...
...
Next Story

డెంగ్యూ జ్వరం: లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ సలహా ఇదీ

వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే జబ్బులు కూడా పెరుగుతాయి. వాటిలో డెంగ్యూ ఒకటి. ఈ డెంగ్యూ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ శరత్ చంద్ర భృంగి ఇక్కడ వివరించారు. ఈ వ్యాసం వారి మాటల్లో చదవండి.

Published on: Aug 20, 2026, 15:02:52 IST
Advertisement

ఈ కాలంలో జ్వరం వస్తే "మామూలు వైరల్ జ్వరమే కదా" అని చాలామంది తేలికగా తీసుకుంటారు. కానీ డెంగ్యూ కేసులు పెరుగుతున్న ఈ సమయంలో, ఎలాంటి జ్వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

డెంగ్యూ ఎలా వ్యాపిస్తుంది? ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తుంది?

డెంగ్యూ జ్వరం: లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ సలహా ఇదీ
డెంగ్యూ జ్వరం: లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ సలహా ఇదీ

'ఈడిస్' (Aedes) దోమ కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, మొదట్లో ఇది కూడా మామూలు వైరల్ జ్వరం లాగే అనిపిస్తుంది. ఒంటి నొప్పులు, తలనొప్పి, చలి, నీరసం, వికారం వంటి సాధారణ లక్షణాలే ఉంటాయి. ప్రత్యేకంగా డెంగ్యూ అని గుర్తుపట్టడం కష్టం.

అందుకే చాలామంది తగ్గిపోతుందిలే అని ఎదురుచూస్తుంటారు. కానీ మీ చుట్టుపక్కల డెంగ్యూ కేసులు ఉన్నప్పుడు... అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం రావడంతో పాటు ఒంటి నొప్పులు, తలనొప్పి, చలి, వాంతులు, ఒంటిపై దద్దుర్లు లేదా తీవ్రమైన అలసట కనిపిస్తే, ఆలస్యం చేయకుండా డాక్టర్‌కు చూపించుకోవడం మంచిది.

జ్వరం తగ్గగానే తగ్గిపోయింది అనుకోకండి

నేను నా పేషెంట్లకు ఎప్పుడూ చెప్పే మాట ఒకటి ఉంది. డెంగ్యూలో జ్వరం తగ్గడం అంటే జబ్బు నయమైందని కాదు.

నిజానికి, జ్వరం తగ్గినప్పుడే మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. జ్వరం తగ్గాక కనిపించే కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు (రెడ్ ఫ్లాగ్స్) ఇవే:

  • ఆగకుండా వాంతులు అవ్వడం
  • కడుపులో తీవ్రమైన నొప్పి
  • చిగుళ్లు, ముక్కు నుండి రక్తం కారడం లేదా చర్మంపై నల్లటి మచ్చలు (unusual bruising) రావడం
  • విపరీతమైన నీరసం లేదా ఎప్పుడూ నిద్రమత్తుగా ఉండడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • నీరసం అకస్మాత్తుగా పెరగడం

వర్షాకాలంలో జ్వరం రాగానే మెడికల్ షాపుకి వెళ్లి పెయిన్ కిల్లర్ లేదా జ్వరం టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుందని ఆశించడం అలవాటు. కానీ అన్ని జ్వరాలు ఒకటి కావు, డెంగ్యూ ఉన్నప్పుడు అన్ని మందులూ సేఫ్ కావు.

మీకు డెంగ్యూ ఉండే అవకాశం ఉందని అనుమానం వస్తే, జ్వరానికి లేదా నొప్పులకి ఎలాంటి మందులు వేసుకునే ముందైనా డాక్టర్‌ని అడగండి. కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ డెంగ్యూలో బ్లీడింగ్ (రక్తస్రావం) అయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి.

డెంగ్యూ వచ్చిన చాలామందికి విశ్రాంతి, ఎక్కువ ద్రవపదార్థాలు (fluids) తీసుకోవడం, ప్లేట్‌లెట్స్ పర్యవేక్షించడం సరిపోతుంది. కానీ పైన చెప్పిన ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే మాత్రం హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సి రావచ్చు.

నివారణ మీ ఇంటి నుంచే మొదలవుతుంది

డెంగ్యూ వస్తే మందులతో నయం చేయవచ్చు, కానీ దోమలను అరికడితే అసలు జబ్బే రాకుండా చూసుకోవచ్చు.

వారానికి ఒక 10 నిమిషాలు కేటాయించి మీ ఇల్లు ఒకసారి చెక్ చేసుకోండి:

  • వాటర్ కూలర్లు, పూల కుండీలు, బకెట్లు, ట్రేలలో ఉన్న నీటిని పారబోసి, వాటిని శుభ్రంగా కడగండి.
  • నీరు నిల్వ ఉంచే అన్ని రకాల పాత్రలపై మూతలు పెట్టండి.
  • పాత టైర్లు, బాటిళ్లు మరియు వర్షపు నీరు నిలిచే ఎలాంటి వస్తువులైనా సరే పారేయండి లేదా క్లియర్ చేయండి.
  • డ్రైనేజీలు, టెర్రస్ (మిద్దె)లను శుభ్రంగా ఉంచండి.

ఇందులో కాలనీలు, హౌసింగ్ సొసైటీల బాధ్యత కూడా ఉంది. కామన్ ఏరియాలు, కన్స్ట్రక్షన్ సైట్లు, డ్రైనేజీలు దోమల స్థావరాలుగా మారకుండా చూసుకోవాలి. ఫాగింగ్ చేయడం తాత్కాలికమే కానీ, నిలిచిన నీటిని తొలగించడమే దోమలను తగ్గించడానికి అసలైన మార్గం.

కాబట్టి డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి?

మీకు తగ్గకుండా తీవ్రమైన జ్వరం ఉండి, దాంతో పాటు ఒంటి నొప్పులు, వాంతులు, కడుపు నొప్పి, నీరసం లేదా ఎక్కడైనా బ్లీడింగ్ అవుతున్నట్లు అనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోండి. పరిస్థితి "ఇంకా ముదిరే దాకా" ఆగకండి.

వర్షాకాలంలో హైదరాబాద్‌లో వచ్చే జ్వరాలు వైరల్ కావచ్చు, బ్యాక్టీరియల్ కావచ్చు లేదా డెంగ్యూ కావచ్చు. వీటి లక్షణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి ముందే టెస్ట్ చేయించుకుని, త్వరగా ట్రీట్‌మెంట్ మొదలుపెట్టడమే సురక్షితమైన మార్గం.

చివరగా చెప్పేది ఒక్కటే: జ్వరాన్ని "మామూలు సీజనల్ జ్వరమే" అని లైట్ తీసుకోవద్దు. మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించండి, డేంజర్ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండండి, త్వరగా డాక్టర్‌ని సంప్రదించండి. ఇది మిమ్మల్ని డెంగ్యూ నుండి సురక్షితంగా బయటపడేలా చేస్తుంది.

వ్యాసకర్త:

- డాక్టర్ శరత్ చంద్ర భృంగి,

కన్సల్టెంట్ - ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్,

గ్లెనెగల్స్ అవేర్ హాస్పిటల్ (ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్),

ఎల్బీ నగర్, హైదరాబాద్.

డాక్టర్ శరత్ చంద్ర భృంగి
 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON