూడా చాలా తక్కువగా ఉన్నారు" అని ఇక్బాల్ షేక్ వివరించారు.

సెక్యూరిటీ గార్డ్ విజిల్.. కింగ్ ఖాన్ సీరియస్!

అసలు గొడవ ఎలా మొదలైందనే విషయంలో ఏసీపీ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. స్టేడియం ఒక మూలన షారుఖ్ ఖాన్ తన పిల్లలు, స్నేహితుల పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడున్న ఒక సెక్యూరిటీ గార్డ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజిల్ వేశాడు. ఆ విజిల్ వేయడం షారుఖ్‌కు నచ్చలేదు.

"పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో గార్డ్ అడ్డుకోవడంతో మాటా మాటా పెరిగింది. ఎంసీఏ అధికారులు కూడా జోక్యం చేసుకోవడంతో వాతావరణం వేడెక్కింది. నేను వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించాను. గొడవ పెద్దది కాకుండా ఉండేందుకు షారుఖ్ దగ్గరకు వెళ్లి.. 'సర్, ప్లీజ్ బయటకు వచ్చేయండి' అని నేరుగా చెప్పి ఆయన్ని స్టేడియం బయటకు తీసుకెళ్లాను" అని ఇక్బాల్ షేక్ తెలిపారు.

మతపరమైన దూషణలే కారణమా?

ఈ ఘటనపై షారుఖ్ ఖాన్ గతంలో 'ఆప్ కీ అదాలత్' కార్యక్రమంలో స్పందిస్తూ.. తాను ఎందుకు అంతగా కోప్పడ్డాడో వివరించారు. సెక్యూరిటీ సిబ్బంది తన పిల్లల పట్ల అమర్యాదగా ప్రవర్తించారని, ఒక వ్యక్తి తనను మతపరంగా దూషించాడని షారుఖ్ ఖాన్ ఆరోపించారు. "ఆ వ్యక్తి అన్న మాట మరాఠీలో కూడా చాలా అనాగరికమైనది. అది విని నా సహనం నశించింది, అందుకే కొట్టడానికి వెళ్లాను" అని షారుఖ్ ఖాన్ ఆ సమయంలో పేర్కొన్నారు.

ఈ వివాదం కారణంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ షారుఖ్‌పై ఐదేళ్ల పాటు వాంఖడే స్టేడియంలోకి రాకుండా నిషేధం విధించింది. అయితే మూడు ఏళ్ల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. అప్పుడు షారుఖ్ ఖాన్ స్పందిస్తూ.. "ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది ముఖ్యం కాదు.. హుందాగా ఉండటమే ముఖ్యం" అని ట్వీట్ చేశారు.

కింగ్ ఖాన్ తదుపరి లక్ష్యం.. 'కింగ్'!

2023లో 'పఠాన్', 'జవాన్' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లను రాబట్టిన షారుఖ్ ఖాన్, 2024లో చిన్న విరామం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'కింగ్' అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు.

ఇందులో విశేషమేమిటంటే, షారుఖ్ తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక డార్క్ అస్సాసిన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More