కస్టమర్స్​కి షాక్​ ఇచ్చిన ఏథర్​! ఎలక్ట్రిక్​ స్కూటర్ల ధరల పెంపు- ఎంతంటే..

పెరిగిన ముడిసరుకు ఖర్చులు, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2026 నుంచి తన అన్ని మోడళ్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Published on: Dec 23, 2025, 06:16:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థ ఏథర్ ఎనర్జీ షాక్​ ఇచ్చింది. తన ఈ-స్కూటర్ల శ్రేణిపై రూ. 3,000 వరకు ధరలను పెంచుతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ పెంచిన ధరలు 2026, జనవరి 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి.

ఏథర్​ ఎనర్జీ స్కూటర్ల ధరల పెంపు..
ఏథర్​ ఎనర్జీ స్కూటర్ల ధరల పెంపు..

ధరల పెంపునకు కారణాలివే..

ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడం, అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్ విడిభాగాల లభ్యత భారంగా మారడం వల్లే ఈ ఏథర్​ రిజ్టా సహా పోర్ట్​ఫోలియోలోని అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లపై ధరల పెంపు నిర్ణయం​ తీసుకోవాల్సి వచ్చిందని ఏథర్ ఎనర్జీ స్పష్టం చేసింది.

దీనికి తోడు విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ నిరంతరం పడిపోవడం కూడా కంపెనీపై అదనపు భారాన్ని మోపింది.

ముఖ్యంగా 2025 డిసెంబర్ మధ్య నాటికి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా 91.01కి పడిపోయింది. ఈ ఏడాది ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీగా రూపాయి నిలిచింది. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంలో జాప్యం, భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం టారిఫ్ విధించడం వంటి పరిణామాలు రూపాయిని సుమారు 6 శాతం మేర దెబ్బతీశాయి.

ఈ ఆర్థిక ఒడిదుడుకుల ప్రభావం ఇప్పుడు వాహన తయారీ రంగంపై పడుతోంది.

ఏ మోడల్ ధర ఎంత ఉండొచ్చు?

ప్రస్తుతం మార్కెట్లో ఏథర్ అందిస్తున్న మోడళ్ల ధరలు ఎలా మారబోతున్నాయో ఒక అంచనా ఇక్కడ ఉంది:

ఏథర్ రిజ్టా ఎస్​: ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ. 1,04,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. తాజా పెంపుతో దీని ధర సుమారు రూ. 1,07,999కి చేరవచ్చు.

ఏథర్ 450 అపెక్స్: కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన దీని ధర ప్రస్తుతం రూ. 1,89,999 పలుకుతోంది. జనవరి నుంచి ఇది రూ. 1,92,999 వరకు పెరిగే అవకాశం ఉంది.

వేరియంట్, మోడల్‌ను బట్టి ఈ ధరల పెరుగుదలలో స్వల్ప మార్పులు ఉండవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఇప్పుడే కొంటే ప్రయోజనం!

మీరు ఏథర్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, 2025 డిసెంబర్ నెల మీకు సరైన సమయం! పాత ధరలకే స్కూటర్ పొందేందుకు చివరి అవకాశం ఇదే. దీనికి తోడు ఏథర్ ప్రస్తుతం 'ఎలక్ట్రిక్ డిసెంబర్' పేరిట ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఎంపిక చేసిన నగరాల్లో వినియోగదారులు రూ. 20,000 వరకు ప్రయోజనాలను పొందే వీలుంది.

స్టాక్ మార్కెట్‌లో దూకుడు..

మరోవైపు, వ్యాపార పరంగా ఏథర్ ఎనర్జీ దూసుకుపోతోంది. మే 2025లో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ, కేవలం ఏడు నెలల్లోనే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది! ఇష్యూ ధరతో పోలిస్తే షేర్ విలువ దాదాపు 118 శాతం మేర పెరగడం గమనార్హం. ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌పై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

ఏథర్​ రిజ్టా హవా..

తమ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘రిజ్టా’ అమ్మకాల్లో ఒక పెద్ద మైలురాయిని చేరుకున్నట్లు ఇటీవలే ఒక ప్రకటన చేసింది ఏథర్ ఎనర్జీ సంస్థ. ఈ స్కూటర్ అమ్మకాలు ఇప్పుడు ఏకంగా రెండు లక్షల యూనిట్ల మార్క్‌ను దాటాయి! మే 2025లో మొదటి లక్ష అమ్మకాలను చేరుకున్నప్పటి నుంచి మరో లక్ష సేల్స్ మార్క్​ని టచ్​ చేయడానికి కేవలం ఆరు నెలలే పట్టడం విశేషం​. ఇది దేశవ్యాప్తంగా రిజ్టాకు పెరిగిన ఆదరణను సూచిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More