ఆ బాసుల ముందు చేతులు కట్టుకోవడం నా వల్ల కాదు, ఇక యూట్యూబ్‌లోనే నా సినిమాలు.. స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టీవర్ట్

Kristen Stewart On Hollywood Corporate System: హాలీవుడ్‌లో మితిమీరిన వ్యాపార ధోరణి, నిబంధనలపై స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టీవర్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం లాభాల కోసమే చూసే పెద్ద సంస్థల కంటే, తన స్నేహితులతో కలిసి చిన్న సినిమాలు తీసి యూట్యూబ్‌లో విడుదల చేయడమే బెటర్ అని స్పష్టం చేశారు.

Published on: May 17, 2026, 20:17:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kristen Stewart About Releasing Movies In YouTube: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టీవర్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్‌ను శాసిస్తున్న కార్పొరేట్ శక్తులు, మితిమీరిన బ్యూరోక్రసీపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నడుస్తున్న తీరు సృజనాత్మకతను, కళాకారుల స్వేచ్ఛను పూర్తిగా చంపేస్తోందని క్రిస్టెన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ బాసుల ముందు చేతులు కట్టుకోవడం నా వల్ల కాదు, ఇక యూట్యూబ్‌లోనే నా సినిమాలు.. స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టీవర్ట్
ఆ బాసుల ముందు చేతులు కట్టుకోవడం నా వల్ల కాదు, ఇక యూట్యూబ్‌లోనే నా సినిమాలు.. స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టీవర్ట్

ఫుల్ ఫిల్ ప్రమోషన్స్

'ట్విలైట్' సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ క్రిస్టెన్ స్టీవర్ట్ ప్రస్తుతం కేన్స్ వేదికగా తన కొత్త చిత్రం 'ఫుల్ ఫిల్' (Full Phil) ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వెరైటీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాలీవుడ్ పోకడలపై ఆమె చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సినిమా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మన దేశంలోనూ పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల గుత్తాధిపత్యం వల్ల వినూత్నమైన కథలు థియేటర్ల వరకు రాలేకపోతున్న తరుణంలో, క్రిస్టెన్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడి ఇండిపెండెంట్ దర్శకులకు సైతం కనెక్ట్ అవుతున్నాయి.

లాభాల వేటలో కళాకారుల గొంతు నొక్కుతున్నారు!

సినిమా రంగంలో పెట్టుబడిదారీ ఒత్తిళ్లు, వాణిజ్య అంచనాలు పెరిగిపోవడం వల్ల సృజనాత్మకత దెబ్బతింటోందని క్రిస్టెన్ స్టీవర్ట్ పేర్కొన్నారు. ఈ పరిమితుల వల్లే తాను హాలీవుడ్‌ను వదిలి అంతర్జాతీయ దర్శకులతో పనిచేయడానికి ఇష్టపడుతున్నట్లు చెప్పారు.

గత ఏడాది కేన్స్ వేదికగానే దర్శకురాలిగా తన తొలి చిత్రం 'ది క్రోనాలజీ ఆఫ్ వాటర్'ను ప్రదర్శించిన క్రిస్టెన్, భవిష్యత్తులో పెద్ద బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. పెద్ద స్టూడియోల చుట్టూ తిరుగుతూ కాలం వృథా చేసుకోవడం తనకు ఇష్టం లేదని క్రిస్టెన్ స్టీవర్ట్ తేల్చి చెప్పారు. తన తదుపరి చిత్రాల ప్రణాళికలను వివరిస్తూ ఆమె ఒక వినూత్నమైన నిర్ణయాన్ని ప్రకటించారు.

నా రూటే వేరు.. యూట్యూబ్‌లోనే నా సినిమాలు!

"నా స్నేహితులతో కలిసి చాలా తక్కువ ఖర్చుతో ఒక విభిన్నమైన సినిమా తీసి, దానిని నేరుగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడమే నా తదుపరి లక్ష్యం. దాని ద్వారా వచ్చే కొద్దిపాటి సొమ్ముతోనే నా తర్వాత సినిమా తీస్తాను. కేవలం డబ్బు సంపాదించడమే పరమావధిగా జీవించడం చాలా హాస్యాస్పదం. బడ్జెట్ కోసం పెద్ద పెద్ద కార్పొరేట్ బాసుల ముందు చేతులు కట్టుకుని ఐదేళ్లు వేచి చూడటం నా వల్ల కాదు" అని క్రిస్టెన్ స్టీవర్ట్ స్పష్టం చేశారు.

ఎ24 (A24), నియాన్ (Neon) వంటి స్వతంత్ర నిర్మాణ సంస్థలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, అలాంటి వారి ద్వారా సినిమాలు విడుదల చేయడమే తనకు ఇష్టమని క్రిస్టెన్ స్టీవర్ట్ తెలిపారు.

బిలియనీర్లను మరింత ధనవంతులను చేయలేను!

హాలీవుడ్ నిబంధనలు, అక్కడి వ్యవస్థపై తనకు విరక్తి కలిగిందని క్రిస్టెన్ ఘాటుగా విమర్శించారు. ఈ వ్యవస్థ కళాకారులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి ఏమాత్రం సహకరించదని ఆమె ఆరోపించారు.

"ప్రస్తుత సినిమా రంగాన్ని శాసిస్తున్న చాలా మందికి కళాత్మక విలువల కంటే కేవలం లాభాలే ముఖ్యం. బిలియనీర్లను మరింత పెద్ద బిలియనీర్లుగా మార్చే ఈ దారుణమైన వ్యవస్థ చూస్తుంటే నాకు పిచ్చెక్కుతోంది. ఎవరికీ ఉపయోగపడని నిబంధనల పేరుతో ఇక్కడ విపరీతంగా డబ్బు వృథా చేస్తున్నారు. ఈ గేమ్ రూల్స్ మార్చాల్సిన సమయం వచ్చింది" అని క్రిస్టెన్ స్టీవర్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం క్రిస్టిన్ స్టీవర్ట్ చేతిలో రెండు దర్శకత్వ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకదానిని ఈ ఏడాది చివరికల్లా, మరోదానిని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ఆమె పట్టుదలతో ఉన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More