ప్రధాన్ నిష్క్రమణ.. నెట్టింట హల్ చల్ చేస్తున్న ‘E20 జనతా పార్టీ’

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనల తీవ్రతతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుసటి రోజే సోషల్ మీడియాలో మరో నిరసన గళం వినిపిస్తోంది. రవాణా శాఖ మంత్రి గడ్కరీ ప్రవేశపెట్టిన E20 ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా 'E20 జనతా పార్టీ' పేరుతో డిజిటల్ ఉద్యమం ఊపందుకుంది.

Published on: Jul 27, 2026, 12:08:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'కాక్రోచ్ జనతా పార్టీ' చేపట్టిన ఉద్యమం శాంతించక ముందే, సామాజిక మాధ్యమాల్లో 'E20 జనతా పార్టీ' పేరుతో సరికొత్త వ్యంగ్యాత్మక డిజిటల్ ఆందోళన మొదలైంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీసుకొచ్చిన E20 ఇథనాల్ పెట్రోల్ విధానంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ, ఈ ఆన్‌లైన్ వేదిక పౌరుల నుంచి విశేష మద్దతు కూడగట్టుకుంటోంది.

నెట్టింట హల్ చల్ చేస్తున్న ‘E20 జనతా పార్టీ’
నెట్టింట హల్ చల్ చేస్తున్న ‘E20 జనతా పార్టీ’

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన CJP ఆందోళన గత కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అభిజీత్ దిప్కే ప్రారంభించిన ఆ డిజిటల్ ప్రచారం భారీ ప్రజా ఉద్యమంగా మారి, పరీక్షల అక్రమాల బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చేసింది. ఆ ఆందోళన ముగిసిన వెంటనే, వ్యవస్థాపకుడెవరనేది వెల్లడికాకపోయినా 'E20 జనతా పార్టీ' ఖాతాలకు నెటిజన్ల నుంచి ఆదరణ లభిస్తోంది.

నెట్టింట రికార్డు స్థాయిలో పెరుగుతున్న మద్దతు

'E20 జనతా పార్టీ' పేరుతో ఉన్న ఒక ఎక్స్ (X) ఖాతా మే 2024 నుంచి ఉనికిలో ఉంది. గతంలో వేరే పేరుతో ఉన్న ఈ ఖాతాను, ఇటీవల CJP తరహాలోనే వ్యంగ్య వేదికగా మార్చారు. ఆదివారం నాటికి ఈ ఖాతాకు కొద్ది గంటల్లోనే 25,000 మందికి పైగా క్రొత్త ఫాలోవర్లు చేరారు. సోమవారం ఉదయానికి ఈ సంఖ్య 48,000 దాటింది. ఇన్స్టాగ్రామ్‌లో ఆదివారానికే లక్ష మంది ఫాలోవర్ల మైలురాయిని ఈ పేజీ దాటేసింది. ఆప్ నేత మనీష్ సిసోదియా కూడా ఈ ఖాతా పోస్టులను రీపోస్ట్ చేస్తూ తన మద్దతు తెలిపారు.

అసలు E20 జనతా పార్టీ డిమాండ్ ఏమిటి?

తనకు పెరుగుతున్న ఆదరణ మధ్య ఈ సంస్థ తమ లక్ష్యాన్ని స్పష్టం చేసింది. "మాకు ఉచిత పెట్రోల్ లేదా రాయితీలు అక్కర్లేదు. అలాగే ఇథనాల్ పెట్రోల్‌ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కూడా మేము అనడం లేదు. భారతీయులకు 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ కొనుగోలు చేసే ప్రాథమిక ఎంపిక హక్కును మాత్రమే ఇవ్వాలని కోరుతున్నాం" అని 'E20 జనతా పార్టీ' తమ ఎక్స్ ఖాతాలో పేర్కొంది.

తమది రాజకీయ పార్టీ కాదని మరొక పోస్టులో సదరు వేదిక వివరణ ఇచ్చింది. సామాన్య ప్రజల సమస్యలపై పోరాడే స్వతంత్ర పౌర వేదికగా తమను తాము ప్రకటించుకుంది. పారదర్శకతను పెంచడం, వినియోగదారుల హక్కులను కాపాడడం, E20 విధానం వల్ల కలిగే నిజమైన ప్రభావంపై బహిరంగ చర్చను ప్రోత్సహించడమే తమ ఏకైక ఎజెండా అని స్పష్టం చేసింది. రాజకీయ భావజాలంతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నామని తెలిపింది. దీని వెనుక ఎవరున్నారనే పుకార్లను నమ్మవద్దని, అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించవద్దని కోరింది. "కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెంటనే రాజీనామా చేయాలి," అని మరొక పోస్టులో డిమాండ్ చేసింది.

ఆగస్టు 4న పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు

ఇదే పేరుతో సుమారు 28,000 మంది ఫాలోవర్లు ఉన్న మరో ఖాతా ఆగస్టు 4న 'పార్లమెంట్ మార్చ్' నిర్వహించనున్నట్లు ప్రకటించింది. E20 పెట్రోల్ వాడకంతో పాటు వాణిజ్య వాహనాల్లో ఖరీదైన జీపీఎస్, పానిక్ బటన్ల అమరికను నిర్బంధం చేయడంపై నిరసన తెలుపుతూ టాక్సీ, టూరిస్ట్, కమర్షియల్ వాహనదారులు ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చింది. సంజయ్ సమ్రాట్ నేతృత్వంలో వేలాది మంది డ్రైవర్లు, వాహన యజమానులు పార్లమెంట్ ముట్టడికి సిద్ధమవుతున్నారు.

CJP ఉద్యమ నేపథ్యం.. ప్రధాన్ రాజీనామా

మే నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఒక విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతను, సోషల్ మీడియా యాక్టివిస్టులను "కాక్రోచ్‌లు", "పరాన్నజీవులు" అని సంబోధించారనే ప్రచారం తీవ్ర కలకలం రేపింది. ఆ వ్యాఖ్యలనే ఆయుధంగా మలుచుకున్న అభిజీత్ దిప్కే మే 15న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)ని ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఈ పేజీకి లక్షలాది మంది మద్దతుదారులు లభించారు.

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద CJP చేపట్టిన ఆందోళనలో సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా తరలించడంతో ఆందోళన తీవ్రరూపం దాల్చింది. జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే వేలాది మంది జంతర్ మంతర్‌ను చుట్టుముట్టారు. ఆరు రోజుల పాటు సాగిన సుదీర్ఘ నిరసనల అనంతరం, జూలై 25 శనివారం రోజున కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.

E20 ఇంధనం: ప్రయోజనాలు.. వివాదాలు

కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న E20 ఇంధనంలో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం ఉంటుంది. ముడిచమురు దిగుమతులను తగ్గించడం, వాహనాల ఉద్గారాలను అదుపు చేయడం, రైతులకు ఆసరాగా నిలవడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే, పాత వాహనాల ఇంజిన్లు దెబ్బతినడం, మైలేజీ తగ్గడం, ఇథనాల్ తయారీకి వాడే పంటలకు అధిక నీరు అవసరం కావడం వంటి కారణాలతో ఈ విధానంపై వాహనదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More