తెలుగు వాళ్లను అవమానించిన శివకార్తికేయన్, శ్రీలీల సినిమాకు తొలి రోజు దారుణమైన కలెక్షన్లు.. చెత్తగా ఉందంటూ రివ్యూలు

శివకార్తికేయన్ నటించిన పరాశక్తి మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లు దారుణంగా ఉన్నాయి. సినిమాకు కూడా పూర్తిగా నెగటివ్ రివ్యూలు వచ్చాయి. తెలుగు వాళ్లను అవమానించేలా ఇందులో కొన్ని సీన్లు ఉండటంపై వివాదం రేగిన విషయం తెలిసిందే.

Published on: Jan 11, 2026, 09:38:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చివరి నిమిషంలో సెన్సార్ క్లియరెన్స్, రకరకాల వివాదాల నడుమ ఎట్టకేలకు శనివారం (జనవరి 10) విడుదలైన శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద తొలి రోజు వసూళ్లు మాత్రం ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయాయి. తెలుగు వాళ్లను అవమానించారన్న విమర్శల నేపథ్యంలో ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చాయి.

తెలుగు వాళ్లను అవమానించిన శివకార్తికేయన్, శ్రీలీల సినిమాకు తొలి రోజు దారుణమైన కలెక్షన్లు.. చెత్తగా ఉందంటూ రివ్యూలు
తెలుగు వాళ్లను అవమానించిన శివకార్తికేయన్, శ్రీలీల సినిమాకు తొలి రోజు దారుణమైన కలెక్షన్లు.. చెత్తగా ఉందంటూ రివ్యూలు

ఓపెనింగ్స్ ఫర్వాలేదనిపించినా..

ప్రముఖ ట్రాకర్ ‘సాక్నిల్క్’ (Sacnilk) నివేదిక ప్రకారం.. ‘పరాశక్తి’ విడుదలైన మొదటి రోజు ఇండియాలో సుమారు రూ. 11.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. తమిళనాట 62.79% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ నంబర్స్ బాగానే ఉన్నా, శివకార్తికేయన్ గత చిత్రాలతో పోలిస్తే తక్కువేనని చెప్పాలి. పరాశక్తి సినిమాకు తొలి రోజే నెగటివ్ రివ్యూలు వచ్చాయి. ముఖ్యంగా సెకండాఫ్ దారుణంగా ఉందని, మరీ సాగదీశారని చాలా మంది సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చారు.

శివకార్తికేయన్ గ్రాఫ్ తగ్గిందా?

శివకార్తికేయన్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాస్ ఓపెనింగ్స్ సాధించాయి. వాటితో పోలిస్తే ‘పరాశక్తి’ వెనుకబడింది.

అమరన్ (2024): రూ. 24.7 కోట్లు (గురువారం రిలీజ్)

మదరాసి (2025): రూ. 13.65 కోట్లు (శుక్రవారం రిలీజ్)

పరాశక్తి: రూ. 11.50 కోట్లు

అంతేకాకుండా స్టార్ హీరోలైన విజయ్ ‘ది గోట్’ (రూ. 52 కోట్లు), కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ (రూ. 15.5 కోట్లు) ఓపెనింగ్స్‌ను కూడా పరాశక్తి దాటలేకపోయింది.

‘జననాయగన్’ లేకపోవడమే ప్లస్ పాయింట్

ఓపెనింగ్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఈ సినిమాకు ఒక గోల్డెన్ ఛాన్స్ ఉంది. విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ ఇబ్బందుల వల్ల వాయిదా పడింది. దీంతో సంక్రాంతి రేసులో ‘పరాశక్తి’కి పెద్దగా పోటీ లేకుండా పోయింది. సోలో రిలీజ్ కావడం, పండగ సెలవులు ఉండటం వల్ల ఈ సినిమా పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే నెగటివ్ రివ్యూల మధ్య సినిమా ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.

అసలేంటీ పరాశక్తి మూవీ?

1960ల నాటి మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ డ్రామాలో హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు అన్నదమ్ములు చేసే పోరాటాన్ని చూపించారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్, రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా విడుదలకు ముందే సెన్సార్ బోర్డు 25 కట్స్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ చిత్రాన్ని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ పంపిణీ చేసింది.

పరాశక్తిపై విమర్శలు, వివాదం

పరాశక్తి మూవీ రిలీజ్ కు ముందే తెలుగు వాళ్లను అవమానించారన్న విమర్శలతో వివాదంలో చిక్కుకుంది. లీక్ అయిన సెన్సార్ కట్స్ జాబితా ప్రకారం.. సినిమాలో ‘గొల్టీ’ (Golty) అనే పదాన్ని సెన్సార్ బోర్డు మ్యూట్ చేసింది. సాధారణంగా తమిళనాట కొంతమంది తెలుగువారిని కించపరచడానికి లేదా ఎగతాళి చేయడానికి ఈ పదాన్ని వాడుతుంటారు. ‘తెలుగు’ ఇంగ్లిష్ పదాన్ని తిరగేస్తే (gulute) ఈ పదం వచ్చిందని కొందరు, ఇది వెనుకబాటుతనాన్ని సూచించే బూతు పదం అని మరికొందరు చెబుతుంటారు.

ఈ విషయం బయటకు రాగానే ‘ఎక్స్’, రెడిట్ వేదికగా తెలుగు నెటిజన్లు భగ్గుమన్నారు. ముఖ్యంగా దర్శకురాలు సుధా కొంగర స్వతహాగా తెలుగు ఆడబిడ్డ అయ్యి ఉండి.. సొంత జాతిని కించపరిచే పదాన్ని తన సినిమాలో ఎలా పెట్టారంటూ నిలదీశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More