...
...
Next Story

ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి రూ.25,000కి పెంపు: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) అర్హత వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ సవరణతో దేశవ్యాప్తంగా మరో 51 లక్షల మంది ఉద్యోగులకు కొత్తగా సామాజిక భద్రత లభించనుంది.

Updated on: Sep 16, 2026, 16:04:11 IST
Advertisement

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పరిధిలోకి వచ్చే వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు సామాజిక భద్రతను మరింత విస్తరించే దిశగా ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచుతూ కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.

12 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక పెంపు

ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి రూ.25,000కి పెంపు: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి రూ.25,000కి పెంపు: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

సరిగ్గా 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ వేతన పరిమితిని సవరించడం గమనార్హం. గతంలో 2004 నుంచి 2014 వరకు ఈ పరిమితి ఎలాంటి మార్పు లేకుండా కొనసాగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2014లో దీనిని రూ.15,000గా నిర్దేశించారు. నాటి నుంచి పెరుగుతున్న ఆదాయాలు, మారిన ఆర్థిక పరిస్థితులు, అధికారిక ఉపాధి రంగా విస్తరణను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తాజాగా రూ.25,000కి పెంచింది.

51 లక్షల మంది ఉద్యోగులకు అదనంగా లబ్ధి

"కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం తప్పనిసరి సామాజిక భద్రత పరిధిలోకి వస్తారు" అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. ఈ పెంపు ద్వారా ఎక్కువ మంది కార్మికులకు చట్టబద్ధమైన సామాజిక ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.

రూ.56,696 కోట్ల భారీ వ్యయం

ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ప్రస్తుతం ఈ పథకానికి వార్షిక బడ్జెట్ రూపంలో రూ.10,250 కోట్లు కేటాయిస్తుండగా, కొత్త సవరణతో ప్రభుత్వం చేసే వార్షిక వ్యయం రూ.11,339 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ఈ సామాజిక భద్రతా పథకాల నిమిత్తం ప్రభుత్వం సుమారు రూ.56,696 కోట్లు వెచ్చించనుంది.

విస్తృతమైన సామాజిక భద్రతా వ్యవస్థ

ఈ మార్పు వల్ల ఎక్కువ మందికి ఎలా లబ్ధి చేకూరుతుందో ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు.

1. గతంలో ఉన్న నిబంధన (రూ. 15,000 పరిమితి)

ఒక ఉద్యోగి బేసిక్ జీతం రూ. 15,000 వరకు ఉంటే, సదరు సంస్థ ఆ ఉద్యోగికి కచ్చితంగా (Mandatory) పీఎఫ్ ఖాతా తెరిచి పీఎఫ్ జమ చేయాలి.

జీతం రూ. 15,001 దాటితే, ఆ ఉద్యోగికి పీఎఫ్ ఇవ్వాలా వద్దా అనేది కంపెనీ యాజమాన్యం, ఉద్యోగి ఇష్టాయిష్టాలపై (Voluntary) ఆధారపడి ఉండేది. చాలా కంపెనీలు రూ. 15,000 దాటిన వారికి పీఎఫ్ సౌకర్యం కల్పించేవి కావు.

2. కొత్త నిబంధన (రూ. 25,000 పరిమితి)

ప్రభుత్వం ఈ గరిష్ఠ పరిమితిని రూ. 15,000 నుంచి రూ. 25,000కి పెంచింది.

దీని అర్థం: ఇకపై నెలవారీ జీతం రూ. 25,000 వరకు ఉన్న ప్రతి ఒక్కరికీ కంపెనీలు తప్పనిసరిగా పీఎఫ్ ఖాతా తెరిచి డబ్బులు జమ చేయాల్సిందే.

3. లబ్ధిదారుల సంఖ్య ఎలా పెరుగుతుంది?

రూ. 15,001 నుంచి రూ. 25,000 మధ్య జీతం పొందుతున్న ఉద్యోగులు (ఉదాహరణకు రూ. 18,000 లేదా రూ. 22,000 సంపాదించేవారు) ఇప్పటివరకు కంపెనీల నిబంధనల వల్ల పీఎఫ్ పరిధికి దూరంగా ఉన్నారు.

ఇప్పుడు గరిష్ఠ పరిమితిని రూ. 25,000కి పెంచడంతో, ఈ శ్రేణిలో ఉన్న సుమారు 51 లక్షల మంది ఉద్యోగులు కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వస్తారు.

వీరికి పీఎఫ్ పొదుపుతో పాటు ప్రతి నెలా పింఛను పథకం (EPS), ఉచిత ఇన్సూరెన్స్ (EDLI) ప్రయోజనాలు చట్టబద్ధంగా అందుతాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks