బాహుబలి యూనివర్స్ ఇంకా ఉంది-త్వ‌ర‌లోనే అనౌన్స్‌మెంట్‌-ఆ ప్ర‌శ్నే సీక్వెల్‌పై ఇంట్రెస్ట్ క‌లిగించింది: ప్రొడ్యూసర్ శోభు

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా బాహుబలి. ఇప్పుడు రీ రిలీజ్ ల్లోనూ ట్రెండ్ క్రియేట్ చేసేందుకు ఈ మూవీ రెండు భాగాలను ఒకటిగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బాహుబలి యూనివర్స్ పై ప్రొడ్యూసర్ శోభు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. 

Published on: Oct 29, 2025 9:40 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు సినిమాను బాహుబలికి ముందు, ఆ తర్వాత అని చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇప్పుడన్నీ పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. కానీ టాలీవుడ్ లో అందుకు అదిరే పునాది వేసింది బాహుబలి. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన రెండు చిత్రాలూ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు రెండు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

రాజమౌళితో శోభు యార్లగడ్డ (x/Shobu Yarlagadda)
రాజమౌళితో శోభు యార్లగడ్డ (x/Shobu Yarlagadda)

కొత్త అనుభూతి

బాహుబలి ది ఎపిక్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈ మూవీ అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని శోభు యార్లగడ్డ అన్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి ది బిగినింగ్ 2015లో, బాహుబలి ది కంక్లూజన్ 2017లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.2,000 కోట్లకు పైగా వసూలు చేసి పాన్-ఇండియన్ సినిమా ఇలా ఉండాలని చాటి చెప్పింది.

"ప్రేక్షకులు 'బాహుబలి'ని మునుపెన్నడూ చూడని విధంగా అనుభూతి చెందుతారు" అని యార్లగడ్డ అన్నారు. కొత్త తరానికి ఒక గొప్ప సినిమా దృశ్యాన్ని అందించడం, అదే సమయంలో పాత అభిమానుల నాస్టాల్జియాను (పాత జ్ఞాపకాలను) మళ్లీ రేకెత్తించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

రీమాస్టర్డ్

ప్రభాస్, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి చిత్రం రీమాస్టర్డ్ కలయికతో మళ్లీ విడుదల కానుంది. రీమాస్టర్డ్ ఎడిషన్‌లో డాల్బీ అట్మాస్ సౌండ్, ఐమ్యాక్స్ అప్‌స్కేలింగ్ వంటి అధునాతన సాంకేతికతలు ఉంటాయని, అలాగే రాజమౌళి పర్యవేక్షణలో కొత్తగా రీ-ఎడిట్ చేశామని నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పారు.

బాహుబలి యూనివర్స్

బాహుబలి యూనివర్స్ లో రెండు సినిమాలే కాదు ఓ నవల, యానిమేటెడ్ సిరీస్ కూడా వచ్చింది. బాహుబలి 1కు ముందు రాసిన కథగా "ది రైజ్ ఆఫ్ శివగామి" నవలను తీసుకొచ్చారు. యానిమేటెడ్ సిరీస్ "బాహుబలి: ది లాస్ట్ లెజెండ్స్"ను క్రియేట్ చేశారు. ఈ యూనివర్స్‌తో తమ ప్రయాణం ఇంకా ముగియలేదని యార్లగడ్డ చెప్పారు. "స్పినోఫ్‌లు (కొత్త కథాంశాలు), విస్తరణల కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వాటిని త్వరలో ప్రకటిస్తాము" అని ఆయన అన్నారు.

బెంచ్ మార్క్

‘‘బాహుబలి: ది బిగినింగ్ మూవీ భారతీయ సినీ నిర్మాణంలో ఒక ప్రమాణాన్ని (బెంచ్‌మార్క్‌ను) నెలకొల్పుతుందని తాను అస్సలు ఊహించలేదు. ఇది బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఏకం చేసింది" అని శోభు యార్లగడ్డ అన్నారు.

అయినప్పటికీ ఇంత భారీ స్థాయిలో మరే ప్రాజెక్ట్‌ను చేపట్టనని ఈ నిర్మాత ఒప్పుకున్నారు. "ఆ వైభవాన్ని కొనసాగించడం నుండి బడ్జెట్‌ను అదుపులో ఉంచడం వరకు సవాళ్లు చాలా పెద్దవి. పరిమితులు ఉన్నప్పటికీ, మేము నాణ్యత విషయంలో రాజీ పడలేదు" అని ఆయన వివరించారు.

ఆ ప్రశ్నతో

సినిమాకు అద్భుతమైన ప్రజాదరణ రావడానికి ఒక కారణమైన సోషల్ మీడియా మార్కెటింగ్‌ను కూడా యార్లగడ్డ కొనియాడారు. "ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. భాషలు, ప్రాంతాల అంతటా నిబద్ధతను పెంచడానికి మాకు సహాయపడింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే వైరల్ ప్రశ్న సీక్వెల్‌కు ఒక సహజమైన మార్కెటింగ్ ముడి (హుక్) గా మారింది. మొదటి చిత్రం ఉత్కంఠను పెంచగా, రెండోది ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా తక్షణ సంతృప్తిని ఇచ్చింది" అని శోభు యార్లగడ్డ అన్నారు.