...
...
Next Story

కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెరగనున్న డీఏ, ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ లెక్కలివే

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు త్వరలోనే కరువు భత్యం (డీఏ) పెరగనుంది. లేబర్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన జూలై 2026 వినియోగదారుల ధరల సూచీ (AICPI-IW) గణాంకాలు పెరగడంతో రాబోయే దీపావళి నాటికి డీఏ 3 నుంచి 4 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Published on: Sep 5, 2026, 16:53:59 IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న కరువు భత్యం (డీఏ) పెంపుపై కీలక సంకేతాలు వెలువడ్డాయి. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ బ్యూరో జూలై 2026 నెలకు సంబంధించిన 'ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్' (AICPI-IW) గణాంకాలను విడుదల చేసింది. ఈ సూచీ పాయింట్లు పెరగడంతో ఉద్యోగుల వేతనాలు, పింఛనుదారుల పింఛనులో త్వరలోనే పెరుగుదల నమోదు కానుంది.

ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ సూచీ అంటే ఏమిటి?

కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెరగనున్న డీఏ, ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ లెక్కలివే
కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెరగనున్న డీఏ, ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ లెక్కలివే

పారిశ్రామిక కార్మికులు, ఉద్యోగులు రోజువారీ జీవితంలో వాడే వస్తువులు, సేవల రీటైల్ ధరల్లో వచ్చే మార్పులను అంచనా వేసేందుకు కేంద్ర కార్మిక శాఖ ప్రతి నెలా ఈ ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ సూచీని లెక్కిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 88 ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల్లోని 317 మార్కెట్ల నుంచి సేకరించిన రీటైల్ ధరల ఆధారంగా ఈ గణాంకాలను రూపొందిస్తారు.

ఈ ఏడాది మార్చిలో 149.1గా ఉన్న ఈ సూచీ, ఏప్రిల్‌లో 149.9, మే నెలలో 150.8, జూన్‌లో 151.9కి చేరింది. కాగా జూలై 2026 నాటికి మరో 1.3 పాయింట్లు పెరిగి 153.2 వద్ద ముగిసింది. గతేడాది జూలైలో 2.66 శాతంగా ఉన్న వార్షిక ద్రవ్యోల్బణం, ఈ జూలై నాటికి 4.57 శాతానికి పెరిగినట్లు కార్మిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

డీఏ పెంపును ఎలా లెక్కిస్తారు?

ఏడో వేతన సంఘం (7th Pay Commission) నిబంధనల ప్రకారం.. గత 12 నెలల ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ సగటు ఆధారంగా డీఏ, డీఆర్‌లను లెక్కిస్తారు. దీనికోసం ప్రత్యేక ఫార్ములాను ఉపయోగిస్తారు:

డీఏ శాతం = [(గత 12 నెలల ఏఐసీపీఐ సగటు – 261.42) / 261.42] x 100

ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, సేకరించిన సూచీ ఆధారంగా ఈసారి డీఏ 3 శాతం నుంచి 4 శాతం వరకు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే దీపావళి పండుగ సందర్భంగా కేంద్ర కేబినెట్ దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనుంది.

మూలవేతనంలో డీఏ విలీనంపై డిమాండ్లు

మరొకవైపు, డీఏను మూలవేతనం (Basic Pay)లో విలీనం చేయాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్రమవుతోంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డీఏ 50 శాతం దాటితే దానిని మూలవేతనంలో విలీనం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డీఏ 60 శాతానికి చేరుకోగా, తదుపరి పెంపుతో ఇది మరింత పెరగనుంది. మూలవేతనం పెరిగితే పీఎఫ్, గ్రాట్యుటీ, పింఛను వంటి ఇతర ప్రయోజనాలు కూడా స్వయంచాలకంగా పెరుగుతాయి.

ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉందని, ఎనిమిదో వేతన సంఘం లేదా ప్రభుత్వం కొత్త వేతన నిర్మాణంపై స్పష్టత ఇచ్చే వరకు ప్రస్తుత విధానమే కొనసాగుతుందని కేంద్రం తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe