...
...
Next Story

Ayodha Ram Mandir : అయోధ్య రామ మందిర విరాళాల వివాదం.. ఆ పనిచేసింది ఎవరు?

Ayodha Ram temple donations : అయోధ్య రాముడి విరాళాల గోల్‌మాల్ వివాదంపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. ఈ ఘటనకు నగదు లెక్కింపు సిబ్బందే ప్రాథమికంగా బాధ్యులని, ఆలయ నిర్వహణకు సీఈఓ అవసరమని ఆయన పేర్కొన్నారు.

Published on: Jun 20, 2026, 09:08:33 IST
Advertisement

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ వివాదంపై రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నియమించిన 44 మంది నగదు లెక్కింపు సిబ్బందే ప్రాథమికంగా ఈ ఘటనకు బాధ్యులని ఆయన స్పష్టం చేశారు. అయితే, పూర్తి స్థాయి విచారణ జరగకుండా ఈ వివాదంలో ఎవరిని పడితే వారిని వేలెత్తి చూపించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఆలయాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

అయోధ్య రామ మందిర విరాళల దుర్వినియోగం కేసు అప్డేట్స్.. (ANI Video Grab/ File)
అయోధ్య రామ మందిర విరాళల దుర్వినియోగం కేసు అప్డేట్స్.. (ANI Video Grab/ File)

రామ మందిర నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న తరుణంలో ఇలాంటి వివాదం రావడం తనకు ఎంతో బాధ కలిగించిందని నృపేంద్ర మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పాత్రపై వస్తున్న ఆరోపణల గురించి మాట్లాడుతూ.. ఈ సమయంలో ఏ ఒక్కరినీ బ్లేమ్ చేయడంలో అర్థం లేదన్నారు. చంపత్ రాయ్ తన సిబ్బందిని ఎక్కువగా నమ్మారనే ఆరోపణలపై మిశ్రా స్పందిస్తూ.. నగదు లెక్కింపు బాధ్యతలు తీసుకున్న వారు తమ విధిని సక్రమంగా నిర్వహించలేదని, వారిపై ట్రస్ట్ అవసరానికి మించి ఆధారపడిందని పునరుద్ఘాటించారు.

తాజా వివాదం నేపథ్యంలో, రాబోయే రోజుల్లో రామ మందిర మేనేజ్‌మెంట్‌లో, ట్రస్ట్‌లో పెద్ద ఎత్తున మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయ నిర్వహణలో మార్పులపై మిశ్రా మాట్లాడుతూ.. “నేను దీనిపై ఎలాంటి అధికారిక ప్రతిపాదనను ఇంకా సమర్పించలేదు. కానీ నా అభిప్రాయాలను బహిరంగంగానే పంచుకున్నాను. రామాలయ సరైన నిర్వహణ కోసం మాకు పూర్తి సమయం పనిచేసే ఒక సీఈఓ అవసరం. అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌కు రామ మందిర్ మేనేజ్‌మెంట్‌ను అప్పగించాలనేది నా అభిప్రాయం,” అని మాజీ బ్యూరోక్రాట్ అయిన నృపేంద్ర మిశ్రా పేర్కొన్నారు.

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 ఫిబ్రవరి 20న నృపేంద్ర మిశ్రాను అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్‌గా నియమించి, రామాలయ ప్రాజెక్టును మొదటి నుంచి చివరి వరకు పూర్తి చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు. కమిటీ ఛైర్మన్‌గా ఉన్న నృపేంద్ర మిశ్రా.. పనుల పురోగతిని సమీక్షించడానికి క్రమంతప్పకుండా అయోధ్యను సందర్శిస్తుంటారు. జూన్ 13న నిర్మాణ కమిటీ చివరి సమావేశాన్ని నిర్వహించింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe