...
...
Next Story

Nepal floods : 1250 దాటిన మృతుల సంఖ్య- నేపాల్​కు మరోసారి వరద ముప్పు!

నేపాల్‌ సరిహద్దుల్లో సంభవించిన హిమపాతం, ఆకస్మిక వరదల వల్ల సంభవించిన దారుణ విపత్తులో మృతుల సంఖ్య 1,250 దాటింది. భోటెకోషి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో మళ్లీ వరద విరుచుకుపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Published on: Sep 3, 2026, 15:19:16 IST
Advertisement

హిమాలయ పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఊహించని ప్రళయం నేపాల్‌ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. టిబెట్-నేపాల్ సరిహద్దు సమీపంలో ఆగస్టు 26న సంభవించిన మంచు కొండచరియల విరిగిపాటు కారణంగా నదులు ఉప్పొంగి, తీవ్ర ఆకస్మిక వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. బాధితుల కోసం తొమ్మిదో రోజూ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గురువారం లభించిన మరికొన్ని మృతదేహాలతో కలిపి ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏకంగా 1,252కి పెరిగింది. మరోవైపు సుమారు 4,875 మందికి పైగా ఆచూకీ లభించకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ విరుచుకుపడనున్న వరద ప్రమాదం!

నేపాల్​ వరదల అనంతరం ఒక ప్రాంతం..
నేపాల్​ వరదల అనంతరం ఒక ప్రాంతం..

ఒకవైపు నేపాల్​లో కొట్టుకుపోయిన గ్రామాలు, మట్టిదిబ్బల్లో చిక్కుకున్న బాధితుల కోసం వేలాది మంది సైనిక బృందాలు గాలిస్తుండగానే, మరోవైపు వర్షాలు కలవరపెడుతున్నాయి. భోటెకోషి నది ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మళ్లీ నదీమట్టాలు ప్రమాదకర స్థాయికి పెరుగుతున్నాయని వాతావరణ శాఖ సాంకేతిక నిపుణురాలు సరస్వతి బిష్ట వెల్లడించారు.

"భోటెకోషి, త్రిశూలి నదులతో పాటు రసువా, నువాకోట్ జిల్లాల గుండా ప్రవహించే చిన్న వాగులు ఉప్పొంగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి," అని సరస్వతి బిష్ట స్పష్టం చేశారు. నదీ పరివాహక, దిగువ ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు. తాప్లేజంగ్, పంచ్‌థార్, ఖాఠ్మాండుతో పాటు కొండప్రాంతాలు, పర్వత జిల్లాలైన కాలికోట్, ముస్తాంగ్ ప్రాంతాల్లోని నదుల్లోనూ మధ్యస్థాయి వరద ప్రమాదం ఉందని అధికారులు విశ్లేషిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో భయానక దృశ్యాలు- తీరని నష్టం..

నేపాల్ పోలీసుల వివరాల ప్రకారం చిత్వాన్ జిల్లాలోనే అత్యధికంగా 355 మృతదేహాలను వెలికితీశారు. నవల్‌పరాసి ఈస్ట్ జిల్లాలో 218, నవల్‌పరాసి వెస్ట్ జిల్లాలో 208, నువాకోట్‌లో 177, రసువాలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దుకు కొట్టుకువచ్చిన 18 మృతదేహాలను భారత యంత్రాంగం నేపాల్‌ అధికారులకు అప్పగించింది. సరిహద్దుకు అవతల ఉన్న టిబెట్ పరిధిలోని గైరోంగ్ ప్రాంతంలోనూ వరదల వల్ల 21 మంది మరణించగా, 541 మంది గల్లంతయ్యారు.

మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోవడంతో, ఆచూకీ దొరకని తమ వారి కోసం కుటుంబసభ్యులు బొమ్మలను తయారుచేసి పశుపతినాథ్ ఆర్యఘాట్ వద్ద దహన సంస్కారాలు నిర్వహిస్తుండటం అక్కడి విషాదకర పరిస్థితులకు అద్దం పడుతోంది!

వాతావరణ మార్పుల ప్రభావమే కారణమా?

పర్వత ప్రాంతాల్లో సంభవిస్తున్న ఈ విధ్వంసానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. "హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఈ తీవ్ర ప్రమాదాలపై, వాతావరణ మార్పుల ముప్పుపై అంతర్జాతీయ సమాజం ముందు గళం విప్పాల్సిందే," అని నేపాల్ ప్రధాని బలేంద్ర షా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో స్పష్టం చేశారు.

టిబెట్ సరిహద్దు ప్రాంతంలో చిక్కుకుపోయిన సుమారు 3,000 మంది నేపాల్ పౌరులలో ఇప్పటికే 2,500 మందికి పైగా క్షేమంగా స్వదేశానికి చేరుకోగా, కేరుంగ్ సరిహద్దు పాయింట్ వద్ద మిగిలిన వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు రాయబార చర్చలు కొనసాగుతున్నాయి. భారతదేశంలోనూ ఈ ప్రభావం పడే అవకాశం ఉండటంతో సరిహద్దు జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe