Rajinikanth: విజయ్ సీఎం అవ్వడం చూసి షాకయ్యా.. అసూయ ఎందుకు?.. తప్పుడు ప్రచారాలపై రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు
Rajinikanth: తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత వస్తున్న రూమర్లపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. సీఎం విజయ్ పై తనకు ఎలాంటి అసూయ లేదని, స్టాలిన్ తో తన స్నేహం రాజకీయాలకు అతీతమని ఆయన స్పష్టం చేశారు. పోయెస్ గార్డెన్ ప్రెస్ మీట్ పూర్తి వివరాలు.
Rajinikanth: తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మౌనంగా ఉండటంపై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు నడిచాయి. ఈ ఫలితాల పట్ల రజినీకాంత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కొందరు, పార్టీల విలీనం కోసం ఆయన తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని మరికొందరు ప్రచారం చేశారు. వీటిపై రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రజినీకాంత్ ప్రెస్ మీట్
ఈ ఊహాగానాలకు, తప్పుడు ప్రచారాలకు రజినీకాంత్ ఆదివారం ఉదయం చెన్నై పోయెస్ గార్డెన్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తలైవా గట్టి సమాధానమిచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత తనపై వస్తున్న వదంతులను తిప్పికొట్టడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు రజినీకాంత్ ప్రకటించారు.
స్టాలిన్ తో స్నేహం
"నాపై వస్తున్న రూమర్లకు నేను స్పందించకపోతే, సమాజం వాటినే నిజాలుగా నమ్మే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నేను డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ను కలిసి పరామర్శించాను. దీనిపై చాలా మంది విమర్శలు గుప్పించారు. కానీ, స్టాలిన్ కు నాకు మధ్య ఉన్న స్నేహం కేవలం రాజకీయాలకు పరిమితం కాదు, అది రాజకీయాలకు అతీతమైంది. ఓటమి బాధించింది’’ అని రజినీకాంత్ పేర్కొన్నారు.
అసూయ ఎందుకు?
టీవీకే పార్టీ ఘనవిజయం సాధించి మెజారిటీ స్థానాలు దక్కించుకున్నా, రజినీకాంత్ వ్యక్తిగతంగా విజయ్ కి శుభాకాంక్షలు చెప్పలేదనే విమర్శలపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. విజయ్ సీఎం కాకూడదని రజినీకాంత్ భావిస్తున్నారని, రెండు పార్టీలను విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. "నేను ఎయిర్ పోర్ట్ లో విజయ్ ను కలిసి విష్ చేయలేదని కొందరు రచ్చ చేస్తున్నారు. కానీ, నేను ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపా" అని గుర్తు చేశారు.
చౌకబారు మనస్తత్వం కాదు
కొందరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై స్పందిస్తూ.. "వేరే విషయాల గురించి అనవసరంగా మాట్లాడేంత చౌకబారు మనస్తత్వం ఉన్న వ్యక్తిని కాదు ఈ రజినీ. విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నారనే వార్త వినగానే నేను తీవ్ర షాక్ కు గురయ్యా. ఆయన విజయం ఖరారు కాగానే నేను అభినందనలు తెలియజేశా. నేను అసలు రాజకీయాల్లోనే లేనప్పుడు, విజయ్ విజయాన్ని చూసి నేనెందుకు అసూయపడతాను’’ అని రజినీకాంత్ ప్రశ్నించాడు.
‘‘ఒకవేళ నా సమకాలీనుడు కమల్ హాసన్ సీఎం అయితే నేను కొంచెం అసూయపడతానేమో (నవ్వుతూ). విజయ్ కి నాకు మధ్య పాతికేళ్ల జనరేషన్ గ్యాప్ ఉంది. మాలాంటి వాళ్ల మధ్య పోటీ ఉండటం కూడా అంత బాగుండదు" అని రజినీకాంత్ వ్యాఖ్యానించారు.
ఎమ్జీఆర్, ఎన్టీఆర్ ల కంటే ఎక్కువే
కొత్త ముఖ్యమంత్రి విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని రజినీకాంత్ కొనియాడారు. "కేవలం 52 ఏళ్ల వయసులోనే విజయ్ అద్భుతాలు సృష్టించాడు. ఆ వయసులో దిగ్గజాలు ఎమ్జీఆర్, ఎన్టీఆర్ సాధించిన దానికంటే ఎక్కువే సాధించాడని చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలోని రెండు బలమైన ద్రవిడ పార్టీలను ఒంటరిగా ఎదుర్కొని విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదు. ఈ విజయం నాకు ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని ఇచ్చింది." అని రజినీకాంత్ ప్రశంసించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న 1: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది?
జవాబు: తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఒంటరిగా 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతుతో మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రశ్న 2: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ను రజినీకాంత్ ఎందుకు కలిశారు?
జవాబు: కొలత్తూరు నియోజకవర్గంలో ఎంకే స్టాలిన్ ఓటమి చవిచూడటంతో, రజినీకాంత్ ఆయనను పరామర్శించడానికి వెళ్లారు. తమ మధ్య ఉన్న స్నేహం రాజకీయాలకు అతీతమైనదని, అందుకే మర్యాదపూర్వకంగా కలిశానని రజినీకాంత్ స్పష్టం చేశారు.
ప్రశ్న 3: విజయ్ నటించిన చివరి సినిమా పేరు ఏమిటి? దానిపై రజినీకాంత్ ఏమన్నారు?
జవాబు: విజయ్ నటించిన చివరి సినిమా పేరు 'జన నాయగన్'. ఈ సినిమా ఆన్ లైన్ లో లీక్ కావడంపై రజినీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పైరసీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


