CBSE Board Exams 2026 : అధిక మార్కులు సాధించేందుకు గోల్డెన్ టిప్స్ ఇవి..

సీబీఎస్ఈ 2026 బోర్డు పరీక్షల్లో 90శాతం పైగా మార్కులు సాధించాలంటే కేవలం కష్టపడి చదివితే సరిపోదు, స్మార్ట్ ప్లానింగ్ కూడా అవసరం. కాన్సెప్ట్‌లపై పట్టు, తప్పుల నుంచి నేర్చుకోవడం, క్రమబద్ధమైన రివిజన్ ద్వారా టాపర్లుగా నిలవవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Published on: Jan 20, 2026 5:40 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు కీలక సమయం ఆసన్నమైంది. 2026 ఫిబ్రవరి 17 నుంచి బోర్డు పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ తక్కువ సమయంలో సిలబస్‌ను ఎలా పూర్తి చేయాలి? పరీక్షల్లో అత్యధిక మార్కులు ఎలా సాధించాలి? అనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. అయితే, సరైన వ్యూహంతో ముందుకు సాగితే.. సీబీఎస్​ఈ బోర్డు పరీక్షల్లో 90 శాతం మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదుని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని టిప్స్​ని సూచిస్తున్నారు. వాటిని ఇక్కడ తెలుసుకోండి..

సీబీఎస్​ఈ ప్రిపరేషన్​ టిప్స్​..
సీబీఎస్​ఈ ప్రిపరేషన్​ టిప్స్​..

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026- ఈ టిప్స్​ ఫాలో అవ్వండి..

1. 'ఎర్రర్ నోట్‌బుక్' తప్పనిసరి-

చాలామంది విద్యార్థులు చదువుతారు కానీ, తాము ఎక్కడ తప్పు చేస్తున్నామో గమనించరు. అందుకే ఒక ప్రత్యేకమైన ‘ఎర్రర్ నోట్‌బుక్’ నిర్వహించడం చాలా అవసరం. సీబీఎస్​ఈ ప్రాక్టీస్ టెస్టులు లేదా ప్రీ-బోర్డ్ పరీక్షల్లో మీరు చేసే పొరపాట్లను ఇందులో నోట్ చేసుకోవాలి. ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు ఈ తప్పులను ఒకసారి రివిజన్ చేసుకుంటే, అవే పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది మీ ఖచ్చితత్వాన్ని అద్భుతంగా పెంచుతుంది.

2. సమతుల్యమైన ప్రిపరేషన్-

సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో ఫలానా చాప్టర్ నుంచే ఎక్కువ మార్కులు వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వెయిటేజీ అనేది ప్రతి ఏడాది మారుతూ ఉంటుంది. తరచుగా అడిగే ప్రశ్నలపై దృష్టి పెట్టడం మంచిదే కానీ, ఏ చాప్టర్‌ను పూర్తిగా వదిలేయకూడదు. సిలబస్ మొత్తాన్ని కవర్ చేస్తూ బ్యాలెన్స్‌డ్​గా చదవడం అత్యంత సురక్షితమైన మార్గం.

3. బట్టీ పట్టకండి.. అర్థం చేసుకోండి!

విషయాన్ని అర్థం చేసుకోకుండా బట్టీ పట్టే పద్ధతికి స్వస్తి చెప్పాలి. కాన్సెప్ట్‌లను మూలాల నుంచి అర్థం చేసుకోవడంపైనే దృష్టి పెట్టండి. క్లాస్ నోట్స్‌ను ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తూ, లెక్కలు, అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. గత ఏళ్ల సీబీఎస్​ఈ బోర్డు పరీక్షల ప్రశ్నపత్రాలను సాల్వ్ చేయడం వల్ల పరీక్షా సరళిపై అవగాహన వస్తుంది. కనీసం మూడు నాలుగు పూర్తి స్థాయి మాక్ టెస్టులు రాసి, మీ టీచర్ల ద్వారా వాటిని సరిదిద్దించుకుంటే మీ బలాలు, బలహీనతలు స్పష్టంగా తెలుస్తాయి.

పరీక్షలో సమాధానాలు రాసేటప్పుడు ఇవి పాటించండి:

క్వాలిటీ ముఖ్యం: గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చోవడం కంటే, తక్కువ సమయం చదివినా పూర్తి ఏకాగ్రతతో చదవడం ముఖ్యం.

ఎంసీక్యూలు ఇలా రాయండి: మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రశ్న సంఖ్య, మీరు ఎంచుకున్న ఆప్షన్ (ఉదా: ఏ లేదా బీ), ఆ ఆప్షన్‌లో ఉన్న వాక్యాన్ని కూడా స్పష్టంగా రాయాలి.

లెక్కలు, సబ్జెక్టివ్ సమాధానాలు: సమాధానం రాసేటప్పుడు ప్రశ్నలో ఇచ్చిన డేటా, ఉపయోగించిన ఫార్ములాలు, స్టెప్స్ స్పష్టంగా ఉండాలి. చివరలో ఆన్సర్‌ను హైలైట్ చేయండి.

డయాగ్రామ్స్ (బొమ్మలు): సైన్స్ లేదా ఇతర సబ్జెక్టుల్లో డయాగ్రామ్స్ గీసేటప్పుడు కేవలం పెన్సిల్ మాత్రమే వాడాలి. కేటాయించిన స్థలంలోనే బొమ్మలు నీట్‌గా ఉండాలి.

దిద్దుబాట్లు చేయకండి: ఏదైనా తప్పు పోతే దానిపై పిచ్చిపిచ్చిగా గీతలు గీయకుండా లేదా సున్నా చుట్టకుండా, ఒక చిన్న గీతతో నీట్‌గా కొట్టివేయండి.

కష్టపడటంతో పాటు పైన చెప్పిన స్మార్ట్ టిప్స్ పాటిస్తే 2026 సీబీఎస్​ఈ బోర్డు పరీక్షల్లో మీరు టాపర్‌గా నిలవడం ఖాయం. ఆల్ ది బెస్ట్!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More