...
...
Next Story

E20 ఇంధనంపై రాజుకున్న వివాదం: గడ్కరీ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన E20 పెట్రోల్ విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలతో పాటు, ఆగస్టు 4న పార్లమెంట్ ముట్టడికి రవాణా సంఘాలు పిలుపునిచ్చాయి.

Published on: Jul 28, 2026, 15:24:06 IST
Advertisement

E20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) విధానంపై దేశ రాజధానిలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నీట్-యుజి (NEET-UG) వివాదం కాస్త సద్దుమణగడంతో, కేంద్రం అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ విధానంపై ప్రతిపక్షాలు, రవాణా రంగానికి చెందిన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ విధానానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రకటించగా, మరోవైపు కేంద్ర మంత్రుల రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

ఆగస్టు 1న 'నేషనల్ టౌన్ హాల్'.. కేజ్రీవాల్ పిలుపు

E20 ఇంధనంపై రాజుకున్న వివాదం: గడ్కరీ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్ (HT_PRINT)
E20 ఇంధనంపై రాజుకున్న వివాదం: గడ్కరీ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్ (HT_PRINT)

E20 విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆగస్టు 1న ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో 'నేషనల్ టౌన్ హాల్ ఎగైనెస్ట్ E20' (National Town Hall Against E20) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

"E20 పెట్రోల్‌ను ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి" అని అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

ఈ విధానానికి వ్యతిరేకంగా తాను చేపట్టిన ఆన్‌లైన్ పిటిషన్‌పై ఇప్పటికే 2 లక్షలకు పైగా సంతకాలు వచ్చాయని, ఆగస్టు 1 సమావేశం అనంతరం వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేస్తానని చెప్పారు. E20 ఇంధనం వల్ల కలుగుతున్న నష్టాలు, ధరల తగ్గింపుపై చర్చించేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు ఆయన తెలిపారు.

ఆగస్టు 4న పార్లమెంట్ ముట్టడికి రవాణా సంఘాల పిలుపు

ఢిల్లీకి చెందిన రవాణా సంఘాలు E20 విధానానికి వ్యతిరేకంగా ఆగస్టు 4న పార్లమెంట్ వైపు నిరసన ర్యాలీ నిర్వహించనున్నాయి. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల దేశవ్యాప్తంగా వాహనాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

దేశంలో 35 కోట్ల మందికి పైగా ఉన్న వాహనదారుల ఆందోళనలను పట్టించుకోకుండా ప్రభుత్వం E85, E100 ఇంధనాల వైపు వెళ్లడం సరికాదని ఆయన విమర్శించారు. ఇంధనంలో కల్తీ, నాణ్యతా లోపాలపై ఎలాంటి జవాబుదారీతనం లేదని లేఖలో ఆరోపించారు.

తప్పుడు ప్రచారంపై కోర్టును ఆశ్రయించిన నితిన్ గడ్కరీ

E20 విధానంపై తనపై, తన కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. మెటా, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై దావా వేసేందుకు హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది.

E20 విధానం ద్వారా తాము ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ విధానానికి తాను ఒక్కడినే బాధ్యుడిని కానని గడ్కరీ స్పష్టం చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల దెబ్బతిన్న ఒక్క కారును చూపించినా సరేనని ఆయన ఇదివరకు విసిరిన సవాలును గుర్తుచేశారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe