అతని నటన దారుణంగా ఉంటుంది.. కేవలం అదృష్టంతోనే బతికేస్తున్నాడు: బాలీవుడ్ హీరోపై నటుడి సంచలన కామెంట్స్
బాలీవుడ్ నటుడు ప్రశాంత్ నారాయణ్.. యువ హీరో కార్తీక్ ఆర్యన్పై తీవ్ర విమర్శలు చేశాడు. కార్తీక్ ఒక దారుణమైన నటుడని, కేవలం అదృష్టం, తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లే బాలీవుడ్లో కొనసాగుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
‘మర్డర్ 2’, 'ఘోస్ట్' వంటి సినిమాలలో తన నటనతో గుర్తింపు పొందిన నటుడు ప్రశాంత్ నారాయణ్. అతడు తాజాగా తోటి నటుడు కార్తీక్ ఆర్యన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కార్తీక్ ఆర్యన్ను ఒక "టెర్రిబుల్" (దారుణమైన) నటుడిగా అభివర్ణిస్తూ, అతని చుట్టూ ఉన్నవాళ్ళు అతన్ని అనవసరంగా హైప్ చేస్తున్నారని విమర్శించాడు. ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. కార్తీక్ ఆర్యన్ కేవలం తన అదృష్టం, తల్లిదండ్రుల పుణ్యం వల్లే బాలీవుడ్లో బతుకుతున్నాడని అన్నాడు.

"అతను చాలా లక్కీ.. కానీ నటన రాదు"
‘బాలీవుడ్ బబుల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమకాలీన నటుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రశాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కార్తీక్ ఆర్యన్ నటనా సామర్థ్యాన్ని విమర్శిస్తూ.. "మా దగ్గర ఉన్న అత్యంత చెత్త నటుల్లో అతను ఒకడని నేను అనుకుంటున్నాను. కానీ అతను చాలా అదృష్టవంతుడు. కేవలం తన తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లే అతను ఇంకా బతికేస్తున్నాడు. అతను ఎవరితోనూ సరిగ్గా కమ్యూనికేట్ చేయడు. చుట్టూ ఉన్నవాళ్ళు అతన్ని లేపుతుంటారు. అతను చేసిన మొదటి సినిమా ‘ప్యార్ కా పంచనామా’లో మాత్రమే నాకు అతను నచ్చాడు" అని అన్నాడు.
"జనాలు అతన్ని చూసి నవ్వుకుంటున్నారు.."
ప్రేక్షకులు అలాంటి నటుడిని ఎందుకు ఆదరిస్తున్నారు? అతని సినిమాలు ఎందుకు విజయవంతం అవుతున్నాయి అని హోస్ట్ అడిగినప్పుడు ప్రశాంత్ ఇలా స్పందించాడు.
"ఎంతమంది అతన్ని నిజంగా మెచ్చుకుంటున్నారో నాకు తెలియదు. కానీ చాలామంది అతన్ని చూసి నవ్వుకోవడం నేను చూశాను. మీరు జనాలను నవ్వించగలిగితే అది మంచి విషయమే. కానీ మీతో కలిసి నవ్వడానికి, మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వడానికి చాలా తేడా ఉంది. భారతీయ ప్రేక్షకులు ఎక్కువగా అతన్ని చూసి నవ్వుకుంటున్నారేమో" అని ఎద్దేవా చేశాడు.
కార్తీక్ ఆర్యన్ కెరీర్ గ్రాఫ్..
కార్తీక్ ఆర్యన్ ఈ మధ్యే 'భూల్ భులయ్యా' (Bhool Bhulaiyaa) ఫ్రాంచైజీతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాడు. పార్ట్ 2, పార్ట్ 3 రెండూ రూ. 250 కోట్లకు పైగా వసూలు చేశాయి. అయితే అతని ఇతర సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇటీవల విడుదలైన 'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ బయోపిక్ 'చందు ఛాంపియన్' (Chandu Champion)లో కార్తీక్ నటనకు ప్రశంసలు దక్కాయి. అతనికి జాతీయ అవార్డు రావాల్సిందని దర్శకుడు కూడా అన్నాడు. ప్రస్తుతం కార్తీక్ ఢిల్లీలో ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'నాగ్జిల్లా' (Naagzilla) షూటింగ్లో ఉన్నాడు.
ప్రశాంత్ నారాయణ్ ఎవరంటే?
1990వ దశకం ఆరంభంలో ఆర్ట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ప్రశాంత్ నారాయణ్.. 'చాణక్య' (Chanakya) టీవీ సిరీస్కు కాస్ట్యూమ్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. 2002లో 'ఛల్' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. నెగటివ్ పాత్రల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతడు.. 'మర్డర్ 2' చిత్రానికి గాను ఉత్తమ విలన్గా స్క్రీన్ అవార్డును అందుకున్నాడు. ఇటీవల హిమేష్ రేషమియా నటించిన 'బ్యాడాస్ రవి కుమార్' మూవీలో అతడు కనిపించాడు. హిందీతోపాటు తమిళం, మలయాళం సినిమాలు చేశాడు.

E-Paper












