ఇదే టైటిల్ ముస్లిం లేదా దళితులకు పెట్టే దమ్ము మీకుందా? నెట్‌ఫ్లిక్స్ మూవీ టైటిల్‌పై మండిపడుతున్న నెటిజన్లు

విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో వస్తున్న నెట్‌ఫ్లిక్స్ మూవీ 'ఘూస్‌ఖోర్ పండిత్' (Ghooskhor Pandat) చిక్కుల్లో పడింది. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా టీజర్, టైటిల్ చూసి నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఒక వర్గాన్ని కించపరిచేలా టైటిల్ ఉందంటూ బాయ్‌కాట్ పిలుపునిస్తున్నారు.

Published on: Feb 4, 2026, 17:24:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన మనోజ్ బాజ్‌పాయ్.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా 'ఘూస్‌ఖోర్ పండత్' (Ghooskhor Pandat) అనే సినిమాతో రాబోతున్నాడు. నీరజ్ పాండే సమర్పణలో రితేష్ షా దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ మంగళవారం (ఫిబ్రవరి 3) విడుదలైంది. అయితే టీజర్ కంటెంట్ కంటే సినిమా టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. టైటిల్‌లో వాడిన పదజాలం కుల వివక్షను సూచించేలా ఉందంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే టైటిల్ ముస్లిం లేదా దళితులకు పెట్టే దమ్ము మీకుందా? నెట్‌ఫ్లిక్స్ మూవీ టైటిల్‌పై మండిపడుతున్న నెటిజన్లు (X)
ఇదే టైటిల్ ముస్లిం లేదా దళితులకు పెట్టే దమ్ము మీకుందా? నెట్‌ఫ్లిక్స్ మూవీ టైటిల్‌పై మండిపడుతున్న నెటిజన్లు (X)

అసలు వివాదం ఏంటి?

ఈ ఘూస్‌ఖోర్ పండత్ సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్ ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. కథ ప్రకారం అతని పేరు అజయ్ దీక్షిత్ అయినప్పటికీ.. అందరూ అతన్ని 'పండిత్' (Pandat) అని పిలుస్తుంటారు. అయితే ఒక అవినీతిపరుడి కథకు 'ఘూస్‌ఖోర్' (లంచగొండి) అనే పదానికి 'పండిత్' అనే పదాన్ని జోడించి టైటిల్ పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బ్రాహ్మణ సమాజాన్ని, పండితులను కించపరచడమేనని పలువురు ఆరోపిస్తున్నారు.

"వేరే మతాల పేర్లు పెట్టే దమ్ముందా?"

ఎక్స్ వేదికగా నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కేవలం ఒక వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా చేసుకుని విషం చిమ్ముతున్నారని మండిపడుతున్నారు.

"ఈ టైటిల్ చాలా అభ్యంతరకరంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు దమ్ముంటే 'ఘూస్‌ఖోర్ దళిత్' అనో లేదా 'ఘూస్‌ఖోర్ ముస్లిం' అనో టైటిల్ పెట్టి వెబ్ సిరీస్ తీయగలదా? వెంటనే దీనిని మార్చండి" అని ఒక యూజర్ సవాల్ విసిరారు.

మరొక యూజర్ స్పందిస్తూ.. "పండితులను, బ్రాహ్మణులను ద్వేషించడం ఇప్పుడు అలవాటుగా మారింది. దీన్ని మేము సహించం. కోర్టులో తేల్చుకుంటాం" అని హెచ్చరించారు.

"ఇది ముమ్మాటికీ కుల వివక్షే. మీ అజెండాను అమలు చేయడానికి మా వర్గాన్ని వాడుకుంటున్నారా? టైటిల్ మార్చకపోతే నెట్‌ఫ్లిక్స్‌ను మూకుమ్మడిగా బాయ్‌కాట్ చేస్తాం" అని హెచ్చరికలు జారీ చేశారు.

"షోకు ఏ పేరైనా పెట్టొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగానే ఒక నెరేటివ్ సెట్ చేయడానికి ఇలాంటి పేర్లు పెడుతున్నారు. వారికి బుద్ధి చెప్పాలంటే బాయ్‌కాట్ ఒక్కటే మార్గం" అని మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఘూస్‌ఖోర్ పండత్ సినిమా కథేంటి?

ఢిల్లీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ కథలో.. అజయ్ దీక్షిత్ అలియాస్ పండిత్ (మనోజ్ బాజ్‌పాయ్) త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో తప్పులు చేసే ఓ పోలీస్ ఆఫీసర్. అనుకోకుండా ఒక అంతర్జాతీయ కుట్రలో చిక్కుకున్న అతను.. తీవ్రంగా గాయపడిన ఒక యువతి వివరాలు కనుగొనే ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనేది కథాంశం.

ఇందులో నుస్రత్ బరూచా, దివ్యా దత్తా, సాకిబ్ సలీమ్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతానికి ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్ గానీ, మూవీ టీమ్ గానీ స్పందించలేదు. పెరుగుతున్న నిరసనల నేపథ్యంలో టైటిల్ మారుస్తారా లేదా అనేది వేచి చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More