ITR e verify : ఐటీఆర్ ఫైల్ చేశారా? ఈ-వెరిఫికేషన్ చేయడం మర్చిపోకండి..

ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేసిన తర్వాత ఈ-వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి. ఐటీఆర్ ఫైల్ చేసిన 30 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే, మీ దరఖాస్తును ఐటీ శాఖ చెల్లనిదిగా పరిగణిస్తుంది.

Published on: Jun 29, 2026, 10:28:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆదాయపు పన్ను రిటర్నులను (ఐటీఆర్) దాఖలు చేయడంతోనే మీ బాధ్యత ముగిసిపోదు! దీని తర్వాత చేయాల్సిన అత్యంత కీలకమైన పని 'ఈ-వెరిఫికేషన్' అని గుర్తుపెట్టుకోవాలి. మీరు సమర్పించిన సమాచారం సరైనదేనని ధృవీకరించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. గడువులోగా ఐటీఆర్‌ను ఈ-వెరిఫై చేయకపోతే, మీరు ఫైల్ చేసిన రిటర్న్స్ ప్రాసెసింగ్ కావు. అవి పూర్తిగా చెల్లకుండా పోతాయి కూడా.

ఐటీఆర్​ ఈ-వెరిఫై చేసుకోవడం ఎలా? చేయకపోతే ఏమవుతుంది?
ఐటీఆర్​ ఈ-వెరిఫై చేసుకోవడం ఎలా? చేయకపోతే ఏమవుతుంది?

ఐటీఆర్ దాఖలు చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు ఖచ్చితంగా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఒకవేళ ఈ గడువు ముగిసిపోతే, ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ ‘కండోనేషన్ ఆఫ్ డిలే’ రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఐటీ శాఖ మీ అభ్యర్థనను ఆమోదిస్తేనే మీ ఐటీఆర్​ ఈ- వెరిఫికేషన్ చెల్లుబాటు అవుతుంది.

ఐటీఆర్ ఈ-వెరిఫై చేయడానికి అందుబాటులో ఉన్న మార్గాలు..

పన్ను చెల్లింపుదారులు తమ సౌకర్యాన్ని బట్టి కింది వాటిలో ఏదో ఒక పద్ధతిని ఎంచుకోవచ్చు:

ఆధార్ ఓటీపీ

నెట్ బ్యాంకింగ్

ముందే వాలిడేట్ చేసిన బ్యాంక్ ఖాతా ద్వారా ఈవీసీ

ముందే వాలిడేట్ చేసిన డీమ్యాట్ ఖాతా ద్వారా ఈవీసీ

డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్

బ్యాంక్ ఏటీఎం ద్వారా ఈవీసీ జనరేట్ చేయడం

ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్‌కు ముందే ఇవి సిద్ధం చేసుకోండి..

  • పాన్ కార్డ్ లింక్ అయి ఉండాలి.
  • ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్.
  • లాగిన్ అవ్వకుండా వెరిఫై చేయాలనుకుంటే ఐటీఆర్ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్.
  • ఈవీసీ పద్ధతి కోసం ముందే వాలిడేట్ చేసిన బ్యాంక్ లేదా డీమ్యాట్ ఖాతా.
  • నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ కోసం ఆయా బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ సదుపాయం యాక్టివ్‌గా ఉండాలి.

ఆధార్ ఓటీపీ ద్వారా ఈ-వెరిఫై చేయడం ఎలా?

ఐటీఆర్ సమర్పించిన తర్వాత ఇన్‌కమ్ టాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.

  • అక్కడ కనిపిస్తున్న 'e-Verify Return' ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • 'Verify through Aadhaar OTP' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ వివరాలను కన్ఫర్మ్ చేసి, ఓటీపీ జనరేట్ చేయండి.
  • ఆధార్‌తో లింక్ అయిన మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఆరు అంకెల ఓటీపీని ఎంటర్ చేయండి.
  • 'Validate' పై క్లిక్ చేయడంతోనే మీ ప్రక్రియ పూర్తవుతుంది. స్క్రీన్‌పై ట్రాన్సాక్షన్ ఐడీతో కూడిన కన్ఫర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది. అలాగే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్, మొబైల్‌కు కూడా సందేశం వస్తుంది.

ఇతర పద్ధతుల్లో ఐటీఆర్​ ఈ- వెరిఫికేషన్ విధానం..

నెట్ బ్యాంకింగ్ ద్వారా:

వెరిఫికేషన్ మెథడ్‌లో నెట్ బ్యాంకింగ్‌ను ఎంచుకుని, మీ బ్యాంక్‌ను సెలెక్ట్ చేసుకోండి. మీ బ్యాంక్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయి, అక్కడ లభించే లింక్ ద్వారా ఐటీ పోర్టల్‌కు రీడైరెక్ట్ అవ్వండి. పెండింగ్ రిటర్న్స్‌ను ఎంచుకుని ఈ-వెరిఫై చేయండి.

బ్యాంక్ ఖాతా / డీమ్యాట్ ఖాతా ఈవీసీ ద్వారా:

సదరు ఆప్షన్‌ను ఎంచుకుని ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) జనరేట్ చేయండి. మీ మొబైల్ లేదా ఈమెయిల్‌కు వచ్చిన కోడ్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అయితే మీ బ్యాంక్ లేదా డీమ్యాట్ ఖాతా ముందే వాలిడేట్ అయి, ఈవీసీ ఎనేబుల్ అయి ఉండటం తప్పనిసరి.

బ్యాంక్ ఏటీఎం ద్వారా:

డెబిట్ కార్డును ఏటీఎంలో ఉంచి, పిన్ ఎంటర్ చేసాక 'Generate EVC for Income Tax Filing' ఆప్షన్ ఎంచుకోండి. మొబైల్‌కు వచ్చిన ఈవీసీ కోడ్‌ను ఐటీ పోర్టల్‌లో లాగిన్ అయి ఎంటర్ చేయడం ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు.

డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్:

డీఎస్‌సీ ఆప్షన్ ఎంచుకుని, emSigner యుటిలిటీని రన్ చేయాలి. మీ డీఎస్‌సీ యూఎస్‌బీ టోకెన్‌ను కనెక్ట్ చేసి, పాస్‌వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా డిజిటల్ సంతకం చేసి వెరిఫై చేయవచ్చు.

మీ తరఫున ఇతరులు చేయవచ్చా?

మీరు అధికారికంగా ఎవరినైనా ప్రతినిధిగా (ఆథరైజ్డ్​ సిగ్నేటరీ/ రిప్రెజెంటేటివ్ అస్సెస్సీ) నియమిస్తే, వారు కూడా మీ తరఫున ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. ఈ సందర్భంలో ఓటీపీ లేదా ఈవీసీలు సదరు ప్రతినిధి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు అందుతాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More