రెహమాన్ చాలా మంచోడు.. గ్రేటెస్ట్ కంపోజర్: ఆస్కార్ గెలిచిన జయహో పాట అతడు కంపోజ్ చేయలేదన్న తన కామెంట్స్పై ఆర్జీవీ వివరణ
ఏఆర్ రెహమాన్పై ప్రశంసల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ. ఆస్కార్ గెలిచిన జయహో పాటను రెహమాన్ కంపోజ్ చేయలేదని గతంలో తాను చేసిన కామెంట్స్ కు అతడు వివరణ ఇచ్చాడు. అప్పట్లో తన కామెంట్స్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నాడు.
ఆస్కార్ గెలుచుకున్న ‘స్లమ్డాగ్ మిలియనీర్’ సినిమాలోని "జయహో" (Jai Ho) పాట చుట్టూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ పాటను స్వరపరిచింది ఏఆర్ రెహమాన్ కాదని, సింగర్ సుఖ్వీందర్ సింగ్ అని రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్జీవీ బుధవారం (జనవరి 21) నాడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆ పుకార్లకు చెక్ పెట్టాడు.

నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: ఆర్జీవీ
ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ చేసిన కామెంట్స్ విషయంలో అతనిపై దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో జయహో పాట గురించి చేసిన కామెంట్స్ ను కొందరు తెరపైకి తెచ్చారు. తాజాగా అతడు దీనిపై వివరణ ఇచ్చాడు.
"జయహో పాట విషయంలో నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. సందర్భం లేని విషయాలను వక్రీకరించి రాస్తున్నారు" అని వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. రెహమాన్తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. "నా ఉద్దేశంలో ఏఆర్ రెహమాన్ గొప్ప సంగీత దర్శకుడు, నేను కలిసిన అత్యంత మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు. మరొకరి క్రెడిట్ను తీసుకునే వ్యక్తి రెహమాన్ కాదు. ఈ నెగెటివ్ ప్రచారానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిస్తున్నా" అని ట్వీట్ చేశాడు.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
గతంలో ఆర్జీవీ ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అవ్వడమే ఈ వివాదానికి కారణం. ఆ వీడియోలో ఆర్జీవీ ఒక సంఘటనను వివరించాడు. సుభాష్ ఘాయ్ ‘యువరాజ్’ సినిమా కోసం రెహమాన్ పనిచేస్తున్న సమయం అది. రెహమాన్ ఆలస్యంగా రావడంతో, అక్కడ ఉన్న సుఖ్వీందర్ సింగ్ ఒక ట్యూన్ చేశారట.
రెహమాన్ వచ్చాక.. "నువ్వు కంపోజ్ చేశావా?" అని సుఖ్వీందర్ సింగ్ను అడిగి, ఆ ట్యూన్ బాగుందని సుభాష్ ఘాయ్కి వినిపించాడు. దీనికి సుభాష్ ఘాయ్ కోప్పడుతూ.. "నేను నీకు కోట్ల రూపాయలు ఇస్తోంది నువ్వు మ్యూజిక్ చేస్తావని.. సుఖ్వీందర్ చేసిన ట్యూన్ నాకు ఎందుకు?" అని రెహమాన్పై అరిచారట.
దానికి రెహమాన్.. "మీరు డబ్బు ఇస్తోంది నా పేరుకు, నా పనికి కాదు" అని బదులిచ్చారట. ఆ తర్వాత ఆ ట్యూన్నే ‘స్లమ్డాగ్ మిలియనీర్’ కోసం వాడారని, దానికి సుఖ్వీందర్కు కొంత డబ్బు పంపారని ఆ ఇంటర్వ్యూలో వర్మ చెప్పాడు.
అయితే ఈ మాటలను ఇప్పుడు నెటిజన్లు వైరల్ చేస్తూ.. రెహమాన్ ఆ పాట చేయలేదని ప్రచారం చేయడంతో వర్మ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 2009లో వచ్చిన ఈ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

E-Paper












