Peddi BO: ఉత్తరాదిన చప్పగా.. తెలుగులో కాసుల వేట- పెద్ది బడ్జెట్, 2 డేస్ కలెక్షన్స్ ఇవే! లాభానికి ఎన్ని కోట్లు రావాలంటే?
Ram Charan Peddi Box Office Collection Day 2: రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది తెలుగులో కాసుల వేట కొనసాగిస్తోంది. ఇండియాలో రూ.96 కోట్లు రాబట్టిన పెద్ది బడ్జెట్, 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్, లాభం రావాలంటే ఎన్ని కోట్లు కావాలో ఇక్కడ తెలుసుకుందాం.
Peddi 2 Days Worldwide Box Office Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం 'పెద్ది' థియేటర్లలో కాసుల వేట కొనసాగిస్తోంది. జూన్ 3న జరిగిన గ్రాండ్ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

100 కోట్ల మైలురాయికి
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పెద్ది చిత్రం మొదటి రోజే భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల క్లబ్లో చేరి టాలీవుడ్ సత్తాను చాటింది. రెండో రోజు వసూళ్లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, వీకెండ్ కాకముందే ఈ సినిమా రూ.100 కోట్ల మైలురాయికి అత్యంత చేరువగా రావడం విశేషం.
రెండు రోజుల అధికారిక వసూళ్లు ఇవే
ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ (Sacnilk) అందించిన గణాంకాల ప్రకారం, ‘పెద్ది’ చిత్రం రెండో రోజు ఇండియా వ్యాప్తంగా రూ.26.90 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. దీంతో పెద్ది రెండు రోజుల మొత్తం దేశీయ వసూళ్లు రూ.96.40 కోట్లకు చేరాయి.
శుక్రవారం (జూన్ 5) నాడు దేశవ్యాప్తంగా ప్రదర్శించిన 10,113 షోలలో పెద్ది సినిమా 32.7 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ స్పోర్ట్స్ డ్రామా ‘చందు ఛాంపియన్’ సాధించిన లైఫ్టైమ్ కలెక్షన్లను (రూ.63.57 కోట్లు) పెద్ది చిత్రం కేవలం 2 రోజుల్లోనే దాటేయడం విశేషం.
ఉత్తరాదిన చప్పగా.. తెలుగు రాష్ట్రాల్లో మాస్ జాతర
'ఆర్ఆర్ఆర్' చిత్రంతో రామ్ చరణ్కు నార్త్ ఇండియాలో భారీ క్రేజ్ వచ్చినప్పటికీ, జాన్వీ కపూర్, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ లాంటి హిందీ నటులు ఈ సినిమాలో ఉన్నా కూడా ఉత్తరాది కలెక్షన్లు నిరాశపరుస్తున్నాయి.
రెండో రోజు తెలుగు వెర్షన్ నుంచే రూ.23.39 కోట్ల వసూళ్లు రాగా, హిందీ వెర్షన్ నుంచి కేవలం రూ.2.02 కోట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు బుధవారం నాటి ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా రూ.18.50 కోట్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
మొదటి రోజు గురువారం నాడు 12,412 షోలలో 45.5 శాతం ఆక్యుపెన్సీతో రూ.51 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం హిందీ బెల్ట్లో ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ (రూ.167.46 కోట్లు) చిత్రంతో పెద్ది పోటీ పడాల్సి వస్తోంది.
సోలో హీరోగా చరణ్ కెరీర్ బెస్ట్ రికార్డ్
రామ్ చరణ్ గత చిత్రం 'గేమ్ ఛేంజర్' రెండు రోజుల్లో దేశీయంగా రూ.72.60 కోట్లు వసూలు చేయగా, పెద్ది చిత్రం ఆ రికార్డును సులువుగా దాటేసింది. అయితే 'ఆర్ఆర్ఆర్' సాధించిన రెండు రోజుల రికార్డు కలెక్షన్ల (రూ.216.7 కోట్లు) కంటే ఇది వెనుకబడి ఉంది. అయితే, సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా పెద్ది నిలిచింది.
వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రంలో క్రీడల నేపథ్యంలో సాగే పెద్ది అనే యువకుడి కథను దర్శకుడు బుచ్చిబాబు సాన వెండితెరపై ఆవిష్కరించారు. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి ఆటల ద్వారా తనను తాను నిరూపించుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే పాత్రలో చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
బడ్జెట్ అండ్ 2 డేస్ కలెక్షన్స్
కాకపోతే అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ను చూపించిన విధానంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. శివ రాజ్కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది. రెండు రోజుల్లో పెద్ది సినిమాకు వరల్డ్ వైడ్గా రూ. 150 కోట్లు, ఇండియాలో రూ. 114 కోట్లు, ఓవర్సీస్లో రూ. 36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం పెద్ది సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.400-450 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ను అందుకోవాలి. అంటే, పెద్ది సినిమాకు ఇంకా సుమారుగా రూ. 290 కోట్ల నెట్ కలెక్షన్స్ రావాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


