...
...
Next Story

దిశ సాలియాన్ కేసులో సీబీఐ విచారణకు బొంబాయి హైకోర్టు ఆదేశం

బాలీవుడ్ సెలబ్రిటీ మేనేజర్ దిశ సాలియాన్ అనుమానాస్పద మృతి కేసును బొంబాయి హైకోర్టు సీబీఐకి అప్పగించింది. తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించరాదని స్పష్టం చేస్తూ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.

Published on: Sep 2, 2026, 15:53:41 IST
Advertisement

బాలీవుడ్ సెలబ్రిటీ మేనేజర్ దిశ సాలియాన్ మృతి కేసులో బొంబాయి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో జరిగిన ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించింది. అయితే దర్యాప్తు అధికారికి తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితుడిగా భావించకూడదని జస్టిస్ సారంగ్ వి కోత్వాల్, జస్టిస్ రంజిత్‌సిన్హా భోంస్లేలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

అసలు ఏం జరిగింది?

దిశ సాలియాన్ కేసులో సీబీఐ విచారణకు బొంబాయి హైకోర్టు ఆదేశం
దిశ సాలియాన్ కేసులో సీబీఐ విచారణకు బొంబాయి హైకోర్టు ఆదేశం

2020 జూన్‌లో ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఒక నివాస భవనం 14వ అంతస్తు నుంచి కిందపడి 28 ఏళ్ల దిశ సాలియాన్ మరణించారు. ఆ సమయంలో ఆమె తనకు కాబోయే భర్తతో పాటు స్నేహితులతో కలిసి విందు చేసుకుంటున్నారు. అప్పట్లో ముంబై పోలీసులు దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేశారు.

ఈ ఘటన జరిగిన ఆరు రోజులకే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం, గతంలో దిశ ఆయనకు మేనేజర్‌గా వ్యవహరించడంతో ఈ రెండు మరణాల మధ్య లింక్ ఉందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అయితే పోలీసులు ఎలాంటి కుట్ర లేదని, పార్టీ సమయంలో మనస్తాపం చెంది దిశ ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంటూ 2021 ఫిబ్రవరిలో మేజిస్ట్రేట్ కోర్టులో ముగింపు నివేదిక సమర్పించారు.

తండ్రి పోరాటం.. ఫోరెన్సిక్ ఆధారాలపై వాదనలు

పోలీసుల నివేదికను సవాలు చేస్తూ దిశ సాలియాన్ తండ్రి సతీష్ సాలియాన్ హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెపై అత్యాచారం, హత్య జరిగాయని, ప్రభావవంతమైన వ్యక్తులను కాపాడేందుకే పోలీసులు ఆధారాలను తొక్కిపెట్టారని ఆరోపించారు.

సతీష్ సాలియాన్ తరఫు న్యాయవాది నీలేష్ ఓజా కోర్టులో కీలక వాదనలు వినిపించారు. భవనం పైనుంచి కిందపడిన ప్రదేశానికి, మృతదేహం లభించిన స్థలానికి మధ్య 10 అడుగుల దూరం ఉందన్నారు. పైన నుంచి కిందకు పడితే మృతదేహం నిలువుగా పడాలి తప్ప 10 అడుగుల దూరంలో పడే అవకాశం లేదని, ఇది ఆత్మహత్య కాదనడానికి స్పష్టమైన నిదర్శనమని ఫొరెన్సిక్ విశ్లేషణను ఉటంకించారు. ఐదేళ్ల పాటు తమకు దర్యాప్తు నివేదిక కూడా ఇవ్వకుండా కేసును ముగించారని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ సంచలనం.. సీబీఐ విచారణకు ఆదేశం

అయితే ఈ కేసులో ఎలాంటి కుట్ర లేకపోతే ముంబై పోలీసులు ఇన్నేళ్లపాటు విచారణను ఎందుకు కొనసాగించారని హైకోర్టు ప్రశ్నించింది. కుమార్తెను కోల్పోయిన తండ్రి ఆవేదనను కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. నిజానిజాలు వెలుగులోకి రావాలంటే పారదర్శక దర్యాప్తు అవసరమని భావించిన కోర్టు, కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe