...
...
Next Story

Electric car : కస్టమర్లకు షాక్! బెస్ట్​ సెల్లింగ్ విండ్సర్​ ఈవీ ధరను పెంచేసిన ఎంజీ మోటార్..

MG Windsor EV : భారత మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందుతున్న ఎంజీ విండ్సర్ ఈవీ ధరలను జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా పెంచేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయం కారణంగా జులై 2026 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ కారు ధరలపై వేరియంట్‌ను బట్టి రూ. 40,000 నుంచి రూ. 60,000 వరకు పెంచింది. పూర్తి వివరాలు..

Published on: Jul 6, 2026, 06:43:40 IST
Advertisement

భారత ఆటోమొబైల్ రంగంలోని ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా' వాహనదారులకు షాకిచ్చింది. తన బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ మోడల్ అయిన 'విండ్సర్ ఈవీ' ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడిసరుకుల వ్యయం, ఇతర ఉత్పత్తి ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే కియా, టయోటా వంటి ప్రముఖ సంస్థలు తమ కార్ల ధరలను సవరించగా, ఇప్పుడు ఈ లిస్ట్​లోకి ఎంజీ కూడా చేరింది.

ఎంజీ విండ్సర్ ఈవీ- బేస్ వేరియంట్‌పైనే ఎక్కువ పెంపు!

ఎంజీ విండ్సర్​ ఈవీ..
ఎంజీ విండ్సర్​ ఈవీ..

ఎంజీ విండ్సర్ ఈవీ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుండగా, అన్ని వేరియంట్లపైనా ధరల పెంపు ప్రభావం పడింది. విశేషం ఏంటంటే, ఈ కారు బేస్ మోడల్ అయిన 'ఎక్సైట్' వేరియంట్‌పైనే కంపెనీ గరిష్టంగా రూ. 60,000 పెంచేసింది.

కారు మోడళ్లను బట్టి ధరల పెంపు వివరాలు శాతాల్లో చూస్తే 2.15 శాతం నుంచి 4.26 శాతం వరకు ఉంది. కొత్తగా సవరించిన ధరల పట్టికను ఒకసారి పరిశీలిస్తే..

ఎంజీ విండ్సర్​ ఈవీ ఎక్సైట్ వేరియంట్​ పాత ధర రూ. 14.10 లక్షలు. ఇప్పుడు రూ. 60వేలు పెరిగి, రూ .14.70 లక్షలకు చేరింది.

ఇక ఎక్స్​క్లూజివ్ వేరియంట్​ పాత ధర రూ. 15.53 లక్షలు. రూ. 46,900 పెంపుతో రూ. 16 లక్షలకు వెళ్లింది.

మరోవైపు గతంలో రూ. 16.35 లక్షల వరకు ఉన్న ఎసెన్స్ వేరియంట్ ధర సైతం రూ. 46,900 పెరిగి రూ. 17 లక్షలకు చేరింది.

ఇక ఎంజీ విండ్సర్​ ఈవీ ఎక్స్​క్లూజివ్ ప్రో వేరియంట్ రూ. 52వేల ప్రైజ్​ హైక్​తో రూ. 17.38 లక్షలు నుంచి రూ. 17.90 లక్షలకు పెరిగింది.

ఎంజీ విండ్సర్ ఈవీ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లను అందిస్తున్నారు. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ వేరియంట్లలో 38 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది పూర్తి ఛార్జింగ్‌పై 332 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

మరోవైపు టాప్ ఎండ్ మోడల్స్ అయిన ఎక్స్‌క్లూజివ్ ప్రో, ఎసెన్స్ ప్రో వేరియంట్లలో పెద్దదైన 52.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 449 కిలోమీటర్ల మేర ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వేరియంట్ ఏదైనప్పటికీ, అన్ని మోడళ్లు కూడా సమానంగా 136 పీఎస్ పవర్‌ను, 200 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీఈ కారు ఛార్జింగ్ సమయం కూడా చాలా వేగంగా ఉంటుంది. చిన్న బ్యాటరీ కలిగిన వేరియంట్లు 45 కేడబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. దీని సాయంతో కేవలం 45 నిమిషాల్లోనే బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా, పెద్ద బ్యాటరీ (52.9 కేడబ్ల్యూహెచ్) కలిగిన ప్రో వేరియంట్లు 60 కేడబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తాయి. ఇవి 20 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి దాదాపు 50 నిమిషాల సమయం పడుతుంది.

ఈ ఎంజీ విండ్సర్​ ఈవీ.. 2025లో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా నిలిచింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe