...
...
Next Story

Virosh Reception : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రష్మిక మందన్న.. రిసెప్షన్‌కి రావాలని ఆహ్వానం!

rashmika mandanna vijay deverakonda wedding : టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఇటీవలే రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగింది. ఈ నెల 4వ తేదీన రిసెప్షెన్ జరగనుంది. ఈ వేడుకలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని రష్మిక మందన్న ఆహ్వానించింది.

Published on: Mar 1, 2026, 18:42:59 IST
Advertisement

విరోష్ వెడ్డింగ్ ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను రష్మిక మందన్న ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి కాసేపు ముచ్చటించారు.

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో రష్మిక మందన్న
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో రష్మిక మందన్న

రష్మిక మందన్నకు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి, కానుక ఇచ్చారు. ముఖ్యమంత్రి దంపతులు రష్మికను దీవించారు. విజయ్, రష్మిక రిసెప్షన్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు ఆహ్వానం అందాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని రష్మిక కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'సినీ నటుడు విజయ్ దేవరకొండతో ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన సినీ నటి రష్మిక కలిసి, తమ వివాహ రిసెప్షన్ కు ఆహ్వానించారు.' అని రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్

సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. దీంతో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నారు. ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని విరోష్ జంట కోరింది. అభిమానులు, శ్రేయోభిలాషులు క్షేమమే తమకు ముఖ్యమని తెలిపింది. మీరు ఎక్కడున్నా.. మీ దీవెనలు మాకు ఉంటాయని ఆశిస్తున్నట్టుగా పేర్కొంది.

జూబ్లీహిల్స్‌ టీటీడీ టెంపుల్‌కు విరోష్ జంట

ఈ కొత్త జంట జూబ్లీహిల్స్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నూతన జీవితం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. స్వామివారిని దర్శించుకున్నారు. విజయ్ దేవరకొండ సంప్రదాయబద్ధమైన కుర్తాలో కనిపించగా.. రష్మిక పట్టుచీరలో మెరిసిపోయారు. వీరితోపాటుగా ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు. దర్శనం తర్వాత ఆలయ అర్చకులు ఈ జంటకు వేదాశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో భక్తులు, అభిమానులకు మిఠాయిలు పంచారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe