Healthy Sleep : 8 గంటలు నిద్రపోతున్నా అలసటగా ఉంటోందా…? నిపుణులు చెబుతున్న షాకింగ్ విషయాలు
Healthy Sleep Cycle Tips : శరీర ఆరోగ్యానికి కేవలం 8 గంటల నిద్ర సరిపోదని… ఏ సమయంలో నిద్రపోతున్నామనేది అత్యంత ముఖ్యమని స్లీప్ మెడిసిన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళల్లో ఆలస్యంగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
Healthy Sleep Cycle Tips : మానవ శరీరానికి, మనస్సుకు ఆహారం, నీరు ఎంత అవసరమో.. ప్రశాంతమైన నిద్ర కూడా అంతే ముఖ్యం. మనం నిద్రపోతున్న సమయంలోనే మన శరీరం అంతర్గతంగా దెబ్బతిన్న కణాలను మరమ్మత్తు (రిపేర్) చేసుకుంటుంది. అలాగే మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఈ కారణంగానే ప్రతి ఒక్కరూ రాత్రిపూట కనీసం 7 నుంచి 9 గంటలు, సగటున 8 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. అయితే, ఏ సమయంలోనైనా సరే 8 గంటలు నిద్రపోతే సరిపోతుందా…? అంటే.. అస్సలు సరిపోదని అంటున్నారు స్లీప్ మెడిసిన్ వైద్యుడు అబినాష్ జోషి. ఈ విషయమై ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పలు విషయాలను పంచుకున్నారు.

వైద్యుల నివేదిక ప్రకారం, మన శరీరానికి ఒక అంతర్గత గడియారం ఉంటుంది. దీనినే 'సిర్కాడియన్ లయ' (Circadian Rhythm) అంటారు. సాధారణంగా మన శరీరం రాత్రి 11:00 గంటల నుంచి ఉదయం 07:00 గంటల మధ్య నిద్రపోవాలని ఆశిస్తుంది. ఒకవేళ ఈ సమయాన్ని కాదని అర్ధరాత్రి దాటాక ఆలస్యంగా నిద్రపోయి, ఉదయం ఎప్పుడో లేచి 8 గంటల కోటాను పూర్తి చేసినా శరీరానికి నష్టం తప్పదు. ఎందుకంటే బాడీ క్లాక్ మీ నిద్ర గంటలను కాదు.. మీరు ఏ సమయానికి నిద్రపోతున్నారనే అంశాన్ని మాత్రమే లెక్కిస్తుంది. ఈ లయ తప్పితే శరీరంలోని హార్మోన్లు, ఉష్ణోగ్రత, కణాల మరమ్మత్తు ప్రక్రియలన్నీ పూర్తిగా స్తంభించిపోతాయి.
ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు:
- గుండె జబ్బుల ముప్పు : నిరంతరం రాత్రి వేళల్లో ఆలస్యంగా పడుకోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది మరియు అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది.
- మధుమేహం (డయాబెటిస్) : శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వం క్రమంగా తగ్గిపోతుంది. ఇది కొన్నిసార్లు నేరుగా ప్రీడయాబెటిక్ స్థాయిలకు దారితీస్తుంది.
- జన్యువులపై ప్రభావం : సిర్కాడియన్ లయ తప్పడం వల్ల మన శరీరంలోని సాధారణ లయబద్ధమైన జన్యువులలో 97 శాతం కంటే ఎక్కువ అంతరాయం కలుగుతుంది.
- మానసిక సమస్యలు : నిద్రపోయే సమయం మారడం వల్ల తీవ్రమైన నిరాశ, ఆందోళన వంటి మానసిక రుగ్మతలు చుట్టుముడతాయి.
- నిద్ర సమయాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి చిట్కాలు:
ఆరోగ్యకరమైన బాడీ క్లాక్ను తిరిగి సొంతం చేసుకోవడానికి వైద్యులు పలు సూచనలు ఉదయం నిద్ర లేచిన 1-2 గంటల్లోపు కనీసం 30 నిమిషాల పాటు ఎండలో గడపాలి. నిద్ర సమయాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి ఇది అత్యంత శక్తివంతమైన మార్గం.
- మీరు పడుకోవాలని అనుకునే సమయానికి 2-3 గంటల ముందే గదిలోని లైట్ల వెలుతురును తగ్గించుకోవాలి (డిమ్ చేయాలి).
- వైద్యుల సలహా మేరకు చిన్న మొత్తంలో మెలటోనిన్ తీసుకోవాలనుకుంటే.. దానిని నిద్రపోయే ముందు కాకుండా, మీ ప్రస్తుత నిద్రవేళకు 1.5 నుండి 6 గంటల ముందే తీసుకోవాలి.
- ఉదయం నిద్ర లేవడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకుని, దానిని వారాంతాల్లో (వీకెండ్స్) కూడా ఖచ్చితంగా పాటించాలి.
- మీకు రాత్రిపూట అంత త్వరగా నిద్రపట్టకపోతే.. పడుకునే ముందు ఒక మంచి పుస్తకం చదవడం లేదా మెలోడీ (తేలికపాటి) సంగీతం వినడం ద్వారా మెదడు ప్రశాంతపడి త్వరగా నిద్ర పడుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

