...
...
Next Story

Eiffel tower : మూతపడిన ఈఫిల్​ టవర్! హిందూ ఆధ్యాత్మిక బృందం ‘నిబంధనల’తో సిబ్బంది ఆందోళన

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఐకానిక్ 'ఈఫిల్ టవర్' వద్ద మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష చూపారంటూ సిబ్బంది సమ్మెకు దిగారు. ఒక హిందూ ఆధ్యాత్మిక బృందం పర్యటన సందర్భంగా మహిళా సిబ్బందిని కనిపించకుండా పక్కకు తప్పుకోవాలని ఆదేశించారంటూ తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

Published on: Sep 8, 2026, 09:10:20 IST
Advertisement

ప్రపంచ వింతల్లో ఒకటైన పారిస్ ఈఫిల్ టవర్ వేదికగా తీవ్ర వివాదం చెలరేగింది. ఒక ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక బృందం పర్యటించిన సమయంలో, అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులను విధులకు దూరంగా ఉండాలని, కనిపించకుండా పక్కకు తప్పుకోవాలని ఆదేశించారనే ఆరోపణలతో ఈఫిల్ టవర్ సిబ్బంది ఒక్కసారిగా నిరసన బాట పట్టారు. దీనికి నిరసనగా సోమవారం పూర్తి స్థాయిలో సమ్మె చేపట్టడంతో ఈఫిల్ టవర్ సందర్శన ఒకరోజు పాటు నిలిచిపోయింది.

అసలేం జరిగింది?

ఫ్రాన్స్‌ను కుదిపేస్తున్న 'ఈఫిల్ టవర్' వివాదం (REUTERS)
ఫ్రాన్స్‌ను కుదిపేస్తున్న 'ఈఫిల్ టవర్' వివాదం (REUTERS)

ఫ్రాన్స్ సబర్బ్స్‌లో కొత్తగా నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవ వేడుకల కోసం బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ సంస్థాన్ (బీఏపీఎస్)కి చెందిన దాదాపు 100 మంది ప్రతినిధుల బృందం ఇటీవలే పారిస్​కు వెళ్లి ఈఫిల్ టవర్‌ను సందర్శించింది. ఆ సమయంలో ఈఫిల్ టవర్ యాజమాన్యంతో పాటు అక్కడ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న మహిళా సిబ్బందిని "కనిపించకుండా ఉండాలని" నిబంధనలు విధించినట్లు ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి.

"ఈ బృందం పర్యటించే సమయంలో మహిళలు కనిపించకుండా జాగ్రత్త పడాలని, కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాల గుండా నడవకూడదని కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. కొందరు మహిళలను విధుల నుంచి తప్పించి వారి స్థానంలో పురుషులను నియమించారు. లింగం ఆధారంగా మమ్మల్ని పక్కన పెట్టడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది," అని ఈఫిల్ టవర్ ఉద్యోగ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిబంధనలను ఒప్పుకోవడం మా తప్పే: యాజమాన్యం

ఈఫిల్ టవర్‌ను నిర్వహించే ఎస్‌ఈటీఈ సంస్థ ఈ వ్యవహారంపై స్పందిస్తూ తమ పొరపాటును అంగీకరించింది. సదరు ఆధ్యాత్మిక బృందం "మహిళలతో సంభాషణలు లేదా కలయికలు పరిమితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని" ముందే కోరినట్లు తెలిపింది. అయితే, ఇటువంటి వివక్షతో కూడిన షరతులకు అంగీకరించడం తమ నిర్వహణ సూత్రాలకు, స్త్రీ-పురుష సమానత్వ విధానాలకు విరుద్ధమని, జరిగిన తప్పుకు బాధ్యత వహిస్తామని ప్రకటించింది. ఫ్రాన్స్ రిపబ్లికన్ విలువలకు, మహిళా సమానత్వానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఎస్‌ఈటీఈ అధ్యక్షుడు ఏరియల్ వేల్ స్పష్టం చేశారు.

బీఏపీఎస్ సంస్థ స్పందన, క్షమాపణలు..

ఈ ఘటనపై ఫ్రాన్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. పారిస్ మేయర్ ఇమ్మాన్యుయెల్ గ్రెగోయిర్ స్పందిస్తూ, ఉద్యోగుల ఆగ్రహం సహేతుకమైనదని, దీనిపై తక్షణమే విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

ఫ్రాన్స్ సమానత్వ శాఖ మంత్రి అరోర్ బెర్జే సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా విరుచుకుపడ్డారు. "ఫ్రాన్స్‌లో మహిళలను కనిపించకుండా తప్పుకోమని కోరే హక్కు ఎవరికీ లేదు. ఈ దేశంలో ఏ మతం, ఏ సిద్ధాంతం కూడా గణతంత్ర చట్టాల కంటే ఎక్కువ కాదు," అని హెచ్చరించారు.

ఫ్రాన్స్ అధ్యక్ష రేసులో ఉన్న మెరైన్ లీ పెన్, గాబ్రియేల్ అట్టల్ వంటి అగ్ర నాయకులు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. విశ్వాసాలు లేదా సంస్కృతుల పేరుతో మహిళల ప్రాధాన్యతను తగ్గిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

ఏటా దాదాపు 70 లక్షల మంది సందర్శకులను ఆకర్షించే ఈఫిల్ టవర్, సోమవారం రోజంతా సమ్మె కారణంగా మూతపడినప్పటికీ, మంగళవారం నుంచి యథావిధిగా తెరుచుకుంటుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe