...
...
Next Story

మహిళ వేషంలో తప్పించుకున్న ఒసామా బిన్​ లాడెన్​! వెలుగులోకి సంచలన విషయాలు..

కరుడుగట్టిన ఉగ్రవాది, అల్​ ఖైద్​ ఫౌండర్​ ఒసామా బిన్ లాడెన్ గురించి సీఐఏ మాజీ ఆఫీసర్​ సంచలన విషయాలను వెల్లడించారు. మహిళ వేషంలో తోరా బోరా కొండల నుంచి బిన్​ లాడెన్​ తప్పించుకున్నాడని వివరించారు.

Published on: Oct 25, 2025, 10:45:11 IST
Advertisement

అల్​ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్.. 9/11 ఉగ్రదాడుల తర్వాత అమెరికాకు అత్యంత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బిన్ లాడెన్ ఒకానొక సమయంలో, మహిళ వేషధారణలో అఫ్గానిస్థాన్‌లోని తోరా బోరా కొండల నుంచి తప్పించుకున్నాడని సీఐఏ మాజీ అధికారి జాన్ కిరియాకౌ సంచలన విషయాన్ని వెల్లడించారు.

ఒసామా బిన్​ లాడెన్​..
ఒసామా బిన్​ లాడెన్​..

సీఐఏలో 15ఏళ్లు పనిచేశారు కిరియాకౌ. పాకిస్థాన్‌లో సీఐఏ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ విభాగానికి చీఫ్‌గా కూడా వ్యవహరించారు. ఏఎన్​ఐకు తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు.

సీఐఏలోకి అల్​ ఖైదా చొరబాటు..

ఆ సమయంలో వాళ్లకి కూడా తెలియని మరో ముఖ్య విషయం గురించి కిరియాకౌ మాట్లాడుతూ.. "సెంట్రల్ కమాండ్ కమాండర్‌కు ట్రాన్స్‌లేటర్‌గా (అనువాదకుడిగా) ఉన్న వ్యక్తి, నిజానికి అమెరికా సైన్యంలోకి చొరబడిన అల్-ఖైదా ఆపరేటివ్ అని మాకు తెలియదు," అని అన్నారు.

9/11 దాడుల తర్వాత పరిస్థితిని ఆయన ఇలా వివరించారు..

"మొదట, ఆ సమయంలో అమెరికా దూకుడుగా కాకుండా ప్రతిస్పందించే ధోరణిలో ఉంది. మేము ఆఫ్గానిస్థాన్‌పై బాంబు దాడి మొదలు పెట్టడానికి నెల రోజులకు పైగా వేచి చూశాము. ఉద్వేగానికి లోనుకాకుండా, ఆచితూచి వ్యవహరించాలని చూశాం. ఆ ప్రాంతంలో తగినంత సైన్యాన్ని మోహరించే వరకు ఒక నెల వేచి ఉండి, ఆ తర్వాత అల్​ ఖైదా స్థావరాలపై దాడులు ప్రారంభించాము. ఎక్కువగా దక్షిణ, తూర్పు ఆఫ్గానిస్థాన్‌లోని పష్తో ప్రాంతాల్లో దాడులు జరిగాయి."

బిన్ లాడెన్ ఎలా తప్పించుకున్నాడంటే..

2001 అక్టోబర్‌లో ఒసామా బిన్ లాడెన్, అల్​ ఖైదా నాయకత్వాన్ని తోరా బోరా కొండల్లో దాదాపు పట్టుకున్ననట్టు తాము విశ్వసించినట్లు కిరియాకౌ తెలిపారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలను ఆయన ఇలా వివరించారు:

"అల్​ ఖైదా ఆపరేటివ్ అయిన ఆ ట్రాన్స్‌లేటర్, జనరల్ ఫ్రాంక్స్‌ను ఒప్పించి, దీనికి ఆమోదం తీసుకున్నాడు. కానీ చివరికి ఏం జరిగిందంటే.. బిన్ లాడెన్ మహిళ వేషం ధరించి, చీకటిలో పికప్ ట్రక్ వెనుక భాగంలో పాకిస్థాన్‌లోకి తప్పించుకున్నాడు," అని కిరియాకౌ సంచలన విషయాన్ని వెల్లడించారు.

సూర్యోదయం అయ్యేసరికి, తోరా బోరాలో లొంగిపోవడానికి ఒక్కరు కూడా మిగిలిలేరని, వారంతా పారిపోయారని ఆయన చెప్పారు. "అందుకే మేము పోరాటాన్ని నేరుగా పాకిస్థాన్‌కు మార్చాల్సి వచ్చింది," అని కిరియాకౌ వివరించారు.

చివరికి అమెరికా, 2011 మే నెలలో ఉత్తర పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌ నగరంలో ఒసామా బిన్ లాడెన్‌ను గుర్తించింది. మే 2న అమెరికా స్పెషల్ ఫోర్సెస్ జరిపిన మెరుపు దాడిలో బిన్ లాడెన్ హతమయ్యాడు.

పాకిస్థాన్-అమెరికా బంధం, ముషారఫ్ పాత్ర..

ఆనాటి పాకిస్థాన్ అధ్యక్షుడు ప‌ర్వేజ్ ముషారఫ్‌తో అమెరికా సంబంధాల గురించి కిరియాకౌ ప్రస్తావించారు. "మేము ముషారఫ్‌ను కొనుగోలు చేశామనే చెప్పాలి. మేము ఏది చేయాలనుకుంటే అది చేయడానికి ఆయన అంగీకరించేవారు," అని ఆయన అన్నారు.

"మా సంబంధాలు పాకిస్థాన్ ప్రభుత్వంతో చాలా బాగుండేవి. అప్పుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఉన్నారు. నిజం చెప్పాలంటే, అమెరికా నియంతలతో పనిచేయడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే అప్పుడు ప్రజల అభిప్రాయం గురించి, మీడియా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు."

"ముషారఫ్‌కు మిలియన్ల కొద్దీ డాలర్లలో సైనిక, ఆర్థిక సాయం ఇచ్చి, ఆయన్ని కొనుగోలు చేశాము. మేము ముషారఫ్‌ను తరచుగా, వారానికి చాలాసార్లు కలిసేవాళ్లం. ముఖ్యంగా, మేము ఏది చేయాలనుకున్నా ఆయన అనుమతించేవారు. అయితే, ముషారఫ్‌కు కూడా తన సైన్యాన్ని, తన దేశంలోని తీవ్రవాదులను సంతృప్తి పరచాల్సిన అవసరం ఉండేది," అని వివరించారు.

"పాక్ సైన్యానికి అల్​ ఖైదా గురించి పట్టదు, వారికి భారతదేశం గురించే ఆందోళన. అందుకే సైన్యాన్ని, కొంతమంది మత ఛాందసులను సంతోషంగా ఉంచడానికి, ముషారఫ్ వారికి ద్వంద్వ జీవితాన్ని కొనసాగించడానికి అనుమతి ఇచ్చారు. అంటే, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అమెరికన్లకు సహకరిస్తున్నట్లు నటిస్తూనే, భారతదేశంపై ఉగ్రవాద చర్యలను కొనసాగించడానికి అనుమతించారు," అని అన్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe