రజనీకాంత్, కమల్ హాసన్ మూవీ ప్రోమో.. ఏఐ చేసింది కాదన్న మేకర్స్.. కొత్త వీడియో రిలీజ్.. ఎలా చేశారో చూడండి
రజనీకాంత్, కమల్ హాసన్ మూవీ ప్రోమో ఏఐ ద్వారా చేశారన్న పుకార్లకు మేకర్స్ చెక్ పెట్టారు. ఇదీ అసలు వీడియో అంటూ ఓ మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. డైరెక్టర్ నెల్సన్ ఈ మెగా ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నెల్సన్ దర్శకత్వంలో రాబోతున్న ఒక సినిమా కోసం మళ్లీ కలుస్తున్నారు. గత వీకెండ్ లో ప్రకటించిన ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఈ ఇద్దరు స్టార్ హీరోలతో పాటు దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కూడా కనిపించారు. అయితే ఆ ప్రోమో వీడియో కోసం ఏఐ వాడారు అనే పుకార్లు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు ఆ పుకార్లను పూర్తిగా ఖండించారు.

ప్రోమోలో ఎలాంటి ఏఐ వాడలేదు
ఏఐ ఉపయోగించారనే పుకార్లను పటాపంచలు చేయడానికి ఈ చిత్ర నిర్మాణ సంస్థ 'రెడ్ జెయింట్ మూవీస్' సోషల్ మీడియాలో ఒక కొత్త వీడియోను విడుదల చేసింది. కెమెరా వెనుక జరిగిన విషయాలను చూపే ఈ వీడియోలో రజనీకాంత్, కమల్ సెట్లో నెల్సన్తో కలిసి ప్రోమో కోసం షూటింగ్ చేయడం స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రోమోలోని ఎన్నో సన్నివేశాలను సెట్ లో ఎలా చిత్రీకరించారో ఆ వీడియోలో చూపించారు. ఏఐ అని ఆరోపణలు ఎదుర్కొన్న ఎక్స్ట్రా నటులు కూడా అందులో నడుస్తూ, షూటింగ్లో పాల్గొనడం మనం చూడవచ్చు. తమ షాట్స్ పూర్తయిన తర్వాత రజనీకాంత్, కమల్ ఆత్మీయంగా హత్తుకోవడంతో ఈ మేకింగ్ వీడియో ముగుస్తుంది.
పుకార్లు పుట్టించిన వారికి నెటిజన్ల కౌంటర్
ఆ వీడియోను పోస్ట్ చేస్తూ.. "లైట్స్. కెమెరా. యాక్షన్. కేహెచ్ వర్సెస్ ఆర్కే ప్రోమో మేకింగ్ పై ఓ లుక్కేయండి" అని నిర్మాతలు రాసుకొచ్చారు. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగానే స్పందించారు. "ఏఐ అని చెప్పిన వాళ్లు, వెళ్లి పని చూసుకోండి" అని ఒక అభిమాని కామెంట్ చేశారు.
సన్నివేశంలోని ఎక్స్ట్రాలను ఉద్దేశించి మరొకరు "ఆ మోడల్స్ ఏఐ అని ఎవరు చెప్పారు" అని వ్యాఖ్యానించారు. "దీనినే నిజమైన కష్టం, అంకితభావం, నిబద్ధత అంటారు. ఏఐ చూడటానికి బాగానే ఉండొచ్చు కానీ, నిజమైన శ్రమ ఎప్పటికీ శాశ్వతం, దాన్ని దేనితోనూ భర్తీ చేయలేము" అని ఒకరు రాసుకొచ్చారు.
ప్రోమోను ఏఐతో తయారు చేశారని ఆరోపించిన వారిని ప్రశ్నిస్తూ ఇంకా చాలా మంది కామెంట్లు పెట్టారు. "ఇది ఏఐ అని చెప్పిన ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు".. "ఏఐ బ్యాచ్ కు రెండు నిమిషాల మౌనం" లాంటి వ్యాఖ్యలు అందులో ఉన్నాయి.
47 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన స్టార్లు
రజనీకాంత్, కమల్ హాసన్ గతంలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. వారు చివరిసారిగా 1979లో కే. బాలచందర్ దర్శకత్వం వహించిన 'నినైత్తాలే ఇనిక్కుమ్' చిత్రంలో కలిసి కనిపించారు. అంతకంటే ముందు వారు అపూర్వ రాగంగళ్, అంతులేని కథ, పదునారు వయదినిలే, ఇళమై ఊంజల్ ఆడుకిరతు తదితర చిత్రాల్లో కలిసి నటించారు.
గతేడాది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన తన 'కూలీ' సినిమా విడుదల సమయంలో రజనీకాంత్ ఈ కలయిక గురించి సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఆ తర్వాత సిబి చక్రవర్తి ఆ ప్రాజెక్టును చేపట్టారు.
కానీ ఈ ఇద్దరు స్టార్లు కలిసి నటించే సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. వారాల తరబడి వస్తున్న పుకార్ల తర్వాత, నెల్సన్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తారని ఖరారైంది. సినిమాను ప్రారంభిస్తూ ఈ అద్భుతమైన ప్రోమోను విడుదల చేశారు. నెల్సన్ తో కలిసి రజనీకాంత్ 'జైలర్ 2' కోసం కూడా పనిచేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


