8th Pay Commission : 8వ వేతన సంఘం వెబ్‌సైట్- జీతం, పెన్షన్ పెంపుపై ఉద్యోగులే సూచనలు ఇవ్వొచ్చు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్​ న్యూస్​! 8వ వేతన సంఘం అధికారిక వెబ్‌సైట్ ప్రారంభమైంది. కొత్త జీతాల సవరణ, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్ నిబంధనలపై మీ అభిప్రాయాలను నేరుగా పంపేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 10, 2026 10:01 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ప్రక్రియ ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. తాజాగా ఈ కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్ 8cpc.gov.in ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వం నేరుగా స్టేక్‌హోల్డర్లు, ఉద్యోగుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తోంది.

8వ వేతన సంఘం వెబ్​సైట్​ వివరాలు..
8వ వేతన సంఘం వెబ్​సైట్​ వివరాలు..

నవంబర్ 3, 2025న ఆర్థిక శాఖ ఈ 8వ వేతన సంఘాన్ని అధికారికంగా నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రక్రియలో భాగంగా సాధారణ ఉద్యోగులు సైతం జీతాలు, పెన్షన్లపై తమ అభిప్రాయాలను వినిపించేందుకు అవకాశం లభించడం విశేషం.

ఎవరు సూచనలు ఇవ్వవచ్చు?

ఈ సర్వేను కేంద్ర ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంచింది. కింది జాబితాలో ఉన్నవారు తమ అభిప్రాయాలను సమర్పించవచ్చు:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీ) సిబ్బంది.

పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు.

న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది.

రెగ్యులేటరీ బాడీల సభ్యులు.

పరిశోధకులు, విద్యావేత్తలు, ఆసక్తి కలిగిన వ్యక్తులు.

18 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి..

8వ వేతన సంఘం మెరుగైన సిఫార్సులు చేసేందుకు వీలుగా MyGov పోర్టల్‌లో మొత్తం 18 ప్రశ్నలతో కూడిన ఒక ఫారమ్‌ను అందుబాటులో ఉంచింది. ఇందులో ప్రధానంగా:

ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి దృష్ట్యా వేతన సవరణ ఎలా ఉండాలి?

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటే బాగుంటుంది?

వార్షిక ఇంక్రిమెంట్లు, అలవెన్సుల పద్ధతిలో ఏవైనా మార్పులు అవసరమా?

ఉన్నత స్థాయి అధికారుల జీతాల నిర్ణయంలో పాటించాల్సిన ప్రమాణాలు ఏంటి? వంటి కీలక అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

సమాధానం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ప్రభుత్వం భరోసా ఇవ్వడం మరో విశేషం.

8వ వేతనం సంఘం- సూచనలు పంపడం ఎలా?

స్టెప్​ 1- ముందుగా MyGov ప్రశ్నావళి లింక్​ని (https://www.mygov.in/mygov-survey/8th-central-pay-commission-questionnaire/) సందర్శించండి.

స్టెప్​ 2- మీ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వండి.

స్టెప్​ 3- 6 అంకెలు గల ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.

స్టెప్​ 4- అడిగిన 18 ప్రశ్నలకు మీ అభిప్రాయాలను నమోదు చేసి సబ్మిట్ చేయండి.

మీరు మీ అభిప్రాయాలను మార్చ్​ 16, 2026 లోపు సమర్పించాలి.

గమనిక: కేవలం MyGov పోర్టల్ ద్వారా పంపిన ఆన్‌లైన్ దరఖాస్తులను మాత్రమే కమిషన్ స్వీకరిస్తుంది. ఈమెయిల్స్, పీడీఎఫ్ ఫైళ్లు లేదా ఫిజికల్ లెటర్లను పరిగణనలోకి తీసుకోరు.

8వ వేతన సంఘం- ఎప్పటి నుంచి అమలు?

8వ వేతన సంఘం తన నివేదికను సమర్పించడానికి 18 నెలల గడువు ఉంది. అయితే, వేతన సవరణ, బకాయిలు మాత్రం జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే సుమారు 45 లక్షల మంది ఉద్యోగులకు, 68 లక్షల మంది పెన్షనర్లకు భారీ ప్రయోజనం కలగనుంది.