Prathyusha Case : 23 ఏళ్ల నాటి సినీ నటి ప్రత్యూష మృతి కేసు - సుప్రీంకోర్టు కీలక తీర్పు, నిందితుడు లొంగిపోవాలని ఆదేశాలు
సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్దార్థ రెడ్డి అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. గతంలో హైకోర్టు విధించిన శిక్షను సమర్థించింది.
రెండు దశాబ్ధాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.

ఈ కేసును విచారించిన హైకోర్టు అప్పట్లోనే జైలు శిక్షను ఖరారు చేసింది. కానీ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపు వాదనలు న్యాయస్థానం… నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని స్పష్టం చేసింది.
ముందుగా ఈ కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ఈ మేరకు 2004 ఫిబ్రవరి 23న తీర్పును ప్రకటించింది. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ సుదీర్ఘ వాదనలు కొనసాగగా… జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా… ఇన్ని ఏళ్ల తర్వాత ఇవాళ తుది తీర్పును అత్యున్నత న్యాయస్థానం వెలువరించింది.
23 ఏళ్ల నాటి కేసు…!
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 24న మృతి చెందారు. ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. 2002 ఫిబ్రవరి 23వ తేదీన ఇద్దరూ విషం తాగారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా… ప్రత్యూష 24వ తేదీన ప్రాణాలు కోల్పోయారు.
చికిత్స అనంతరం సిద్ధార్థరెడ్డి కోలుకున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. వీరిద్దరూ కూల్డ్రింక్లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. అయితే ప్రత్యుష్య మృతిపై అనేక వార్తలు వచ్చినప్పటికీ… అవన్నీ వాస్తవం కాదని తేలింది.
ప్రత్యూష ఆత్మహత్య చేసుకుని చనిపోలేదని… హత్య అని తల్లి సరోజినిదేవి వాదించారు. ప్రత్యూషను చనిపోయేలా చేశాడని చెప్పుకొచ్చారు. కోర్టుల్లో కూడా బలమైన వాదనలు వినిపించారు. ప్రత్యుష కేసులోని నిందితుడిని శిక్షించాలంటూ అప్పట్లో ప్రజాసంఘాలు కూడా ఆందోళన నిర్వహించాయి.
ఈ కేసులో సిటీ సివిల్ కోర్టు 2004లో సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఆ శిక్ష రెండేళ్లకు తగ్గింది. శిక్ష తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
శిక్షను పూర్తిగా కొట్టివేయాలంటూ సిద్ధార్థ రెడ్డి కూడా సుప్రీంకోర్టును కోరారు. కానీ నిందితుడి పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఐదేళ్ల శిక్షను రెండేండ్లకు తగ్గించేలా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోయి… శిక్షను అనుభవించాలని ఆదేశించింది.

E-Paper












