గబగబా తినేస్తున్నారా? జాగ్రత్త! బరువు పెరగకుండా ఉండేందుకు డాక్టర్లు చెబుతున్న 2 సింపుల్ టిప్స్ ఇవే
మీరు భోజనాన్ని గబగబా ముగించేస్తున్నారా? ఈ అలవాటు మిమ్మల్ని ఊబకాయం బారిన పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిండి వేగాన్ని తగ్గించి, బరువు అదుపులో ఉంచుకోవడానికి ఫోర్టిస్ హాస్పిటల్ సర్జన్ సూచిస్తున్న రెండు ప్రభావవంతమైన మార్గాలు మీ కోసం.
ఉదయం ఆఫీసుకి వెళ్లే తొందరలోనో, పని ఒత్తిడిలోనో లేదా బాగా ఆకలి వేసినప్పుడో.. చాలామంది భోజనాన్ని గబగబా కానిచ్చేస్తుంటారు. కొందరైతే ఆహారం చాలా రుచిగా ఉందని ప్లేట్ను నిమిషాల్లో ఖాళీ చేస్తారు. అయితే, ఇలా వేగంగా తినడం వల్ల శరీర బరువు గణనీయంగా పెరుగుతుందని మీకు తెలుసా?

చాలామంది బరువు పెరగడానికి కేవలం మనం తినే ఆహార రకం (జంక్ ఫుడ్) లేదా పరిమాణం మాత్రమే కారణమని అనుకుంటారు. కానీ, మనం ఎంత వేగంగా తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ముంబైలోని ఫోర్టిస్ హాస్పిటల్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ హృషికేష్ సల్గాంకర్ దీని వెనుక ఉన్న సైన్స్ను వివరించారు.
వేగంగా తింటే శరీరంలో ఏం జరుగుతుంది?
మనం తిన్న తర్వాత కడుపు నిండిందనే సంకేతం మెదడుకు అందడానికి కొంత సమయం పడుతుంది. దీనిని 'గట్-బ్రెయిన్ యాక్సిస్' (Gut-brain axis) అంటారు. "మన జీర్ణవ్యవస్థకు, మెదడుకు మధ్య ఉన్న ఈ అనుసంధానం కాస్త ఆలస్యంగా పనిచేస్తుంది. కడుపు నిండినప్పుడు విడుదలయ్యే పి.వై.వై (PYY), సి.సి.కె (CCK) వంటి హార్మోన్లు మెదడులోని హైపోథాలమస్కు చేరడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుంది" అని డాక్టర్ సల్గాంకర్ వివరించారు.
అంటే, మీరు భోజనాన్ని పది నిమిషాల్లోనే ముగించేస్తే, కడుపు నిండిన సిగ్నల్ మెదడుకు అందేలోపే మీరు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని తినేస్తారన్నమాట.
ప్రోసెసింగ్ పారడాక్స్: బరువు పెరగడానికి అసలు కారణం
మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం కానీ, సౌకర్యం కోసం లేదా రుచి కోసం అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్పై ఆధారపడతాం. ఈ ఆహార పదార్థాలు మెత్తగా ఉండి, నమలడానికి సులువుగా ఉంటాయి. ఫలితంగా మనం వాటిని అతి వేగంగా తినేస్తాం. ఇలా వేగంగా తినడం వల్ల రక్తంలో చక్కెర (Blood Sugar), ఇన్సులిన్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. సహజమైన ఆహార పదార్థాలతో పోలిస్తే, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ద్వారా మూడు రెట్లు వేగంగా క్యాలరీలు మన శరీరంలోకి చేరతాయని డాక్టర్ పేర్కొన్నారు.
తినే వేగాన్ని తగ్గించడానికి 2 సులభమైన చిట్కాలు
బరువు తగ్గాలనుకునే వారు లేదా ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఈ రెండు చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందని డాక్టర్ సల్గాంకర్ సూచిస్తున్నారు.
- 30 సెకన్ల విరామం: భోజనం మొదలుపెట్టే ముందు కనీసం ఒక 30 సెకన్ల పాటు ఆ ఆహారాన్ని చూడండి, దాని వాసనను ఆస్వాదించండి. ఇది వినడానికి వింతగా ఉన్నా, ఇలా చేయడం వల్ల మీ నాడీ వ్యవస్థ అప్రమత్తమవుతుంది. మీరు మొదటి ముద్ద తినకముందే ఆహారాన్ని అరిగించే ఎంజైమ్లు విడుదలయ్యేలా శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
- 30 సార్లు నమలండి: వేగంగా తినే అలవాటు ఉన్నవారు ఆహారాన్ని సరిగ్గా నమలరు. అందుకే ప్రతి ముద్దను కనీసం 30 సార్లు నమలాలని నిపుణులు చెబుతున్నారు. ఒక ముద్ద నోట్లో వేసుకున్న తర్వాత, స్పూన్ లేదా చేతిని ప్లేట్లో ఉంచేయండి. బాగా నమిలి మింగిన తర్వాతే తదుపరి ముద్ద తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ కడుపులోని స్ట్రెచ్ రిసెప్టర్లు (Stretch receptors) సకాలంలో మెదడుకు సంకేతాలు పంపగలుగుతాయి.
(గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యపరమైన సమస్యలు లేదా సందేహాలు ఉంటే వెంటనే మీ డాక్టరును సంప్రదించడం ఉత్తమం.)
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper












