Anantha Sriram: మలయాళంలో తీస్తే మ్యాజిక్ అంటారు.. కన్నడలో క్లాసిక్.. తెలుగులో మాత్రం పానిక్ అయిపోతారు: అనంత శ్రీరామ్
Anantha Sriram: కిరణ్ అబ్బవరం మూవీ 'చెన్నై లవ్ స్టోరీ' అదరగొడుతోంది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో పాపులర్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిల్మ్ రివ్యూయర్ల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. పక్క భాషా చిత్రాలను నెత్తిన పెట్టుకుంటూ, తెలుగుపై పక్షపాతం చూపిస్తున్నారని ఫైర్ అయ్యాడు.
Anantha Sriram: ఇటీవలి కాలంలో ఒక సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే డిజిటల్, యూట్యూబ్ వేదికగా వస్తున్న ఇన్స్టంట్ రివ్యూలపై టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఫిల్మ్ క్రిటిక్స్, రివ్యూయర్ల వైఖరిపై అనంత శ్రీరామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

మలయాళంలో మ్యాజిక్
'చెన్నై లవ్ స్టోరీ' ఈవెంట్లో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ రివ్యూయర్ల ద్వంద్వ వైఖరిని ఎండగట్టాడు. "చెన్నై లవ్ స్టోరీ మూవీ సెకండాఫ్ డల్ గా ఉందని అంటున్నారు. అదే స్క్రీన్ ప్లే, రైటింగ్ మలయాళ సినిమాలో ఉంటే 'మ్యాజిక్' అంటారు. తమిళ సినిమాలో ఉంటే 'టెర్రిఫిక్' అంటారు. కన్నడలో ఉంటే 'క్లాసిక్', హిందీలో ఉంటే 'హోలిస్టిక్' అని పొగుడుతారు’’ అని అనంత శ్రీరామ్ ఫైర్ అయ్యాడు.
తెలుగులో పానిక్
‘‘కానీ, అదే రీతిలో తెలుగు సినిమా వచ్చేసరికి ఎందుకనో పానిక్ (భయపడి) అయిపోయి పాండమిక్ అంటారు. 'అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్లకు కంచంలో' అన్నట్లు తెలుగు సినిమాలపై పక్షపాతం చూపిస్తున్నారు" అని అని అనంత శ్రీరామ్ ఘాటుగా విమర్శించాడు.
సెన్స్ ఉండాలంటూ
కెమెరా లెన్స్ ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం సెన్స్, బాధ్యత ఉండాలని, మనసుతో రాసిన కథలను మనసుతో ఆలోచించి రివ్యూలు ఇవ్వాలని అనంత శ్రీరామ్ చురకలు అంటించాడు. సినిమా నచ్చకపోతే ఇంట్లో చెప్పుకోవాలి తప్ప, వ్యూస్ కోసం పబ్లిసిటీ పిచ్చితో ప్రతికూలతను వ్యాప్తి చేయకూడదని ఫైర్ అయ్యాడు. ఇప్పుడు శ్రీరామ్ కామెంట్లు తెగ వైరల్ గా మారాయి.
చెన్నై లవ్ స్టోరీ అదుర్స్
ట్రేడ్ విశ్లేషణ ప్రకారం.. 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రం మొదటి వీకెండ్లోనే రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, వీక్డేస్లో (సోమ, మంగళవారాల్లో) కూడా హౌస్ఫుల్ ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది. ప్రారంభంలో కొంతమంది క్రిటిక్స్ నుంచి నెగెటివ్ టాక్ వచ్చినా, ఆడియన్స్ ఆదరణతో సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడటం విశేషం. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అవుతోంది.
బాక్సాఫీస్ వర్సెస్ క్రిటిక్స్
అయితే ఈ పరిణామం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. గతంలో 'బేబి', 'హనుమాన్', 'టిల్లు స్క్వేర్' వంటి చిత్రాల విషయంలోనూ ప్రారంభంలో వచ్చిన ప్రతికూల రివ్యూలను అధిగమించి ఆడియన్స్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందించారు. విమర్శకులు పక్క భాషా చిత్రాలకు ఇచ్చే మినహాయింపులు, తెలుగు లోకల్ కంటెంట్కు ఇవ్వడం లేదనే చర్చ కొంతకాలంగా టాలీవుడ్లో నడుస్తోంది.
కెమెరా ముందు కేవలం డిజిటల్ వ్యూస్ కోసం నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వేదికల కంటే పబ్లిక్ టాక్, ఫ్యామిలీ ఆడియన్సే బాక్సాఫీస్ విధిరాతను నిర్ణయిస్తున్నారని అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


