RGV Underworld: ఒక్కరిని చంపితే పది మంది భయపడతారు.. అందుకే అండర్ వరల్డ్ ఆ ఇద్దరిని టార్గెట్ చేసింది: రామ్ గోపాల్ వర్మ
RGV Underworld: బాలీవుడ్ లో అండర్ వరల్డ్ మాఫియా గురించి రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ముఖ్యంగా గుల్షన్ కుమార్ ను చంపడం, రాకేష్ రోషన్ పై హత్యా ప్రయత్నం చేయడానికి కారణమేంటో అతడు తెలిపాడు.
RGV Underworld: 1990వ దశకంలో ముంబై అండర్ వరల్డ్.. బాలీవుడ్ ఇండస్ట్రీని ఎలా గజగజలాడించిందో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా వివరించాడు. రాకేశ్ రోషన్ పై హత్యాప్రయత్నం, గుల్షన్ కుమార్ దారుణ హత్య వెనుక ఉన్న మాఫియా లెక్కలను అతడు బయటపెట్టాడు.

వెన్నులో వణుకు పుట్టించే వాస్తవాలు
ముంబై మాఫియా కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో రామ్ గోపాల్ వర్మ (RGV) సిద్ధహస్తుడు. 'సత్య', 'కంపెనీ' వంటి చిత్రాలతో అండర్ వరల్డ్ అంతరాలను చూపించిన అతడు.. తాజాగా క్రైమ్ రైటర్ హుస్సేన్ జైదీతో జరిగిన సంభాషణలో 1990వ దశకంలోని భయానక పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.
ఆ కాలంలో దావూద్ ఇబ్రహీం, అబూ సలేం వంటి గ్యాంగ్స్టర్లు బాలీవుడ్ అగ్ర హీరోలను, నిర్మాతలను ఎలా తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూశారో ఆర్జీవీ వివరించాడు.
"ఒకరిని చంపాలి.. పది మంది దగ్గర వసూలు చేయాలి"
మాఫియా పనితీరు చాలా లెక్కలతో కూడుకుని ఉంటుందని వర్మ విశ్లేషించాడు. "అండర్ వరల్డ్ తమ అధికారాన్ని చాటుకోవాలంటే సామాన్యులను టార్గెట్ చేస్తే సరిపోదు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లేదా రాకేశ్ రోషన్ వంటి పెద్ద వాళ్లను టార్గెట్ చేయాలి. అప్పుడే ఇండస్ట్రీ మొత్తం భయం గుప్పిట్లోకి వస్తుంది" అని అతడు పేర్కొన్నాడు.
కేవలం డబ్బు కోసమే కాకుండా, ఇండస్ట్రీపై పట్టు సాధించడానికి, తమ మాటే శాసనం అని నిరూపించుకోవడానికి గ్యాంగ్స్టర్లు ఈ దాడులకు పాల్పడేవారని అతడు వెల్లడించాడు. "ఒకరిని చంపి.. ఆ భయంతో పది మంది దగ్గర వసూలు చేయడం" అనేదే వారి అసలు సూత్రమని ఆర్జీవీ తెలిపాడు.
హృతిక్ రోషన్ డేట్స్ కోసమే రాకేశ్ రోషన్పై దాడి?
2000వ సంవత్సరంలో 'కహో నా ప్యార్ హై' సినిమాతో హృతిక్ రోషన్ ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయ్యాడు. ఆ సమయంలో హృతిక్ డేట్స్ కోసం ఛోటా షకీల్ ముఠా రాకేశ్ రోషన్పై ఒత్తిడి తెచ్చినట్లు వర్మ గుర్తు చేశాడు.
విదేశీ నిధులతో నిర్మించే ఒక ప్రాజెక్ట్ కోసం హృతిక్ను అడిగినప్పుడు రాకేశ్ రోషన్ నిరాకరించారని, ఆ కక్షతోనే జనవరి 21, 2000న అతని ఆఫీస్ బయటే కాల్పులు జరిపారని ఆర్జీవీ వెల్లడించాడు. అదృష్టవశాత్తూ ఆ దాడి నుంచి రాకేశ్ రోషన్ ప్రాణాలతో బయటపడ్డాడు.
గుల్షన్ కుమార్ హత్య వెనుక అసలు కారణం
1997లో టీ-సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై వర్మ స్పందిస్తూ.. గుల్షన్ కుమార్ అపారమైన ఎదుగుదల చూసి ఓర్వలేక కొందరు, అండర్ వరల్డ్ సహాయం తీసుకున్నారని పేర్కొన్నాడు. అబూ సలేం వంటి గ్యాంగ్స్టర్లు తమ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోవాలని ఈ దారుణానికి ఒడిగట్టారని ఆర్జీవీ తెలిపాడు.
గుల్షన్ కుమార్ మాఫియా డిమాండ్లకు లొంగకపోవడం కూడా వారి ఆగ్రహానికి కారణమైంది. ఈ వార్త తెలిసినప్పుడు తాను నిర్మాత జాము సుగంధ్ ఇంట్లో ఉన్నానని, ఆ వార్త వినగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారని వర్మ ఆనాటి భయానక వాతావరణాన్ని గుర్తు చేసుకున్నాడు.
నేడు బాలీవుడ్లో అండర్ వరల్డ్ ప్రభావం తగ్గినా, ఆనాడు జరిగిన సంఘటనలు తన సినిమాలకు ప్రేరణగా నిలిచాయని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. రాకేశ్ రోషన్పై అండర్ వరల్డ్ ఎందుకు దాడి చేసింది?
హృతిక్ రోషన్ అప్పట్లో భారీ విజయం అందుకోవడంతో, అతని కాల్షీట్ల కోసం మాఫియా గ్యాంగ్లు రాకేశ్ రోషన్పై ఒత్తిడి తెచ్చాయి. అతడు అంగీకరించకపోవడంతో హత్యాప్రయత్నం చేశాయి.
2. గుల్షన్ కుమార్ హత్యకు ప్రధాన కారణం ఏమిటి?
వ్యాపార పరమైన అసూయతో పాటు, మాఫియా చేసిన భారీ వసూళ్ల (Extortion) డిమాండ్లకు గుల్షన్ కుమార్ తలొగ్గకపోవడమే ఆయన హత్యకు దారితీసింది.
3. ఆర్జీవీ తీసిన అండర్ వరల్డ్ సినిమాలు ఏవి?
రామ్ గోపాల్ వర్మ తీసిన 'సత్య' (Satya), 'కంపెనీ' (Company), 'డి' (D) వంటి చిత్రాలు ముంబై మాఫియా వాస్తవ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కినవే.
4. 90వ దశకంలో బాలీవుడ్కు, మాఫియాకు సంబంధం ఏమిటి?
ఆ కాలంలో సినిమాలకు ఫైనాన్స్ చేయడం, నటీనటుల ఎంపికలో జోక్యం చేసుకోవడం వంటి పనుల ద్వారా అండర్ వరల్డ్ ఇండస్ట్రీని శాసించేది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


