Nani CM Vijay: దళపతి విజయ్ అందుకే సీఎం అయ్యారు, కేవలం కలెక్షన్లతోనే ఓట్లు రావు.. తమిళనాడు రాజకీయంపై నాని కామెంట్స్!
Nani Comments On CM Vijay Politics: 'ది ప్యారడైజ్' సినిమా ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై టాలీవుడ్ హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లతోనే ఓట్లు రాలవని చెప్పిన నాని దళపతి విజయ్ సీఎం అవ్వడానికి కారణాలు ఏంటో తెలిపారు.
Nani Comments On CM Vijay Politics: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'ది ప్యారడైజ్'. 'దసరా' వంటి మాస్ బ్లాక్బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తమిళ మీడియా ప్రతినిధులతో నాని
తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన సినిమా ప్రమోషన్ల కార్యక్రమంలో నాని పాల్గొని తమిళ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి సి. జోసెఫ్ విజయ్ రాజకీయ అరంగేట్రం, ఆయన సాధించిన చారిత్రాత్మక విజయంపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేవలం కలెక్షన్లతోనే ఓట్లు రావు
కేవలం స్టార్డమ్, బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల వసూళ్లు సాధించినంత మాత్రాన ప్రజలు ఎవరికీ ఓట్లేసి గెలిపించరని నాని స్పష్టం చేశారు. "సినిమా విజయాలు లేదా బాక్సాఫీస్ కలెక్షన్ల ఆధారంగా మాత్రమే విజయ్ సర్ సీఎం అయ్యాడంటే నేను నమ్మను. తమిళ ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసం అసాధారణమైనది" అని నాని పేర్కొన్నారు.
ఇంట్లో మనిషిలా దశాబ్దాలుగా నడుచుకున్నారు
నటుడిగా ప్రజల మనసుల్లో సంపాదించుకునే ప్రేమే ఇలాంటి రాజకీయ విజయాలకు పునాది వేస్తుందని నాని విశ్లేషించారు. "ఇది ఒక్క రోజులోనో లేదా ఒక్క సినిమాతోనో వచ్చిన మార్పు కాదు. తమిళ ప్రజలందరూ విజయ్ సర్ తమ ఇంట్లో మనిషి అని భావించేలా ఆయన దశాబ్దాలుగా నడుచుకున్నారు. ఆ అనుబంధం, ఆయనపై పెరిగిన అపారమైన నమ్మకమే ఈ రోజు ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టాయి. తమిళ ప్రజలు అందించిన ఈ విజయం ఎంతో గొప్పది" అని నాని వివరించారు.
అసెంబ్లీలో విజయ్ ప్రదర్శన కేక
రాజకీయ రంగంలో ముఖ్యమంత్రిగా విజయ్ పాలనా తీరు బాగుందని నాని కొనియాడారు. "సోషల్ మీడియాలో, టీవీల్లో వచ్చిన అసెంబ్లీ క్లిప్పింగ్స్ చూశాను. ముఖ్యమంత్రి స్థానంలో విజయ్ సర్ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు" అని నాని వ్యాఖ్యానించారు.
జన నాయగన్ కలెక్షన్స్
తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించి ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ తమిళనాడు రాజకీయంలో విజయ్ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' బాక్సాఫీస్ వద్ద రూ. 324.54 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది.
సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్
ఇక తన కొత్త చిత్రం 'ది ప్యారడైజ్' విషయానికి వస్తే, సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్ సినిమా థియేటర్లలోకి రానుంది. మోహన్ బాబు, కయాదు లోహర్, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నారు.
'ది ప్యారడైజ్' పాన్ ఇండియా కాదు.. పక్కా తెలుగు సినిమా
అయితే దీనిని పాన్-ఇండియా సినిమా అని పిలవడానికి నాని నిరాకరించారు. "బాలీవుడ్లో జవాన్, పఠాన్ చిత్రాలను హిందీ సినిమాలు అని ఎలా పిలుస్తారో, అలాగే 'ది ప్యారడైజ్' కూడా మా పక్కా తెలుగు సినిమా. ఇతర భాషల్లోకి డబ్ చేసి అందిస్తున్నాం" అని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


