Oscars 2027 Rules: ఆస్కార్ నిబంధనల్లో పెను మార్పులు- భారతీయ సినిమాలకు ఇక పండగే- 2027 నుంచి అమలు!

Oscars 2027 Rules Changed In Actors Best Movies Category: 2027లో జరిగే 99వ ఆస్కార్ అవార్డుల కోసం అకాడమీ కీలక నిబంధనలను సవరించింది. ఒకే దేశం నుంచి బహుళ ఎంట్రీలకు అవకాశం కల్పించడంతో పాటు, ఏఐ వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది. ఫలితంగా ఈ మార్పులు భారతీయ సినిమాలకు కలిసి వచ్చేలా ఉన్నాయి.

Published on: May 2, 2026, 11:27:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Oscars 2027 Rules Changed: ప్రపంచ సినిమా వేదికపై అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ నిబంధనలు మారాయి. 2027లో జరగనున్న 99వ ఆస్కార్ వేడుకల కోసం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఆస్కార్ నిబంధనల్లో పెను మార్పులు- భారతీయ సినిమాలకు ఇక పండగే- 2027 నుంచి అమలు! (Matt Sayles/Invision/AP)
ఆస్కార్ నిబంధనల్లో పెను మార్పులు- భారతీయ సినిమాలకు ఇక పండగే- 2027 నుంచి అమలు! (Matt Sayles/Invision/AP)

భారతీయ నిర్మాతల్లో

ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారడమే కాకుండా, భారతీయ చిత్రనిర్మాతల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్' కేటగిరీలో భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే పరిణామం.

భారత చిత్రాలకు బహుళ అవకాశాలు

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం, 'ఉత్తమ అంతర్జాతీయ చిత్రం' కేటగిరీకి ప్రతి దేశం నుంచి కేవలం ఒక్క సినిమాను మాత్రమే అధికారికంగా పంపే అవకాశం ఉండేది. దీనివల్ల మన దేశంలో ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలు వచ్చినా, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన ఒకే ఒక్క సినిమాకే ఆస్కార్ రేసులో ఉండే అర్హత దక్కేది.

కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఆయా దేశాల అధికారిక ఎంట్రీలతో సంబంధం లేకుండా.. బెర్లిన్, కేన్స్, వెనిస్, సన్ డాన్స్, టొరంటో లేదా బుసాన్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో టాప్ అవార్డులు గెలుచుకున్న సినిమాలు నేరుగా ఆస్కార్ బరిలో నిలబడొచ్చు. అంటే, భవిష్యత్తులో భారత్ నుంచి ఒకే ఏడాది రెండు మూడు సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్ల కోసం పోటీ పడొచ్చు.

నటీనటులకు డబుల్ ధమాకా

మరో ఆసక్తికరమైన మార్పు యాక్టింగ్ కేటగిరీలో జరిగింది. గతంలో ఒక నటుడు ఒకే కేటగిరీలో (ఉదాహరణకు బెస్ట్ యాక్టర్) రెండు వేర్వేరు సినిమాలకు టాప్ ఓట్లు సాధించినా, కేవలం ఒకే సినిమాకు మాత్రమే నామినేషన్ ఇచ్చేవారు. ఇకపై అలా కాదు. ఒక నటుడు రెండు వేర్వేరు చిత్రాల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చి, రెండింటికీ ఓట్లు సాధిస్తే.. ఆ రెండింటికీ నామినేషన్లు పొందే వీలుంటుంది. ఇది నటీనటుల ప్రతిభకు దక్కే నిజమైన గౌరవంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏఐ (AI) పై ఉక్కుపాదం

సాంకేతికత పెరిగిపోతున్న తరుణంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) సృష్టించే ముప్పును అకాడమీ ముందుగానే పసిగట్టింది. నటీనటుల విభాగంలో మానవ ప్రమేయం తప్పనిసరి అని స్పష్టం చేసింది. నటుల అనుమతి లేకుండా వారి రూపాన్ని వాడినా (Likeness), ఏఐ సాయంతో పాత్రలను సృష్టించినా అవి అనర్హమవుతాయి.

రచన విభాగంలో కూడా స్క్రిప్ట్ కచ్చితంగా మనిషి రాసి ఉండాలని, ఏఐ వాడకంపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. సాంకేతికత ఎన్ని మార్పులు తెచ్చినా, మనిషి సృజనాత్మకతకే అగ్రతాంబూలం అని అకాడమీ నొక్కి చెప్పింది.

డైరెక్టర్లకే క్రెడిట్

ఇప్పటివరకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ అవార్డు గెలిస్తే, ఆ గౌరవం సదరు దేశానికి దక్కినట్లుగా భావించేవారు. కానీ 2027 నుంచి ఈ అవార్డును ఆ చిత్ర దర్శకుడికి ప్రధానం చేస్తారు. ఆస్కార్ రికార్డు పుస్తకాల్లో కూడా దర్శకుడి పేరే ప్రముఖంగా కనిపిస్తుంది.

అలాగే కాస్టింగ్ డైరెక్టర్లకు ఇచ్చే స్టాచ్యూల సంఖ్యను రెండు నుంచి మూడుకు పెంచారు. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాల్లో కూడా ఓటింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చారు.

99వ ఆస్కార్ వేడుకలు 2027 మార్చి 14న జరగనున్నాయి. ఈ కొత్త నిబంధనలు ఆస్కార్ రేసును మరింత రసవత్తరంగా మార్చడమే కాకుండా, ప్రతిభ గల దర్శకులకు ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చేలా ఉన్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More