Chezhiyan Death: సినీ లోకంలో తీవ్ర విషాదం- జాతీయ అవార్డ్ గ్రహిత, దర్శకుడు చెళియన్ హఠాన్మరణం- విజయ్ సేతుపతి సంతాపం!
Director R Chezhiyan Passed Away: సినీ లోకంలో తీవ్ర విషాదం నెలకొంది. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఆర్. చెళియన్ (57) చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూలై 10న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల విజయ్ సేతుపతి ఆవేదన వ్యక్తం చేశారు.
National Award Winning Cinematographer R Chezhiyan Death: కోలీవుడ్లో ఒక అద్భుతమైన నూతన తరంగ శైలికి శ్రీకారం చుట్టిన విలక్షణ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఆర్. చెళియన్ ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన, చెన్నై తారామణిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 10న కన్నుమూశారు.

చెళియన్ హఠాన్మరణం
ఆయన వయసు 57 ఏళ్లు. కెమెరా లెన్స్ వెనుక ఉంటూ ఎన్నో వెండితెర అద్భుతాలను సృష్టించిన చెళియన్ హఠాన్మరణంతో దక్షిణ భారత సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. చెళియన్ మరణవార్త తెలియగానే సినీ రంగానికి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
"రెస్ట్ ఇన్ పీస్ చెళియన్ సర్" అని స్టార్ హీరో విజయ్ సేతుపతి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులు అధం బావా, శశికుమార్, కాయల్ దేవరాజ్ వంటి వారు చెళియన్తో తమకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
అధం బావా ఎమోషనల్
"నా ప్రియ మిత్రుడు చెళియన్ మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఎప్పుడూ ముఖంపై చిరునవ్వుతో, అందరితో ఎంతో ఆప్యాయంగా, సరళంగా ఉండే ఆయన పవిత్ర స్వభావం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తమిళ సినిమాకు ఆయన అందించిన అరుదైన కళా సేవలు చిరస్మరణీయం. ఈ కోల్పోలేని లోటును తట్టుకునే శక్తిని భగవంతుడు ఆయన కుటుంబానికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను" అని దర్శకుడు అధం బావా పేర్కొన్నారు.
"మంచి సినిమాటోగ్రాఫర్ కేవలం దృశ్యాలను మాత్రమే సృష్టించడు, ఎమోషన్స్కు కూడా ప్రాణం పోస్తాడు. ఆ కళను జీవితాంతం కాపాడిన చెళియన్ సార్కు మా ఘన నివాళి" అని దర్శకుడు, నటుడు శశికుమార్ నివాళులర్పించారు.
ఇంజనీరింగ్ వదిలి.. పీసీ శ్రీరామ్ శిష్యుడిగా
తమిళనాడులోని శివగంగలో జన్మించిన చెళియన్ చదువు పూర్తయ్యాక సివిల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. అయితే, విజువల్స్ పట్ల, సినిమా పట్ల ఉన్న విపరీతమైన ప్యాషన్తో ఆయన సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ వద్ద చేరి కెమెరా పనితనంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన 'కల్లూరి' (2007) సినిమాతో స్వతంత్ర సినిమాటోగ్రాఫర్గా పరిశ్రమలోకి అడుగుపెట్టారు చెళియన్.
విజయ్ సేతుపతి హీరోగా పరిచయమైన 'తెన్మెర్కు పరువకాట్రు', జాతీయ అవార్డు గెలుచుకున్న 'జోకర్', దర్శకుడు బాలా తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ 'పరదేశి' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు ఆయనే కెమెరామెన్గా వ్యవహరించారు. ప్రతి ఫ్రేమ్ను ఎంతో సహజంగా, పాత్రల భావోద్వేగాలకు అద్దం పట్టేలా తీయడం చెళియన్ ప్రత్యేకత.
'పరదేశి' చిత్రంలో చెళియన్ చూపించిన విజువల్స్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 2013లో జరిగిన ప్రతిష్టాత్మక బిఎఫ్ఐ (BFI) లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన 'ఉత్తమ సినిమాటోగ్రాఫర్' అవార్డును గెలుచుకున్నారు.
భావితరాలకు మార్గదర్శిగా..
చెళియన్ కేవలం సినిమాల మేకింగ్కే పరిమితం కాలేదు. కొత్త తరం మేకర్లను, సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశారు. 'ది ఫిల్మ్ స్కూల్' స్థాపించి ఎంతోమంది యువతీ యువకులకు ఉచితంగా సినిమా పాఠాలు చెప్పారు. ఆయన మార్గదర్శకత్వంలో ఒకేసారి 34 మంది విద్యార్థులు 34 స్వతంత్ర ఫీచర్ ఫిల్మ్స్ను డైరెక్ట్ చేయడం అప్పట్లో ఒక పెద్ద రికార్డుగా నిలిచింది.
సినిమాపై ఉన్న ప్రేమతో ఆయన ప్రపంచ సినిమాపై అవగాహన కల్పిస్తూ 'ఉలగ సినిమా' (ప్రపంచ సినిమా) పేరుతో రాసిన వ్యాసాల సంకలనం సినీ విద్యార్థులకు, చలనచిత్ర ప్రేమికులకు ఒక గైడ్లా ఉపయోగపడుతోంది.
చెళియన్ మరణంతో ప్రతిభావంతుడైన ఒక అద్భుత సాంకేతిక నిపుణుడిని, మంచి మనసున్న గురువును కోల్పోవడం సినీ రంగానికి తీరని లోటు అని సినీ వర్గాలు అంటున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


