ChatGPT : ఏఐతో అద్భుతం! పెంపుడు కుక్క కోసం చాట్​జీపీటీ ద్వారా క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీ..

ప్రాణాంతక క్యాన్సర్‌తో బాధపడుతున్న తన కుక్క రోజీ కోసం చాట్​జీపీటీ సాయంతో పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ రూపొందించారు ఆస్ట్రేలియాకు చెందిన పాల్ కన్నింగ్‌హామ్. కేవలం కొన్ని నెలలే బతుకుతుందని డాక్టర్లు చెప్పిన ఆ కుక్క, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వల్ల కోలుకుని ఉత్సాహంగా పరిగెడుతోంది.

Published on: Mar 16, 2026 10:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా వైద్యులు చేతులెత్తేస్తే ఇక విధిని నమ్ముకోవడం తప్ప వేరే మార్గం లేదని అందరూ భావిస్తుంటారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ టెక్ వ్యవస్థాపకుడు మాత్రం తన ప్రాణం కన్నా ఎక్కువైన తన పెంపుడు కుక్క విషయంలో అలా అనుకోలేదు. కృత్రిమ మేధ (ఏఐ), ChatGPT సహాయంతో క్యాన్సర్ వ్యాక్సిన్‌నే సొంతంగా అభివృద్ధి చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు.

రోజీతో పాల్ కన్నింగ్‌హామ్..
రోజీతో పాల్ కన్నింగ్‌హామ్..

మృత్యువుకు చేరువలో రోజీ..

పాల్ కన్నింగ్‌హామ్ పెంచుకుంటున్న ఎనిమిదేళ్ల 'రోజీ' (స్టాఫీ-షార్ పీ క్రాస్ జాతి కుక్క) కి 'మాస్ట్ సెల్ క్యాన్సర్' సోకింది. రోజీ వెనుక కాలుపై పెద్ద కణితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని సమీక్షించిన వైద్యులు, ఆమె కేవలం కొన్ని నెలలు మాత్రమే బతుకుతుందని తేల్చి చేప్పినట్లు 'ది ఆస్ట్రేలియన్' పత్రిక నివేదించింది.

సంప్రదాయ చికిత్సలు ఏవీ రోజీ కణితుల పెరుగుదలను అరికట్టలేకపోయాయి.

రంగంలోకి ఏఐ- క్యాన్సర్​కి వ్యాక్సిన్​..

17 ఏళ్ల పాటు మెషీన్ లెర్నింగ్, డేటా ఎనాలిసిస్ రంగంలో అనుభవం ఉన్న పాల్, తన వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రోజీ ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన ప్రధానంగా చాట్​జీపీటీని ఒక గైడ్‌లా వాడుకున్నారు. అలాగే ప్రోటీన్ నిర్మాణాలను విశ్లేషించే AlphaFold అనే ఏఐ ప్రోగ్రామ్ ద్వారా క్యాన్సర్‌కు కారణమవుతున్న ప్రోటీన్లను అధ్యయనం చేశారు.

వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ..

రోజీ కణితిలోని నిర్దిష్ట మ్యుటేషన్లను లక్ష్యంగా చేసుకుని పాల్ ఒక కస్టమ్ ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్‌ను రూపొందించారు. దీనిపై ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన కీలక విషయాలు వెల్లడించారు:

"మేము రోజీ కణితిని తీసుకుని, దాని డీఎన్​ఏ సీక్వెన్సింగ్ చేశాము. కణజాలాన్ని డేటాగా మార్చి, ఆ డేటా సాయంతో ఆమె డీఎన్​ఏలో ఎక్కడ లోపం ఉందో గుర్తించాము. దాని ఆధారంగానే నివారణను అభివృద్ధి చేశాము. ఈ మొత్తం ప్రక్రియలో ప్రతి దశలోనూ చాట్​జీపీటీ మాకు తోడ్పడింది," అని పాల్ పేర్కొన్నారు.

ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఆయన 'యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్' పరిశోధకులతో కలిసి పనిచేశారు. డిసెంబర్ నెలలో ఈ వ్యాక్సిన్‌ను రోజీకి అందించారు.

అద్భుతమైన మార్పు!

వ్యాక్సిన్ ఇచ్చిన కొద్ది కాలానికే రోజీ శరీరంలోని కణితులు 50 శాతానికి పైగా కుంచించుకుపోయాయి. రోజీ ఆరోగ్యం ఊహించని రీతిలో మెరుగుపడింది. ఒక సందర్భంలో రోజీ ఒక కుందేలును చూసి ఏకంగా ప్రహరీ గోడ దూకి దాని వెనుక పరిగెత్తడం చూసి పాల్ కూడా ఆశ్చర్యపోయారు.

"డిసెంబర్ సమయంలో కణితుల భారం వల్ల ఆమె చాలా నీరసంగా ఉండేది. కానీ చికిత్స తీసుకున్న ఆరు వారాల తర్వాత, నేను ఆమెను డాగ్ పార్కుకు తీసుకెళ్లినప్పుడు ఒక కుందేలును చూసి అమాంతం గోడ దూకి ఉరికింది. ఇది క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేస్తుందని నేను భ్రమపడటం లేదు, కానీ ఈ చికిత్స వల్ల రోజీకి మరికొంత కాలం ఆయుష్షు పెరగడమే కాకుండా, ఆమె జీవన నాణ్యత (క్వాలిటీ ఆఫ్​ లైఫ్​) పెరిగిందని నేను నమ్ముతున్నాను," అని పాల్ సంతోషం వ్యక్తం చేశారు.

అయితే, ఈ వినూత్న చికిత్సకు అనుమతులు పొందడం అంత సులభం కాలేదు. దీనికి అవసరమైన ఎథిక్స్ అప్రూవల్​ పొందేందుకే పాల్‌కు మూడు నెలల సమయం పట్టింది.

పాల్ సాధించిన ఈ విజయం పర్సనలైజ్డ్ మెడిసిన్- క్యాన్సర్ చికిత్సలో ఏఐ పోషించబోయే కీలక పాత్రను ప్రపంచానికి చాటిచెబుతోంది. వైద్య నిపుణులు సైతం ఈ వినూత్న పద్ధతి భవిష్యత్తులో కొత్త క్యాన్సర్ థెరపీలకు దారితీస్తుందని ప్రశంసిస్తున్నారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఇది ఎలాంటి మెడికల్​ రికమెండేషన్​ కాదు.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More