రజనీకాంత్ బ్లాక్బస్టర్ మూవీ నరసింహ సీక్వెల్ వచ్చేస్తోంది.. టైటిల్ కూడా చెప్పేసిన సూపర్ స్టార్..
రజనీకాంత్ కెరీర్లోని అతిపెద్ద హిట్స్ లో ఒకటి నరసింహ. 26 ఏళ్ల తర్వాత ఇప్పుడీ సినిమా సీక్వెల్ ప్లాన్స్ ఉన్నట్లు సూపర్ స్టార్ స్వయంగా వెల్లడించాడు. మూవీ టైటిల్ కూడా రివీల్ చేసిన అతడు.. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నట్లు చెప్పాడు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ నెల 12న తన పుట్టిన రోజు సందర్భంగా బ్లాక్బస్టర్ మూవీ నరసింహ రీరిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతున్నట్లు కన్ఫమ్ చేశాడు. అంతేకాదు ఈ సినిమాకు నీలాంబరి అనే టైటిల్ పెట్టినట్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు.
రజనీకాంత్ బ్లాక్బస్టర్ మూవీ నరసింహ సీక్వెల్ వచ్చేస్తోంది.. టైటిల్ కూడా చెప్పేసిన సూపర్ స్టార్..
నరసింహ సీక్వెల్ నీలాంబరి
రజనీకాంత్ డిసెంబర్ 12న 75 ఏళ్లు పూర్తి చేసుకొని 76వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఈ సూపర్ స్టార్ 26 ఏళ్ల కిందట నటించిన నరసింహ మూవీ రీరిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో అతడు నరసింహ (తమిళంలో పడియప్ప) మూవీకి సీక్వెల్ వస్తున్నట్లు కన్ఫమ్ చేశాడు.
“ఆడవాళ్లు కూడా గేట్లు బద్దలు కొట్టుకొని థియేటర్లలోకి దూసుకొచ్చిన సినిమా పడియప్ప. అలాంటి సినిమాకు సీక్వెల్ తీసుకురావాలని అనుకున్నాం. 2.0, జైలర్ 2 చేస్తున్నాం.. పడయప్ప 2 ఎందుకు వద్దు అనుకొని నీలాంబరి టైటిల్ తో తెస్తున్నాం. ఈ సినిమా స్టోరీ చర్చలు నడుస్తున్నాయి” అని రజనీకాంత్ ఆ స్పెషల్ వీడియోలో వెల్లడించాడు.
నరసింహ మూవీ గురించి..
రజనీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ లీడ్ రోల్స్ లో నటించిన నరసింహ మూవీ 1999లో రిలీజైంది. కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా రజనీ కెరీర్లోనే అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అందులో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర పేరు మీదే ఇప్పుడీ సీక్వెల్ రానుండటం విశేషం. ఈ పాత్ర ఆమె కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది.
ఓ తల పొగరు ఉన్న అమ్మాయి పాత్రలో తన నటనతో అదరగొట్టింది. రజనీకి పోటీగా ఆమె నటన ఉండగా.. ఓ అమాయక గ్రామీణ అమ్మాయి పాత్రలో సౌందర్య ఒదిగిపోయింది. అలాంటి సినిమాకు 26 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్ తీసుకురానుండటం ఎంతో ఆసక్తి రేపుతోంది. అయితే అంతకుముందు డిసెంబర్ 12న ఈ సినిమా థియేటర్లలో రీరిలీజ్ కాబోతుండటంతో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.