రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వివరాలను ప్రకటించింది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ తో 37 మంది సభ్యుల పదవీకాలం ముగియనుంది.

మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, అసోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో సీట్లు ఖాళీ అవుతున్నాయి. తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న అభిషేక్ సింఘ్వీ(కాంగ్రెస్), కేఆర్ సురేశ్ రెడ్డి (బీఆర్ఎస్ ) పదవీకాలం పూర్తి కానుంది. వీరి పదవీకాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తుంది. దీంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
- రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ - 26 ఫిబ్రవరి 2026.
- నామినేషన్లకు చివరి తేదీ - 5 మార్చి 2026.
- నామినేషన్ల పరిశీలన - 6 మార్చి 2026.
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - 9 మార్చి 2026.
- పోలింగ్ తేదీ - 16 మార్చి(సోమవారం).
- పోలింగ్ సమయం - ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
- ఓట్ల లెక్కింపు - 16 మార్చి 2026.
- ఎన్నికల ప్రక్రియ పూర్తి - 20 మార్చి 2026.
ఇక జూన్ లో ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజ్యసభ స్థానాలు ఖాళీలు కానున్నాయి. వైసీపీ నుంచి ఎంపీలుగా ఉన్న అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ సభ్యుడు సానా సతీష్ల పదవీకాలం జూన్తో ముగుస్తుంది. త్వరలోనే ఈ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదలవుతుంది.