...
...
Next Story

K Bhagyaraj Death: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం- ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత- 75 సినిమాల్లో హీరోగా!

Actor Director K Bhagyaraj Dies At Age 73: దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్క్రీన్‌ప్లే మాంత్రికుడిగా పేరొందిన సీనియర్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం చెన్నైలో కన్నుమూశారు. ఆయన హఠాన్మరణం పట్ల సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా భాగ్యరాజ్ సినీ కెరీర్ వివరాలు చూద్దాం.

Updated on: Jun 27, 2026, 12:07:48 IST
Advertisement

Actor Director K Bhagyaraj Passed Away At Age 73: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన విలక్షణమైన కథలు, నవ్వులు పూయించే స్క్రీన్‌ప్లేతో ఎనభై, తొంభైల కాలంలో యావత్ ప్రేక్షకులను ఊపేసిన ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ శనివారం (జూన్ 27) కన్నుమూశారు.

73 ఏళ్ల వయసులో

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం- ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత- 75 సినిమాల్లో హీరోగా!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం- ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత- 75 సినిమాల్లో హీరోగా!

చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భాగ్యరాజ్ తుదిశ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలిచించక మరణించినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయన వయసు 73 సంవత్సరాలు.

"భాగ్యరాజ్ హఠాన్మరణాన్ని అపోలో ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి" అని జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. కె. భాగ్యరాజ్ మరణవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

కొద్దిరోజుల క్రితమే ఆయన గోవాలో జరిగిన నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై అందరితో ఎంతో ఉత్సాహంగా గడిపారు. అంతలోనే ఈ విషాద వార్త వినాల్సి రావడం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ను కూడా కలచివేస్తోంది. ఆయనకు భార్య పూర్ణిమ (సీనియర్ నటి), కుమారుడు శాంతను భాగ్యరాజ్ (నటుడు), కుమార్తె శరణ్య ఉన్నారు.

భారతీరాజా శిష్యుడిగా ప్రస్థానం

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కృష్ణస్వామి భాగ్యరాజ్‌గా జన్మించిన ఆయనకు చిన్నప్పటి నుంచే సినిమాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో లెజెండరీ దర్శకుడు భారతీరాజా వద్ద అసోసియేట్‌గా చేరి సినిమా నిర్మాణంలోని మెళకువలను నేర్చుకున్నారు.

మధ్యతరగతి కుటుంబాల కథలను, వారి జీవితాల్లోని సుఖదుఃఖాలను వెండితెరపై ఆవిష్కరించడంలో భాగ్యరాజ్ శైలి ప్రత్యేకం. అశ్లీలతకు తావులేకుండా కేవలం మాటల చాతుర్యంతో, సున్నితమైన హాస్యంతో ఆయన రాసుకునే స్క్రీన్‌ప్లేలు అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. అందుకే ఆయన్ను పరిశ్రమలో 'స్క్రీన్‌ప్లే మాంత్రికుడు' అని పిలుచుకుంటారు.

'అన్త ఏలు నాట్కల్', 'ముంధానై ముడిచ్చు', 'తూరల్ నిన్ను పోచ్చు', 'ఇంద్రు పోయ్ నాళై వా' వంటి చిత్రాలు తమిళ సినిమా చరిత్రలోనే మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఈ చిత్రాలలో చాలావరకు తెలుగులో రీమేక్ అయి ఇక్కడి స్టార్ హీరోలకు భారీ విజయాలను అందించాయి. తన సుదీర్ఘ కెరీర్‌లో భాగ్యరాజ్ 25 కంటే ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించగా, 75కి పైగా సినిమాల్లో హీరోగా, కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

బిగ్ బీ అమితాబ్‌ను డైరెక్ట్ చేసిన ప్రతిభ

భాగ్యరాజ్ ప్రతిభ కేవలం దక్షిణాదికే పరిమితం కాలేదు. బాలీవుడ్ షహన్‌షా అమితాబ్ బచ్చన్‌ను సైతం ఆయన డైరెక్ట్ చేశారు భాగ్యరాజ్. అమితాబ్ ద్విపాత్రాభినయంలో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా 'ఆఖ్రీ రాస్తా' (1986) చిత్రానికి భాగ్యరాజ్ దర్శకుడు. శ్రీదేవి, జయప్రద హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిందీలో భారీ వసూళ్లు సాధించింది.

ఆ తర్వాత అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన 'మిస్టర్ బేచారా', 'పాపా ది గ్రేట్' వంటి హిందీ చిత్రాలలోనూ ఆయన కీలక సహాయక పాత్రలు పోషించి ఉత్తర భారత ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

భాగ్యరాజ్ అంత్యక్రియలు

భాగ్యరాజ్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు కుటుంబ సభ్యుల నుంచి తెలియాల్సి ఉంది. ఆయన మృతితో చిత్రసీమ ఒక గొప్ప సృజనశీల నటుడిని, అద్భుతమైన కథకుడిని కోల్పోయింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe