Petrol price : చమురు రేటు ఢమాల్- కానీ ఇండియాలో పెట్రోల్​ ధర ఎందుకు తగ్గడం లేదు? కేంద్రం సమాధానం ఇది..

అంతర్జాతీయంగా ముడిచమురు (క్రూడాయిల్) ధరలు తగ్గినా పెట్రోల్ రేట్లు వెంటనే ఎందుకు తగ్గవని ప్రశ్నిస్తున్న వారికి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. పెట్రోల్ ధరల నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను, ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోజనాలను వివరించింది. పూర్తి వివరాలు..

Published on: Aug 3, 2026, 15:20:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (క్రూడాయిల్) ధరలు తగ్గగానే.. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర తక్షణమే తగ్గిపోవాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అయితే, గ్లోబల్ మార్కెట్‌లో ధరలు తగ్గినప్పటికీ దేశంలోని బంకుల్లో పెట్రోల్ ఎందుకు చౌకగా లభించడం లేదో వివరిస్తూ, ఇంధన ధరల చుట్టూ ఉన్న అనేక అపోహలను కేంద్ర ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేసింది. రిటైల్ ఇంధన ధరలు కేవలం అంతర్జాతీయ బెంచ్‌మార్క్ 'బ్రెండ్ క్రూడ్' పై మాత్రమే ఆధారపడి ఉండవని, దీని వెనుక అనేక ఇతర కారణాలు ఉంటాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇండియాలో పెట్రోల్​ ధర ఎందుకు తగ్గడం లేదు? (ANI)
ఇండియాలో పెట్రోల్​ ధర ఎందుకు తగ్గడం లేదు? (ANI)

జులై నెలలో క్రూడాయిల్ ఫ్యూచర్స్ దాదాపు 25 శాతం పెరిగి మార్చి తర్వాత అత్యధిక నెలవారీ లాభాన్ని నమోదు చేయగా, ఆ తర్వాత సోమవారం (ఆగస్టు 3) ఆసియా ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా 7.3 శాతం పడిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

పెట్రోల్ ధరలపై ప్రభుత్వం స్పష్టత.. అపోహలు- వాస్తవాలు

అపోహ 1: “క్రూడాయిల్ ధరలు పడిపోయాయి కదా, కాబట్టి పెట్రోల్ ధర వెంటనే లీటరుకు రూ.84 కంటే తక్కువకు రావాలి.”

వాస్తవం: పెట్రోలియం మంత్రిత్వ శాఖ కథనం ప్రకారం.. రిటైల్ పెట్రోల్ ధరలు కేవలం ఒక్క అంశంపై ఆధారపడి ఉండవు. ఈ కింది అనేక అంశాల కలయికతో ధర ఖరారవుతుంది:

  • అంతర్జాతీయ ముడిచమురు ధరలు
  • రూపాయి - డాలర్ మారకం విలువ
  • రవాణా, లోజిస్టిక్స్ ఖర్చులు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు
  • ఇథనాల్ సేకరణ ఖర్చులు
  • శుద్ధి, నిర్వహణ వ్యయాలు

అపోహ 2: “ఈ20 (20% ఇథనాల్ బ్లెండింగ్) వల్ల పెట్రోల్ ప్రియమవుతోంది.”

వాస్తవం: ప్రస్తుతం విక్రయిస్తున్న ప్రతి లీటర్ పెట్రోల్‌లో దాదాపు 20 శాతానికి పైగా స్వదేశీ రంగానికి చెందిన ఇథనాల్‌నే కలుపుతున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురుపై మన ఆధారపడటాన్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతోందని వివరించింది.

“రిటైల్ ఇంధన ధరలను నిర్ణయించడంలో అనేక అంశాలు పాత్ర పోషిస్తాయి. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో, దేశీయ ఇంధన భద్రతను మెరుగుపరచడంలో, అంతర్జాతీయ ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించడంలో ఇథనాల్ బ్లెండింగ్ కీలక పాత్ర పోషిస్తుంది,” అని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఎక్స్​ వేదికగా తెలిపింది.

ఇథనాల్ బ్లెండింగ్ వల్ల దిగుమతుల భారం తగ్గడం, ముడిచమురు షాక్‌ల నుంచి రక్షణ, ఇంధన భద్రత, రైతులకు మెరుగైన ఆదాయం లభించడమే కాకుండా ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని మంత్రిత్వ శాఖ వివరించింది.

చమురు సంస్థలకు భారీ నష్టాలు..

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) పెట్రోల్ యావరేజ్ డిపో ధరను లీటరుకు రూ.85.8గా నిర్ణయించాయని, అయితే మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో లీటరుకు దాదాపు రూ.11 చొప్పున అండర్-రికవరీలు (ఆర్జించాల్సిన ఆదాయంలో లోటు) ఎదుర్కొన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కాలంలో చమురు సంస్థల మొత్తం నష్టం (అండర్-రికవరీ) రూ.21,300 కోట్లకు చేరుకుంది. మార్కెట్ ఆధారిత విక్రయ ధర కంటే తక్కువ ధరకే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్‌ను విక్రయిస్తూ వచ్చాయని కేంద్రం స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు / యుద్ధ వాతావరణం మొదలైనప్పటి నుంచి ప్రపంచ ఇంధన వర్తకంలో 20 శాతం సాగే 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' రవాణా మార్గంలో అంతరాయాలు ఏర్పడ్డాయి. దీనితో చమురు ధరలు ఒకానొక దశలో ఏకంగా బ్యారెల్‌కు 120 డాలర్ల స్థాయికి ఎగసిపడ్డాయి. అయితే, ఇరాన్‌పై భారీ దాడి ప్రణాళికను విరమించుకోవడానికి అంగీకరించినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫలితంగా చమురు ధర దిగొచ్చింది.

గతంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ధరలు ఎక్కువగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే కారణమని అభిప్రాయపడింది. "రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యాట్ పన్నును తగ్గించుకుంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే పెట్రోల్ ధరలు నేరుగా తగ్గుతాయి," అని పేర్కొంటూ, పెట్రోల్ ధరలు తగ్గించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా వ్యాట్‌ను తగ్గించుకోవచ్చని స్పష్టం చేసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More