నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సంచలన విషయాలను వెల్లడించింది. ఈ కుట్రతో ఎన్టీఏ (NTA) అధికారులకు కానీ, ప్రభుత్వ సిబ్బందికి కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో మంగళవారం చార్జ్షీట్ దాఖలు చేసింది. అరెస్ట్ చేసిన 13 మంది నిందితులపై నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాసఘాతుకం, సాక్ష్యాల విధ్వంసంతో పాటు అవినీతి నిరోధక చట్టం, ప్రజా పరీక్షల (అక్రమాల నిరోధక) చట్టం 2024 కింద కేసులు నమోదు చేసింది.
రూపకర్తలైన ప్రైవేట్ ఉపాధ్యాయులే సూత్రధారులు

పరీక్షా పత్రాలను తయారు చేసేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులైన ప్రైవేట్ ఉపాధ్యాయులే ఈ లీకేజీకి అసలు కారణమని సీబీఐ తన విచారణలో తేల్చింది. కెమిస్ట్రీ ప్రొఫెసర్ పి.వి. కులకర్ణి, బయాలజీ నిపుణురాలు మనీషా మంధారే, ఫిజిక్స్ నిపుణురాలు మనీషా హవల్దార్లను ప్రధాన నిందితులుగా చార్జ్షీట్లో పేర్కొంది. వీరంతా ప్రైవేట్ వ్యక్తులు కావడం వల్ల విచారణ జరిపేందుకు ప్రభుత్వ అనుమతి (Prosecution Sanction) అవసరం లేదని సీబీఐ వివరించింది.
సొంత ఇళ్లలోనే ప్రత్యేక క్లాసులు.. చేతిరాత నోట్స్ లభ్యం
పి.వి. కులకర్ణి ఏప్రిల్ నెలలోనే పూణేలోని తన నివాసంలో కొందరు ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చి, లీకైన కెమిస్ట్రీ ప్రశ్నలు, జవాబులను నేరుగా రాయించినట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు బయాలజీ నిపుణురాలు మనీషా మంధారే ఏప్రిల్ 27 నాటికే బోటనీ, జూలజీ ప్రశ్నలను పొంది, తన ఇంట్లో జరిగే క్లాసుల్లో విద్యార్థులకు అందించింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న హ్యాండ్రైటింగ్ నోట్స్.. పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో పూర్తిగా సరిపోలడాన్ని అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
92 ప్రాంతాల్లో దాడులు.. పక్కా ఆధారాలు
ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులతో పాటు దళారులు, కోచింగ్ సెంటర్లతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు సహా మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. వీరిపై అభియోగాలు మోపేందుకు 360 మంది సాక్షుల వాంగ్మూలాలు, 422 పత్రాలు, 43 భౌతిక ఆధారాలను సేకరించినట్లు సీబీఐ వెల్లడించింది. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లోని 92 చోట్ల సోదాలు నిర్వహించి డిజిటల్ పరికరాలు, కమ్యూనికేషన్ సాధనాలను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, హ్యాండ్రైటింగ్ విశ్లేషణ కూడా నిందితుల పాత్రను నిర్ధారించాయి.
అకౌంట్లు ఫ్రీజ్.. కొనసాగుతున్న దర్యాప్తు
అక్రమ లావాదేవీలను గుర్తించిన సీబీఐ.. నిందితులకు చెందిన పలు బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, డీమ్యాట్ అకౌంట్ను ఫ్రీజ్ చేసింది. మే 3న జరిగిన పరీక్షలో అక్రమాలు జరిగాయని మే 12న కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ, మే 13న మొదటి అరెస్ట్ చేసింది. లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మే 3 నాటి పరీక్షను రద్దు చేసి, జూన్ 21న తిరిగి నిర్వహించారు. జూలై 16న వెలువడిన ఫలితాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ కేసులో తదుపరి విచారణ ఇంకా కొనసాగుతోందని, దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని సీబీఐ స్పష్టం చేసింది.
{{/usCountry}}అక్రమ లావాదేవీలను గుర్తించిన సీబీఐ.. నిందితులకు చెందిన పలు బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, డీమ్యాట్ అకౌంట్ను ఫ్రీజ్ చేసింది. మే 3న జరిగిన పరీక్షలో అక్రమాలు జరిగాయని మే 12న కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ, మే 13న మొదటి అరెస్ట్ చేసింది. లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మే 3 నాటి పరీక్షను రద్దు చేసి, జూన్ 21న తిరిగి నిర్వహించారు. జూలై 16న వెలువడిన ఫలితాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ కేసులో తదుపరి విచారణ ఇంకా కొనసాగుతోందని, దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని సీబీఐ స్పష్టం చేసింది.
{{/usCountry}}