Dhurandhar 2 OTT: ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? లీగల్ కేసుతో బయటపడ్డ అసలు ప్లాన్.. మేకర్స్ ఏం చెెప్పారంటే?
Dhurandhar 2 OTT: బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన రణ్వీర్ సింగ్ సింగ్ మూవీ 'ధురంధర్ 2' ఓటీటీ రిలీజ్ పై బిగ్ అప్ డేట్. ఒక పాట వివాదంపై జరిగిన కోర్టు విచారణలో చిత్ర నిర్మాతలు స్ట్రీమింగ్ వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం.
Dhurandhar 2 OTT: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) విడుదలై ఏడు వారాలు గడుస్తున్నా, థియేటర్ల వద్ద ఇంకా దీని జోరు తగ్గలేదు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినీ హిస్టరీలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ స్పై థ్రిల్లర్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ధురంధర్ 2 ఓటీటీ
బాక్సాఫీస్ ను షేక్ చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసిన ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ పై ఓ క్లారిటీ వచ్చింది. సినిమాకు సంబంధించిన ఒక న్యాయ వివాదం కారణంగా స్ట్రీమింగ్ ప్లాన్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్స్టార్ దక్కించుకుంది.
పాట వివాదం
ధురంధర్ 2 క్లైమాక్స్లో ప్రసిద్ధ పాత పాట 'తిర్చి టోపీవాలే'ను రీమిక్స్ చేసి 'రంగ్ దే లాల్' పేరుతో ఉపయోగించారు. శాశ్వత్ సచ్దేవ్ ఈ పాటను స్వరపరిచాడు. అయితే, అసలు సాంగ్ ఉన్న 'త్రిదేవ్' సినిమా దర్శకుడు, నిర్మాత రాజీవ్ రాయ్ తన అనుమతి లేకుండా పాటను వాడుకున్నారంటూ ధురంధర్ 2 నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు గతంలో సూచించింది. అయితే బుధవారం (మే 6) జరిగిన విచారణలో, ఆ చర్చలు విఫలమైనట్లు కోర్టుకు సమాచారం అందింది.
ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
ఈ విచారణ సమయంలోనే ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ తేదీలపై స్పష్టత వచ్చింది. ఈ సినిమా ఆడియో హక్కులను కలిగి ఉన్న సూపర్ క్యాసెట్స్ (టీ-సిరీస్), పిటిషనర్ కోరిన మధ్యంతర రిలీఫ్ ను వ్యతిరేకించింది. ఇదే సమయంలో సినిమాను నిర్మించిన B62 ఫిల్మ్స్ కీలక విషయాలను కోర్టుకు వివరించింది. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని, మే నెల మధ్య వరకు ఓటీటీలో విడుదల చేసే అవకాశం లేదని వెల్లడించింది.
మే రెండో వారంలో
సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన 8 నుండి 10 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి. ధురంధర్ 2 సినిమా మే 14 నాటికి థియేటర్లలో ఎనిమిది వారాలను పూర్తి చేసుకుంటుంది. దీనిని బట్టి చూస్తే మే రెండో వారంలో లేదా నెలాఖరులోగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ఫామ్పై సందడి చేయనుంది. గతంలో 2025 డిసెంబర్లో వచ్చిన 'ధురంధర్' మొదటి భాగం 8 వారాల తర్వాత జనవరి 30న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. అయితే ఈ సీక్వెల్ మాత్రం ‘జియోహాట్స్టార్’లో స్ట్రీమింగ్ కానుంది.
రికార్డుల వేటలో 'ధురంధర్ 2'
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ 2 చిత్రాన్ని జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. కరాచీలో భారతీయ గూఢచారిగా రణ్వీర్ సింగ్ తన నటనతో మెప్పించాడు. ఈ ఫ్రాంచైజీలోని రెండు సినిమాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 3100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు.
భారతదేశంలో రూ. 1000 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఏకైక హిందీ చిత్రంగా ధురంధర్ 2 చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్లను కొల్లగొట్టిన ఈ మూవీ, భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఇన్ని రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: ధురంధర్ 2 ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుంది?
జవాబు: అధికారిక తేదీ వెల్లడించనప్పటికీ, మే నెల మధ్యలో (మే 14 తర్వాత) ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని కోర్టు విచారణ ద్వారా తెలిసింది.
ప్రశ్న: ధురంధర్ 2 ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది?
జవాబు: ఈ చిత్రం జియోహాట్స్టార్ (JioHotstar) ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానుంది.
ప్రశ్న: ధురంధర్ 2 సినిమాపై ఉన్న వివాదం ఏమిటి?
జవాబు: ఈ చిత్రంలోని 'రంగ్ దే లాల్' సాంగ్ కోసం పాత 'తిర్చి టోపీవాలే' పాటను అనుమతి లేకుండా వాడారంటూ నిర్మాత రాజీవ్ రాయ్ కోర్టులో కేసు వేశారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


